BRS MLAs Defection Case: కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు.. అనర్హత పిటిషన్పై విచారణకు రావాలని ఆదేశాలు
Kadiyam Srihari | అనర్హత పిటిషన్ పై విచారణకు రావాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నోటీసులు ఇచ్చారు.

Speaker Notices to Kadiyam Srihari | హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల అంశం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదాన్ని హీటెక్కిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. బుధవారం (ఫిబ్రవరి 4న) ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. పార్టీ మారిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అనర్హత వేటుపై బీఆర్ఎస్ పట్టు
ఎన్నికల గుర్తుపై గెలిచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే వేరే పార్టీలో చేరడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ వాదిస్తోంది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయడంలో జాప్యం జరుగుతోందని గతంలోనే ఆ పార్టీ నేతలు హైకోర్టును కూడా ఆశ్రయించారు. విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకోవాలని, ఎందుకు జాప్యం చేస్తున్నారని పలుమార్లు సుప్రీంకోర్టు స్పీకర్ ను ఆదేశించి. కోర్టు ఆదేశాలతో స్పీకర్ కార్యాలయం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ ప్రక్రియను వేగవంతం చేసింది. రేపటి విచారణలో కడియం శ్రీహరి తన వాదనలను వినిపించనున్నారు. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా స్పీకర్ తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.
సంచలనంగా మారిన దానం నాగేందర్ అఫిడవిట్..
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన అనర్హత పిటిషన్పై స్పీకర్కు సమర్పించిన అఫిడవిట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను ఉల్లంఘించలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకుని, ఆ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసినప్పటికీ, సాంకేతికంగా తాను పార్టీకి రాజీనామా చేయలేదని వాదించారు.
గత మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి హాజరైంది కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమేనని, మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్లు భావించడం సరికాదని దానం పేర్కొన్నారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయలేదని చెబుతూ, చట్టపరమైన లొసుగుల ద్వారా అనర్హత వేటు నుంచి తప్పించుకునే ఆయన ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు గడువు సమీపిస్తున్న వేళ దానం వినిపించిన ఈ వింత వాదన బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్..
అనర్హత పిటిషన్ ఎదుర్కొన్న ఎమ్మెల్యేలలో బండ్ల కృష్ణ మోహన్, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు తెలంగాణ స్పీకర్ ఇదివరకే క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ పిటిషన్లను విచారణ చేస్తున్నారు. ఇటీవల దానంను విచారించగా, తాజాగా కడియం శ్రీహరికి నోటీసులు ఇచ్చి విచారణకు మాజరు కావాలని ఆదేశించారు.
























