Formula E Race Case: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్ర అనుమతి
Formula E Race Case: ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ (DoPT) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడం తెలిసిందే. తాజా నిర్ణయంతో అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ హయాంలో నిధుల బదిలీపై ప్రశ్నలు..
2023లో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా రూ.54.88 కోట్ల నిధులు బదిలీ చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. తెలంగాణ క్యాబినెట్ అనుమతి లేకుండా ఈ నిధులు విడుదలయ్యాయని దర్యాప్తు సంస్థ చెబుతోంది. అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్, సంబంధితశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను నిధులు విడుదల చేసినట్లు ఏసీబీ విచారణలో అంగీకరించారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ సైతం ఇచ్చారు.
ఐఏఎస్ అధికారులు కావడంతో వారిపై విచారణకు కేంద్రం అనుమతి తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు ఆ అనుమతి రావడంతో ఏసీబీ త్వరలోనే కోర్టులో సమగ్రమైన ఛార్జిషీట్ను దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. రాజకీయ నేతలతో పాటు కీలక స్థాయి అధికారిపై కూడా ప్రాసిక్యూషన్కు లైన్ క్లియర్ కావడంతో ఫార్ములా ఈ కార్ కేసు దర్యాప్తు మరింత వేగవంతం కానుంది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు..
2023 ఫిబ్రవరిలో హైదరాబాద్లో తొలిసారిగా ఫార్ములా-ఈ రేస్ జరిగింది. అయితే 2024లో జరగాల్సిన రెండో ఎడిషన్ను నిబంధనల ఉల్లంఘనల కారణంగా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏ1గా ఉండగా, అరవింద్ కుమార్ ఏ2గా, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు. నిబంధనల ప్రకారం స్పాన్సర్లు చెల్లించాల్సిన రూ. 54.88 కోట్లను హెచ్ఎండీఏ నేరుగా విదేశీ సంస్థకు చెల్లించడమే కాకుండా, దీనిపై అదనంగా రూ. 8 కోట్ల వరకు పన్ను భారాన్ని కూడా ప్రభుత్వమే భరించిందని ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
























