MahabubNagar MLC ByElection : గురువారమే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు !
Telangana News : మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ గురువారం జరగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు తమ ఓటర్లను క్యాంపులకు తీసుకెళ్లాయి.

MahbubNagar MLC by-election polling will be held on Thursday : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక గురువారం జరగనుంది. ఇందుకోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థలలో ఎన్నికైన వందలాది మంది ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతుండటంతో.. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయం రాజకీయ పార్టీలలో వ్యక్తమవుతోంది. మొత్తం 1,439 మునిసిపల్ వార్డు సభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వంటి స్థానిక సంస్థలకు ఎన్నికైన సభ్యులైన ఓటర్లు ఉండగా, వీరిలో దాదాపు 1,000 మందిని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తరలించినట్లు సమాచారం.జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో 70 శాతం మంది బీఆర్ఎస్కు చెందిన వారే. అయినా అధికారం పోవడంతో ఓట్లు వేస్తారో లేదో తెలియని పరిస్థితి ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలందర్నీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గోవాకు తీసుకెళి రెండు రోజుల నుంచి అక్కడే క్యాంపు రాజకీయాలు నడిపారు.
అధికారంలో ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కాపాడుకోలేకపోయారు బీఆర్ఎస్ నేతలు. నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. అప్పట్లో నల్లగొండ జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలందరూ బీఆర్ఎస్ వారే ఉన్నప్పటికీ… కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విజయం సాధించారు. అంటే కారు పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ఎక్కువ మంది హస్తానికి ఓటేశారన్నమాట. అలాంటి పరిస్థితే ఇప్పుడూ ఎదురవుతుందని బీఆర్ఎస్ ఆందోళన చెదుతోంది.
మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 1,394 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటర్లుగా ఉండగా, వీరిలో బీఆర్ఎస్కు 823, కాంగ్రెస్కు 396, బీజేపీకి 88, బీఎస్పీకి ఒకటి, సీపీఐకి 4, సీపీఐ(ఎం)కు ఇద్దరు, ఎంఐఎంకు ఆరుగురు ఓటర్లు ఉన్నారు. ఇండిపెండెంట్లు 13 మంది ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కు విజయం నల్లేరుపై నడకే. కానీ రేవంత్ రెడ్డి… వ్యూహాత్మకంగా నిన్నామొన్నటి వరకూ బీఆర్ఎస్ లో ఉన్న ఆర్థికంగా బలవంతుడు అయిన మన్నె జీవన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపారు. ఆయన మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి సమీప బంధువు. నేరుగా పార్టీలే వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకు రానున్నాయి.
Before You Go
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్లో భారీ దాడులు
ట్రెండింగ్ వార్తలు






















