HYDRAA Latest News:పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు.. ఆనందంలో కాలనీవాసులు
HYDRAA Latest News:రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్లోని లేఅవుట్స్లో రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహరీని కూల్చివేసింది.

HYDRAA Latest News:హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శనివారం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్లోని లేఅవుట్స్లో రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహరీని సిబ్బంది కూల్చివేశారు.
దివ్యానగర్లో భూముల కబ్జాలకు పాల్పడి రోడ్డుకు అడ్డంగా రోడ్డు నిర్మించారు. పలు కాలనీలు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా దివ్యనగర్ లేఔట్ చుట్టూ అక్రమంగా ప్రహరీ నిర్మించారు. ఆ గోడకు గేటు పెట్టి తమను అనుమతించడంలేదంటూ నల్ల మల్లారెడ్డిపై అక్కడి ప్లాట్ల యజమానులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దివ్యనగర్ లేఔట్లోంచి తమ నివాసాలకు, పక్కనే ఉన్న ఇతర లే ఔట్ల ఉన్న దారులను మూసేసి ఇబ్బందులు పెడుతున్నారంటూ నల్ల మల్లారెడ్డిపై పలు కాలనీవాసుల వాసులు ఫిర్యాదులు చేశారు.
లేఔట్ను పరిశీలించిన కమిషనర్
స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ నెల 8న హైడ్రా కమిషనర్ రంగనాథ్ దివ్యానగర్ లేఅవుట్స్ను పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించారని గుర్తించి కూల్చివేశారు.
అమ్మితే రూ.50 వేలు చెల్లించాలని ఆదేశం!
ఆ అంశంపై పూర్తి విషయాలు తెలుసుకునేందుకు 23వ తేదీన హైడ్రా ప్రధాన కార్యాలయంలో ఇరు పక్షాలతో హైడ్రా కమిషనర్ చర్చలు జరిపారు. చర్చల్లో కాలనీ వాసులు మాట్లాడారు. దారులు మూసివేశారని, ఆ లే ఔట్లలోని తమ ప్లాట్లు అమ్ముకోలేని పరిస్థితి ఉందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వేళ అమ్మినా తన సమక్షంలో అమ్మకాలు జరగాలని ఇందుకు రూ. 50 వేలు చెల్లించాలని నల్ల మల్లారెడ్డి ఆంక్షలు విధించినట్లు ఆరోపించారు.
Also Read: పేలిన బ్యాటరీలు.. హైదర్గూడలో బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం
మమ్మల్ని కొట్టారు
లేఔట్ డెవలప్మెంట్ ఛార్జీల పేరిట డబ్బులు వసూలు చేశారని.. మురుగునీటి వ్యవస్థ, రహదారులు నిర్మించకుండా లేఔట్ చుట్టూ భారీ ప్రహరీ నిర్మించి, గేట్లు పెట్టి తమను కూడా అనుమతించడంలేదని మండిపడ్డారు. ఇదే విషయాన్ని నిలదీస్తే తమను కొట్టారని నల్లమల్లారెడ్డి సమక్షంలోనే కమిషనర్కు ఫిర్యాదు చేశారు.
తమ ప్లాట్లను తామే చూడాలన్నా, వేరే వాళ్లకు చూపాలన్నా అనుమతి ఉండదని.. ఆయన నిర్దేశించిన సమయంలోనే రావాల్సి ఉంటుందని వివరించారు. గేటు దగ్గర ఎంట్రీ పుస్తకంలో వివరాలన్నీ రాస్తే.. ఆనుమతించాలా లేదా అనే విషయాన్ని నల్లమల్లారెడ్డి నిర్ణయిస్తారని, అప్పడే తమకు ఎంట్రీ ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కంపెనీలో ఉద్యోగాలు చేసి ప్లాట్లు కొంటే అవసరాలకు తమ ప్లాట్లను తాము అమ్ముకునే అవకాశం కూడా లేకుండా చేశారని అన్నారు.
కమిషనర్ ఆదేశాలతో కూల్చివేతలు
ఇరు పక్షాల వాదనలు విన్న కమిషనర్.. ప్రహరీ నిర్మాణానికి అనుమతులు లేవంటూ నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ప్రహరీ కూల్చివేతకు కమిషనర్ ఆదేశాలివ్వగా.. ఆ ఆదేశాల మేరకు శనివారం అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
తీరిన రోడ్డు కష్టాలు
ప్రహరీ కూల్చివేతతో దివ్యనగర్ లేఔట్తోపాటు పరిసర ప్రాంతాల్లోని ఇతర లేఔట్ నివాసితులు, యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. దివ్యనగర్ లేఔట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో.. ఏకశిల లేఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్–1, 2, 3, 4, మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిల–పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడకు రోడ్ల కష్టాలు తీరాయి.
200 ఎకరాల్లో 2218 ప్లాట్లు
రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల్లో దివ్య లేఔట్ విస్తరించి ఉంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్లమల్లారెడ్డివేనని సమాచారం. ప్లాట్ యజమానులను బెదిరించడమే కాకుండా సర్వే నంబరు 66లో 6.06 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా నల్లమల్లారెడ్డి కబ్జా చేశారని ఫిర్యాదున్నాయి.





















