మేఘాలయ సీఎం సంగ్మా హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను చూసి ఆశ్చర్యపోయారు. దేశంలో ఇంత అద్భుతమైన వ్యవస్థ ఎక్కడా లేదని కేసీఆర్ను అభినందించారు.
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా ఫిదా అయ్యారని, తనకు స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్ దార్శనికతను కొనియాడారని కేటీఆర్ తెలిపారు.

- మేఘాలయ సీఎం కమాండ్ కంట్రోల్ సెంటర్ మెచ్చుకున్నారని కేటీఆర్ చెప్పారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, సంక్షేమంపై విఫలమైందని విమర్శించారు.
- కేసీఆర్ 2.8 లక్షల కోట్లు అప్పు చేస్తే, రేవంత్ 4 లక్షలు చేశారని అన్నారు.
- రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాహుల్ గాంధీపై ఆధారపడిందని కేటీఆర్ తెలిపారు.
మహేశ్వరం: నిన్న హైదరాబాద్ పర్యటనలో మేఘాలయ సీఎం సంగ్మా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను చూసి ఇంత అద్భుతంగా ఎలా నిర్మించారని ఆశ్చర్యపోయాని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ లాంటి గొప్ప నాయకుల నుంచి మాలాంటి నేతలు చాలా నేర్చుకోవాలి అన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ తరలివచ్చిన కార్యకర్తల జోష్ చూస్తుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందని, కేసీఆర్ మళ్లీ సీఎం అయిపోయిన భావన కలుగుతోందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
మహేశ్వరంలో మరోసారి సబితా ఇంద్రారెడ్డి గెలుపు తథ్యమని తేలిపోయిందని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలవడం, రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ నలుదిశలా ఒకటే నినాదం మారుమోగుతోందని, అదే "కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె" అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో వికాసం పోయి కేవలం విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలాయని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ కిట్ పోయి కరెంటు కోతల కాలం వచ్చిందని, రైతుబంధు పోయి రాహుల్ బంధు వచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు పాతర వేసి, కుంభకోణాల జాతర నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు.
సీఎంగా రేవంత్ ఉన్నా.. కేసీఆర్నే తలుచుకుంటున్నారు..
ప్రస్తుతం సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం కేసీఆర్ గారినే తలుచుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహేశ్వరం ముద్దుబిడ్డ సిరిపురం యాదయ్య లాంటి ఎంతోమంది అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోనే 10 ఏళ్ల కేసీఆర్ పాలన సాగిందని, ప్రజాసంక్షేమం, ప్రగతిపథం రెండు జోడెడ్లలా ముందుకు సాగాయని గుర్తుచేశారు. ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల తెలంగాణ ప్రజలకు కోలుకోని నష్టం జరిగిందని, ఎవరు నష్టపోయారో ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్ కి పదవులు కొత్త కాదు కాదని, కేంద్ర కేబినెట్ మంత్రి వరకు ఎన్నో పదవులను త్యాగం చేసిన 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉందని కొనియాడారు.
నిన్న హైదరాబాద్ వచ్చిన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా ప్రశంసలే కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమన్నారు. కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను చూసి ఆశ్చర్యపోయిన మేఘాలయ సీఎం, తనకు స్వయంగా ఫోన్ చేసి ఇంత అద్భుతమైన వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని అభినందించారని చెప్పారు. పోరాటయోధుడే పాలకుడైతే పరిపాలన ఎలా ఉంటుందో ఇదో ఉదాహరణ అని, నాడు ఉద్యమ నాయకుడికి ప్రజలు పాలనా పగ్గాలు అప్పగిస్తే తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని అన్నారు. కానీ, రాష్ట్రం రాకెట్ వేగంతో దూసుకుపోయే సమయంలో పొరపాటునో, గ్రహపాటునో ఇప్పుడు ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి అయ్యాడని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఓ పిచ్చోడి చేతిలో రాయి ఉంటే చుట్టుపక్కల వారికి నష్టమని, అదే పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంటే నాలుగు కోట్ల ప్రజలకు నష్టమని వ్యాఖ్యానించారు. తనకు హిట్లరే ఆదర్శం అని రేవంతే స్వయంగా ఒప్పుకున్నాడని, ఎవరైనా శ్రీరామచంద్రుడు, అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుంటే, నరకాసరుడు, రావణాసురుడిని మించిన హిట్లర్ను రేవంత్ ఆదర్శంగా తీసుకున్నాడని, అందుకే ఆయన పేరు ఇక నుంచి "హిట్లర్ రెడ్డి" అని కేటీఆర్ పిలిచారు.
మూడో పంటకు రైతు బంధు అని ఆర్భాటం చేసిన ఘనుడు రేవంత్..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడో పంటకు రైతుబంధు ఎందుకు ఇవ్వరని అడిగిన రేవంత్, ఇప్పుడు కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ ఇస్తూ మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. రైతుబంధు రూ.15 వేలు చేస్తానని 420 అబద్ధాలతో ప్రజలను ఆగంచేసి గద్దెనెక్కిన రేవంత్ పాలనలో రైతుబంధు దేవుడెరుగు, కనీసం యూరియాకు కూడా దిక్కులేదన్నారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నాటి దరిద్రాలన్నీ మళ్ళీ దాపురించాయని, యూరియాను యాప్లో పెడతామన్న ప్రభుత్వానికి రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాల రైతులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రజనీకాంత్ను మించిన డైలాగులు కొడితే, భట్టి విక్రమార్క కమల్ హాసన్ను మించి యాక్టింగ్ చేశారని ఎద్దేవా చేశారు. 100 రోజుల గ్యారెంటీ కార్డు రెండున్నరేళ్లయినా నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాకుండా పోయిందని, ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూముల పట్టాలిస్తామని దగా చేశారని ఆరోపించారు.
