Telangana MPTC,ZPTC System: తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థ రద్దు! మరో సంచలనం దిశగా రేవంత్ సర్కారు! రాజ్యాంగ సవరణ తప్పనిసరా?
Telangana MPTC,ZPTC System:తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన రేవంత్ సర్కారు ఉంది. ఫిబ్రవరి 23న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Telangana MPTC,ZPTC System:తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల పరిపాలనా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక పెను సంచలనంగా మారొచ్చు.
వ్యవస్థ రద్దుకు కారణాలేంటి?
తెలంగాణలో ప్రస్తుతం అమల్లో ఉన్న మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంపీటీసీ, జడ్పీటీసీల పాత్రపై ప్రభుత్వం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించింది. ఈ వ్యవస్థ రద్దు చేయాలనే ఆలోచన వెనుక మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
ఈ వ్యవస్థ ద్వారా ప్రజల చేత ఎన్నికైన ప్రతినిధులకు క్షేత్రస్థాయిలో సరైన అధికారులు కానీ, నిర్దిష్టమైన బాధ్యతలు కానీ లేవని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కేవలం పదవులు ఉండి, నిధులు, విధులు లేకపోవడం వల్ల ఆశించిన అభివృద్ధి జరగడం లేదని సర్కారు భావిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయడం ద్వారా భవిష్యత్లో ఈ స్థానాలకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమే ఉండదని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది ప్రభుత్వ ఖజానాపై భారాన్ని తగ్గించమే కాకుండా తరచూ వచ్చే ఎన్నికల కోడ్ అడ్డంకులను కూడా నివారిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం వ్యవస్థల వల్ల పాలనాపరంగా పెద్దగా ఉపయోగం లేదని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి 23 కేబినెట్లో నిర్ణయం!
ఈ ప్రతిపాదనపై స్పష్టత రావడానికి ఫిబ్రవరి 23న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం అత్యంత కీలకమైంది. ఈ సమావేంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థల రద్దుపై ప్రభుత్వం చర్చించే ఛాన్స్ ఉంది. ఈ లోగా ఈ అంశంపై ఒక సమగ్ర నివేదికను సమర్పించాలని రేవంత్ ప్రభుత్వం పంచాయతీ రాజ్శాఖను ఆదేశించింది. ఈ నివేదికలో ఈ వ్యవస్థల వల్ల జరుగుతున్న లాభనష్టాలు, రద్దు చేస్తే కలిగే పరిణామాలు , ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను పొందుపరచనున్నారు.
రాజ్యాంగపరమైన అడ్డంకులేంటి?
ప్రభుత్వం ఈ దిశగా చర్యలు వేగంగా తీసుకుంటున్నా చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఈ నిర్ణయం అమలు చేయడం అంత సులభం కాదని తెలుస్తోంది. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే తీరుగా అమలులోకి వచ్చింది.రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, రాష్ట్రాలు తమ ఇష్టానుసారం మూడు అంచెల వ్యవస్థలో మార్పులు చేయడం సాధ్యం కాదు. ఎంపీటీసీ, జడ్పీటీసీలను రద్దు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా, ఈ ప్రతిపాదన చట్టపరంగా, రాజకీయంగా ఎంత వరకు సాధ్యమవుతుందనే దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. కేవలం రాష్ట్ర స్థాయిలో ఒక తీర్మానం చేయడం ద్వారా లేదా ఆర్డినెస్ తీసుకురావడం ద్వారా ఈ వ్యవస్థను రద్దు చేయడం కుదరదని ఒక వేళ కేంద్రం సహకరించకపోతే ఇది న్యాయపరమైన చిక్కులకు దారి తీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.























