Hyderabad Mythrivanam Fire Accident: హైదరాబాద్ మైత్రీవనంలో భారీ అగ్ని ప్రమాదం: నీలగిరి బ్లాక్ లో చిక్కుకున్న విద్యార్థులు, భయానక దృశ్యాలు!
Hyderabad Mythrivanam Fire Accident: హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల శిక్షణకు ఫేమస్ అయిన మైత్రీవనంలో అగ్ని ప్రమాదం జరిగింది.

Hyderabad Mythrivanam Fire Accident: హైదరాబాద్లోని మైత్రీవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్లో దుర్ఘటన జరిగింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా షాక్కి గురైంది. ఏం జరుగుతుందో తెలియక జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడకు వచ్చి మంటలను ఆర్పుతున్నారు. నీలగిరి బ్లాక్లో జరిగిన ప్రమాదంలో కొందరు విద్యార్థులు చిక్కుకున్నారు. నాల్గో అంతస్తులోని ఓ ఇనిస్టిట్యూట్లో చిక్కుకున్న విద్యార్థులను అధికారులు అతి కష్టమ్మీద బయటకు తీసుకొచ్చారు. బాల్కనీ నుంచి వారిని సురక్షితంగా కిందికి దించారు.
అమీర్పేటను ఐటీ ఉద్యోగాలకు గుండెకాయగా చెబుతుంటారు.అలాంటి ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ జరగడం అగ్నికీలలు ఎగసిపడటం అందర్నీ ఆందోళనకు గురి చేసింది. వేల మంది విద్యార్థులతో నిరంతరం రద్దీగా ఉండే మైత్రీవనం వాణిజ్య సముదాయంలోని నీలగిరి బ్లాక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలోని నాల్గో అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్ నుంచి పొగలు రావడంతో ఆంతా పరుగులు పెట్టారు.
నీలగిరి బ్లాక్లో ఏం జరిగింది?
ఉదయం సాధారణ పని వేళల్లో మైత్రీవనం సముదాయం ఐటీ నిరుద్యోగులతో కిటకిటలాడుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్ భవనంలో నాల్గో అంతస్తులో ఉన్న శిక్షణా సంస్థకు సమీపంలో ఉన్న ప్యానెల్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆ దెబ్బకు వైరింగ్ మొత్తం కాలిపోయింది. నిమిషాల వ్యవధిలోనే భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకోవడంతో లోప ఉన్న విద్యార్థులు, సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, అభ్యర్థులు కొందరు మెట్ల మార్గంలో బయటకు వచ్చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సబ్బంది యుద్ధ ప్రాతిపదికన ఘటనా స్థలానిక చేరుకున్నారు. భవనం లోపలికి వెళ్లే మార్గాలు పొగతో నిండిపోయాయి. ఆ మార్గాల్లో చిక్కుకున్న బాధితులను తీసుకురావడం ఇబ్బందని గ్రహించి బాల్కనీ ద్వారా వారిని రెస్క్యూ చేశారు. పెద్ద పెద్ద నిచ్చెలను వినియోగించి ఒక్కొక్కర్ని కిందికి దించారు. ఒక వేళ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఎవరైనా ప్రమాదవశాత్తు కింద పడినా గాయాలు కాకుండా ఉండేందుకు భవనం కింద సేఫ్టీ నెట్లు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడటంలో అక్కడే ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు, సహాయక చర్యల్లోపాల్గొన్నారు.
అడ్డంకిగా మారిన హోర్డింగ్స్
సహాయక చర్యల సమయంలో అగ్నిమాపక సిబ్బందికి కొన్ని ప్రధాన సవాళ్లు ఎదురయ్యాయి. మైత్రీవనం భవనం చుట్టూ, కింద భారీగా ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ఇబ్బంది కలిగించాయి. భవనం చుట్టూ వేలాడుతుండటం వల్ల నిచ్చెలు వేయడానికి, చిక్కుకున్న వారిని దించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
మైత్రీవనం ప్రత్యేకతేంటీ?
హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెలవప్మెంట్ అథారిటీ దీన్ని ఈ భవనాన్ని నిర్మించింది. ఇది 1.8 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇది ఐటీ శిక్షణ కేంద్రాలకు, కో వర్కింగ్ స్పేస్లకు అడ్డాగా ఉంది. ఇక్కడ ప్రతి రోజూ వేలాది మంది అభ్యర్థులు ఐటీ రంగాల్లో ట్రైనింగ్ తీసుకుంటారు.
నీలగిరి బ్లాక్ మూసివేత
అగ్ని ప్రమాదం జరిగిన నీలగిరి భవనాన్ని అధికారులు మూసివేశారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినా అక్కడ పరిస్థితులు చెక్ చేసి ఎలాంటి ప్రమాదాలు జరగవని నిర్దారించుకున్న తర్వాతే బ్లాక్ను ఓపెన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే ప్రజల ప్రాణాలు సురక్షితంగా రక్షించే పరిస్థితులు ఉన్నాయో లేదో అనే అంశంపై కూడా అధికారులు విచారణ చేయనున్నారు.























