HYDRA: పవర్ హౌస్ హైడ్రా ఎంట్రీతో అక్రమార్కులు పరార్ - రూ. 750 కోట్ల విలువైన భూమి స్వాధీనం
HYDRA: పవర్ హౌస్ హైడ్రా మరో అక్రమార్కుడిని పరుగులు పెట్టించింది. తప్పుడు పత్రాలతో 750 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కాజేద్దనే పన్నాగానికి అడ్డంగా హైడ్రా బోర్డు పాతేసింది.

HYDRA: హైదరాబాద్లో మరోసారి కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. బంజారాహిల్స్లో షేక్పేటలో ఈ 750 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించింది. మొన్నటి వరకు అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టిన హైడ్రా ఇప్పుడు కబ్జాకు గురైన భూములపై ఫోకస్ చేసింది. ఓవైపు చెరువుల పునరుద్ధరణ, మరోవైపు కబ్జాభూముల స్వాధీనంతో ప్రజలన ప్రశంసలు అందుకుంటోంది.
బంజారాహిల్స్లో కబ్జాకు గురైన స్థలంలో ఉన్న ఆక్రమణలను హైడ్రా ఇవాళ తొలగించింది. అక్రమార్కుల చెరలో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. దాదాపు రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. షేక్పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి షెడ్లు వేసుకున్నారు. వాటిని తలగించింది హైడ్రా.
ఇప్పుడు స్వాధీనం చేసుకున్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో జలమండలికి 1.20 ఎకరాలను గతంలోనే ప్రభుత్వం కేటాయించింది. 1.20 ఎకరాలతోపాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెళ్లాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతోపాటు వేటకుక్కలను కాపలాగా పెట్టారు.
కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకొని పహరా పెట్టారు. ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. అనేక నివాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలను కూడా పార్థసారథి అడ్డుకున్నారు.
ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న పార్థసారథి, కబ్జాకు గురైన భూమి గురించి హైడ్రాకు ఫిర్యాదు చేసిన జలమండలి, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కబ్జాదారులను పరుగులు పెట్టించింది. అక్కడ ఆక్రమణలు తొలగించి భూమిని అధికారులకు అప్పగించింది. ఫేక్ సర్వే నంబర్ (403/52)తో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేసిన పార్థసారథిపై కేసులు పెట్టింది. పార్థసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ను రెవెన్యూ, జలమండలితో పెట్టించింది.
వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి పార్థసారథి ఆక్రమణలకు పాల్పడినట్టు నిర్ధారించింది హైడ్రా. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు నిర్ధారించుకుంది. షేక్పేట రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగించింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్తో పాటు లోపల ఉన్న షెడ్డులను తొక్కిపెట్టి పూడ్చేసింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.





