పదేళ్లలో కేసీఆర్ అప్పులు 2.8 లక్షల కోట్లు.. రేవంత్ అప్పులు 4 లక్షల కోట్లు
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై కాంగ్రెస్ అబద్ధాలు చెప్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధించిన నాడు రాష్ట్రంపై అప్పు రూ.72 వేల కోట్లు ఉంటే, కేసీఆర్ పదేళ్లలో చేసిన అప్పు కేవలం రూ.2 లక్షల 80 వేల కోట్లు మాత్రమేనని, అంటే సంవత్సరానికి రూ.28 వేల కోట్లు మాత్రమేనని లెక్కలు చెప్పారు. కేసీఆర్ అప్పుచేసి గురుకుల పాఠశాలలు పెట్టి, ఆరున్నర లక్షల మంది పిల్లలకు రూ.లక్షా 20 వేల కోట్ల ఖర్చుతో అత్యుత్తమ విద్యను అందించారని తెలిపారు. అలాగే లక్ష కోట్లతో కరెంట్ కష్టాలు తీర్చారని, కళ్యాణ లక్ష్మి ద్వారా 14 లక్షల మంది ఆడబిడ్డలకు మేనమామలా పెళ్ళి చేశారని, రూ.30 వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశారని వివరించారు. రూ.72 వేల కోట్లు రైతుబంధు ద్వారా 70 లక్షల మంది రైతుల ఖాతాలో వేసి, రూ.30 వేల కోట్ల రుణమాఫీ చేశారని, కొత్త జిల్లాలు, కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. కానీ రెండున్నరేళ్లలో 4 లక్షల కోట్ల అప్పుచేసిన రేవంత్ ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, కనీసం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సంచులు ఇచ్చే ముఖం కూడా లేదని, ఆ సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయని విమర్శించారు. కేసీఆర్ రైతుల ఖాతాలో డబ్బులు వేస్తే, రేవంత్ రెడ్డి 30 నెలల్లో 72 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టారని, రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు, రెన్యూవల్ సీఎం అని ఎద్దేవా చేశారు.
Idupu Kayitham: ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్ టైటిల్స్ కావాలా? అసలేమిటీ చర్చ??
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని కొత్త డైలాగులు కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే ముందు కనీసం లక్షాధికారులను చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు కోటి 67 లక్షల మంది ఉన్నారని, వారందరికీ నెలకు రూ.2500 చొప్పున ఐదేళ్లకు ఇవ్వాల్సిన రూ.లక్షా 50 వేలు వేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరిట రేవంత్ అన్నదమ్ములు విలువైన భూములపై పడి దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ గారు ఈ ప్రాంతంపై ప్రేమతో కొలువులు రావాలని అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా సిటీ తేవాలని ఏడేళ్లు కష్టపడి ప్రణాళికలు రచించి, ఇబ్రహింపట్నం, మహేశ్వరంలో 14 వేల ఎకరాలు సేకరించారని చెప్పారు. కానీ సీఎం రేవంత్ అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు చేసి భూములు రైతులకు ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాట మార్చి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ ఫ్యూచర్కే దిక్కు లేదు..
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఫ్యూచర్కే దిక్కులేదని, రాహుల్ గాంధీకి కోపం వస్తే ఒక్కరోజులో ఆయన ఫ్యూచర్ లేకుండా పోతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తన అల్లుడికి, తమ్ముడికి ఫార్మా భూములు ఇస్తానంటే చట్టం ఒప్పుకోదన్నారు. కార్యకర్తలే కథానాయకులై కదంతొక్కితే ప్రతి బూత్లో బీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ వస్తుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు ఎస్ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. డిజిటల్ రూపంలో పార్టీ సభ్యత్వ నమోదును పెద్దఎత్తున విజయవంతం చేయాలని, ప్రతి కార్యకర్తకు పార్టీ తరఫున ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తామని, దానితో ఎక్కడికెళ్లినా గౌరవం లభిస్తుందని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Frequently Asked Questions
మేఘాలయ సీఎం హైదరాబాద్ పర్యటనలో దేని గురించి ప్రశంసించారు?
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై కేటీఆర్ ఏమని విమర్శించారు?
కేసీఆర్ కిట్ పోయి కరెంటు కోతలు వచ్చాయని, రైతుబంధు పోయి రాహుల్ బంధు వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. సంక్షేమ పథకాలకు పాతర వేసి కుంభకోణాల జాతర నడిపిస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల రుణాల గురించి కేటీఆర్ ఏం చెప్పారు?
కేసీఆర్ పదేళ్లలో రూ.2.8 లక్షల కోట్లు అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లలో రూ.4 లక్షల కోట్లు అప్పు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ అప్పులతో అభివృద్ధి చేస్తే, రేవంత్ ఒక్క ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు.
ఫార్మా సిటీపై కేటీఆర్ ఏమన్నారు, రేవంత్ రెడ్డి చర్యలను ఎలా విమర్శించారు?
కేసీఆర్ ఫార్మా సిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరిస్తే, సీఎం రేవంత్ దాన్ని రద్దు చేసి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. విలువైన భూములను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
ట్రెండింగ్ వార్తలు























