MLA Anirudh Reddy Phone Tapping case: నా భార్య, తల్లి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు.. ఇంటికి వెళ్తే భార్య తిడుతోంది- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆవేదన!
Telangana Phone Tapping latest news: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య, తల్లి ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు.

Anirudh Reddy wife phone tapped: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న వివాదాస్పద ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుపుతున్న అధికారుల ముందుకు యొన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి అనిరుధ్ రెడ్డి హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన వ్యక్తిగత స్వేచ్ఛకు ఏ విధంగా భంగం కలిగిందో వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అక్రమ ట్యాపింగ్ అనేది కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాలేదని, వారి కుటుంబ సభ్యుల ప్రైవసీని కూడా నడిబజార్లో పెట్టేలా సాగిందని మండిపడ్డారు. విచారణాధికారుల ముందుకు హాజరై తన వద్ద ఉన్న ఆధారాలను సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం తన ఫోన్ మాత్రమే కాకుండా.. తన తల్లి, భార్య ఫోన్ నంబర్లను కూడా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ట్యాప్ చేయించిందని ఆరోపించారు.
ఇంటికి వెళ్తే భార్య తిడుతోంది!
ఈ ట్యాపింగ్ వల్ల తన కుటుంబంలో ఎదుర్కొంటున్న మానసిక క్షోభను అనిరుధ్ రెడ్డి బహిరంగంగా పంచుకున్నారు. రాజకీయాల్లో ఉన్న నా ఫోన్ ట్యాప్ చేస్తే ఒక అర్థం ఉంది, కానీ నా భార్య ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాలి? ఒక భార్యాభర్తలు మాట్లాడుకునే అత్యంత వ్యక్తిగత విషయాలను మూడో వ్యక్తి వింటుంటే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది? అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారం బయటపడినప్పటి నుండి ఇంటికి వెళ్తే తన భార్య తనను తిడుతోందని.. నీ రాజకీయాల వల్ల నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, నా ప్రైవసీ పోయింది అని ఆమె నిలదీస్తుంటే తాను సమాధానం చెప్పలేక తలదించుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విప్ శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి గార్ల ప్రెస్ మీట్ - సీఎల్పీ కార్యాలయం https://t.co/WxOZl1DYd0
— Telangana Congress (@INCTelangana) June 1, 2026
యొన్నం శ్రీనివాస్ రెడ్డి కూడా విచారణ
ఈ విచారణ ప్రక్రియలో అనిరుధ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. గత ఎన్నికల సమయంలో తమ కదలికలను, ఎన్నికల వ్యూహాలను అడ్డుకోవడానికి ఇంటెలిజెన్స్ విభాగంలోని కొందరు ఉన్నతాధికారులు ఏ విధంగా నిబంధనలను ఉల్లంఘించారో వారు అధికారులకు వివరించారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని, అత్యాధునిక సాంకేతికతను దుర్వినియోగం చేసిన తీరుపై నిఘా సంస్థలు సేకరించిన వివరాలతో తమకు ఎదురైన అనుభవాలను వారు సరిపోల్చారు.
రాజకీయ కక్షసాధింపులో పరాకాష్ట
ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధుల భార్యలు, తల్లుల ఫోన్లను సైతం ట్యాప్ చేయడం అనేది రాజకీయ కక్షసాధింపులో పరాకాష్ట అని కాంగ్రెస్ నేతలంటున్నారు. నాడు అధికారంలో ఉన్న పెద్దల ఆదేశాల మేరకే కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఈ ద్రోహానికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్రమించదని స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు





















