Bandi Sanjay vs KTR: బండి సంజయ్ను కోర్టుకు లాగిన కేటీఆర్ - మీడియా, సోషల్మీడియాపైనా దావా - ఇదే కారణం !
KTR: బండి సంజయ్ తో పాటు మీడియా, సోషల్ మీడియాపై కేటీఆర్ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.క్షమాపణలు చెప్పడంతో పాటు పది కోట్లు చెల్లించాలని పిటిషన్లో పేర్కొన్నారు.

KTR files defamation petition against Bandi Sanjay: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. 2025 ఆగస్టు 8న బండి సంజయ్ "తప్పుడు, అసభ్యకరమైన, నిరాధారమైన" వ్యాఖ్యలు చేశారని.. వాటిని ఆయా మీడియాలు విస్తృతంగా ప్రసారం చేశాయని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ తన న్యాయవాది ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేశారు. చేశారు, రూ.10 కోట్ల నష్టపరిహారం, బహిరంగ క్షమాపణతో పాటు పరువు నష్టం కలిగించే కంటెంట్ తొలగించాలని పిటిషన్లో కోరారు. విచారణ జరిపిన కోర్టు 15వ తేదీన విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది.
బండి సంజయ్ వ్యాఖ్యలలో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక అవకతవకలు, కేటీఆర్ను డ్రగ్స్ వాడకంతో ముడిపెట్టి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రాజకీయ కక్షతో గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించినవని కేటీఆర్ భావిస్తున్నారు. ఈ ఆరోపణలు చేసిన తర్వాత 2025 ఆగస్టు 11న కేటీఆర్ లీగల్ నోటీసు పంపినప్పటికీ, బండి సంజయ్ బేషరతు క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు, దీంతో కేటీఆర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు.
బండి సంజయ్ ఏమన్నారంటే ?
కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబీని దుర్వినియోగం చేసి, వేలాది ఫోన్లను ట్యాపిగ్ చేశారు. అందులో రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిలతో పాటు సొంతం కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. తర్వాత మరో ప్రెస్ మీట్లో కేటీఆర్ డ్రగ్స్ వాడకం , ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు "బాధ్యతారహితమైనవి, ఆధారాలు లేనివి, గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశ్యంతో చేసినవి" అని కేటీఆర్ కోర్టుకు చెప్పారు.
కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసుకు బండి సంజయ్ అక్టోబరు 29న స్పందించారు. ఆరోపణలను "తప్పుడు, దురుద్దేశపూరితం" అని తిరస్కరించారు. తాను కేటీఆర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదని, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అవినీతి గురించి మాత్రమే మాట్లాడానని వాదించారు. తాను భయపడేదిలేదని ప్రకటించారు.
పిటిషన్లో కేటీఆర్ పేర్కొన్న ప్రధాన డిమాండ్లు
1. బండి సంజయ్ నుంచి బేషరతు, బహిరంగ క్షమాపణ.
2. పరువు నష్టం కలిగించే కంటెంట్ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిందితులను నిరోధించే కోర్టు ఉత్తర్వులు.
3. ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, మీడియా పోర్టల్ల నుంచి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించడం.
4. రూ.10 కోట్ల నష్టపరిహారం
15వ తేదీన బండి సంజయ్ కోర్టుకు హాజర్వాల్సిఉంది. అయితే హాజరవుతారా లేదా అన్నది బండి సంజయ్ లీగల్ టీమ్ డిసైడ్ చేసే అవకాశం ఉంది.





















