Jagtial Congress: జగిత్యాల కాంగ్రెస్లో మున్సిపల్ టికెట్ల మంట - సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి - రచ్చ రచ్చే
Jeevan Reddy: జగిత్యాల కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికల చిచ్చు దుమారం రేపుతోంది. తన అనుచరులకు తక్కువ టిక్కెట్లు కేటాయించడంతో జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Municipal election row is creating chaos in Jagtial Congress: జగిత్యాల కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపు చిచ్చు రేపింది. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మున్సిపాలిటీలోని మొత్తం 50 సీట్లకు గానూ, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి 30 సీట్లు, సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 20 సీట్లు కేటాయించారు. టికెట్ల పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవన్ రెడ్డి అనుచరులు ఎమ్మెల్యే సంజయ్ను లక్ష్యంగా చేసుకుని బండ బూతులు తిడుతూ నిరసన తెలపడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఈ గొడవకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
తగ్గేదే లేదంటున్న జీవన్ రెడ్డి
టికెట్ల కేటాయింపుపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు కాకుండా, మొన్నటికి మొన్న వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ఆయన అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగిత్యాలలో కాంగ్రెస్ అంటే క్రమశిక్షణకు మారుపేరు, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బాధాకరం. క్షేత్రస్థాయిలో కష్టపడిన వారికే టికెట్లు ఇవ్వాలి తప్ప, పైరవీకారులకు కాదు. నా వర్గీయులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను అని పరోక్షంగా హెచ్చరించారు. జగిత్యాలలో ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉందన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ వర్గం కౌంటర్
మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చామని, సర్వే నివేదికల ఆధారంగానే 30 సీట్ల కేటాయింపు జరిగిందని వారు వాదిస్తున్నారు. మున్సిపాలిటీలో పట్టున్న నాయకులను విస్మరించలేదని, అందరినీ కలుపుకుని పోవాలనేదే తమ ఉద్దేశమని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. అయితే, టికెట్లు దక్కని ఆశావహులు మాత్రం సంజయ్ తీరుపై మండిపడుతూ.. పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
కంటతడి పెడుతున్న జీవన్ రెడ్డి వర్గం
— Satya Telangana (@satya_telangana) February 3, 2026
నిన్న రాత్రి దాక నాకు టికెట్ ఇస్తానని చెప్పారు ఇవాళ నాకు టికెట్ లేదని చెబుతున్నారు
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నుండి టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో కన్నీటి పర్యంతమైన కాంగ్రెస్ పార్టీ మెట్పల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు హరిత
#viralvideo pic.twitter.com/0VUdfopyUe
సోషల్ మీడియాలో రచ్చ.. హైకమాండ్ సీరియస్
ఈ వర్గపోరు సోషల్ మీడియా వేదికగా రచ్చకెక్కడంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం దీనిపై దృష్టి సారించింది. గ్రూపు రాజకీయాల వల్ల ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇద్దరు అగ్రనేతల మధ్య సయోధ్య కుదర్చడానికి పీసీసీ దూతలను పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ పంచాయతీ ఎటు దారితీస్తుందోనని కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అనుకుంటూంటే... జగిత్యాలలో పరిస్థితి వేరుగా ఉంది.























