Kavitha Latter: పార్టీ మంచి కోసం పోరాడుతుంటే పదవి నుంచి తొలగించారు! బీఆర్ఎస్పై మరో బాంబు వేసిన కవిత
Kavitha Latter: టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి అన్యాయంగా తప్పించాలని గులాబీ తోటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బాంబు వేశారు. చట్టానికి విరుద్దంగా రాజకీయ కక్షతో ఈ పని చేశారని లేఖలో పేర్కొన్నారు.

బీఆర్ఎస్, కవిత మధ్య దూరం రానురాను మరింత పెరుగుతోంది. ఇప్పటి వరకు నేరుగా ఈ అంశంపై కీలకమైన నేతలు ఎవరూ స్పందించకపోయినా ఈ మధ్య కాలంలో పరోక్షంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కవిత ఇష్యూ పార్టీలో ప్రస్తావనే లేదని ఆమె గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆమె లీడ్ చేస్తున్న టీబీజీకేఎస్ను ఆమెను తప్పించారు. ఆమె స్థానంలో పార్టీకి మొదటి నుంచి విశ్వాసపాత్రుడిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ను పెట్టారు. దీనిపై లేఖ రాసిన కవిత మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష ఎన్నిక పార్టీ కార్యాలయంలో జరగడం ఏంటని కవిత ప్రశ్నించారు. దీన్ని రాజకీయం చేయదలచుకోలేదంటూనే ఆ అంశాన్ని ప్రస్తావించి చర్చనీయాంశం చేశారు కవిత రాసిన లేఖలో ఏముందంటే " తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పదేళ్లకాలంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా సేవలందించాను. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్కి శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోంది." అని బీఆర్ఎస్ నాయకత్వ తీరును తప్పుపట్టారు.
ఈ లేఖలో పదేళ్ల పాటు తాను చేసిన పనులు ప్రస్తావించారు. " తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గు గని కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు నేను ముందు వరుసలో ఉండి పని చేశాను. 2015 ఆగస్టు 17వ తేదీన కొత్తగూడెంలో నిర్వహించిన టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశంలో 11 ఏరియాల నుంచి హాజరైన 1000 మందికిపైగా సభ్యుల సమక్షంలో నన్ను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అప్పటి టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు కెంగెర్ల మల్లయ్య సహా ముఖ్య నాయకులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్లో జరిగే అన్ని నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హోదాలో నేనే తీసుకునేలా తీర్మానం చేశారు." అని వివరించారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని అన్నారు కవిత.కార్మికుల ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. "తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నేను పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు పన్నుతున్నారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తున్నది."
సింగరేణిలో కారుణ్య నియామకాలను పునఃప్రారంభించిందే తానేని కవిత గుర్తు చేశారు. ఈ నిర్ణయంతో దాదాపు ఇరవై వేల మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కన పెడితే కేసీఆర్ని ఒప్పించి తిరిగి డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్దరించేలా చేశాను. తద్వారా సింగరేణిలో 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సకల జనుల సమ్మెతో సింగరేణిలో తట్టాచెమ్మాస్ బంద్ పెట్టి స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసేలా కృషి చేసిన మన కార్మికులకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇప్పించాను.
కార్మికులు తీసుకునే రూ.10 లక్షలకు పైబడిన హౌసింగ్ లోన్ పై వడ్డీ చెల్లింపు, కార్మికులు నివసించే క్వార్టర్స్ కు ఉచిత కరెంట్, ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించాను. కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ పది రెట్లు పెంచాం. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం తీసుకువచ్చాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయించాను. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ఆప్షనల్ సెలవు మంజూరు చేయించాను. కార్మిక కుటుంబానికి మాత్రమే పరిమితమైన కార్పొరేట్ వైద్యాన్ని వారి తల్లిదండ్రులకు అందించాం . క్యాడర్ స్కీం, మరణించిన లేదా మెడికల్ అన్ఫిట్ అయిన కార్మిక కుటుంబాల్లోని వారసులు మేజర్ అయ్యేంత వరకు ఎంఎంసీ సదుపాయం కల్పించడం సహా కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎన్నో పథకాలు అమలు చేయడంలో క్రియాశీలంగా పని చేశాను."
కార్మికులు రాసిన లేఖలో బీఆర్ఎస్ రాజకీయల గురించి వివరించారు. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. "భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో కొన్నాళ్లుగా జరుగుతోన్న పరిణామాలు తెలిసే ఉంటుంది. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంపై లేఖ రాశాను. గతంలో కూడా ఇలాంటి లేఖలు రాశాను. నేను గతంలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ లేఖ లీక్ చేశారు. ఆ లేఖ లీక్ చేసి నాపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరో బయట పెట్టాలని నేను కోరాను. పార్టీలో జరుగుతోన్న వ్యవహారాలను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా కక్షగట్టారు. ఆ తర్వాత జరుగుతోన్న పరిణామాలు, ఘటనలు అన్ని మీ మననంలో ఉన్నాయనే అనుకుంటున్నాను. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే కక్షగట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు."
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా వెన్నంటే ఉంటాను అని కవిత హామీ ఇచ్చారు. గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవ అధ్యక్షురాలిగా, అంతకుముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలందించానో ఇకపైనా కార్మికుల కోసం అలాగే పని చేస్తానని అన్నారు. కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా అండదండగా ఉంటాననని మాట ఇస్తున్నాను అని లేఖను ముగించారు.





















