KTR on Formula E Race: ఫార్ములా ఈ రేస్తో గ్లోబల్ మొబిలిటీ హబ్గా హైదరాబాద్ సిటీ: కేటీఆర్
KTR About Formula E Race | ఫార్ములా ఈ రేస్తో గ్లోబల్ మొబిలిటీ హబ్గా హైదరాబాద్ మారిదని, త్వరలో భారతదేశ 'మొబిలిటీ వ్యాలీ'గా హైదరాబాద్ ఆవిర్భవిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

KTR Latest News | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తెలంగాణ ఆవిష్కరణల ప్రస్థానాన్ని జాతీయ వేదికపై చాటిచెప్పారు. గత BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్లో విజయవంతంగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ (Formula E Race) నిర్వహణ గురించి ప్రస్తావించారు. తాము నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్రతీక అని కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. కోయంబత్తూరులో శనివారం జరిగిన 10వ ఎఫ్ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా, దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు.
హైదరాబాద్ నగరంపై అంతర్జాతీయ దృష్టి
కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లు హైదరాబాద్ వీధుల్లో పరుగులు తీసినప్పుడు, భవిష్యత్తు కోసం తెలంగాణ సిద్ధంగా ఉందని రుజువైంది. ఈ ఫార్ములా ఈ రేసు దాదాపు రూ. 700 కోట్ల ఆర్థిక కార్యకలాపాన్ని సృష్టించి, అంతర్జాతీయ దృష్టిని హైదరాబాద్ నగరం వైపు మళ్లించింది" అని పేర్కొన్నారు. ఈ ఫార్ములా-ఈ ఈవెంట్ ఒక ఆరంభం మాత్రమేనని, తెలంగాణ స్థిరమైన, సాంకేతికత ఆధారిత పారిశ్రామిక వృద్ధి లక్ష్యాన్ని కలిగి ఉందని, త్వరలోనే హైదరాబాద్ భారతదేశ మొబిలిటీ వ్యాలీ'గా ఆవిర్భవించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మోటార్స్పోర్ట్స్ అంటే కేవలం వేగం కాదు; అది తమ సామర్థ్యాలను పరీక్షించుకోవడం, హద్దులను ఛేదించడం, ఎంత దూరం వెళ్లగలమో తెలుసుకోవడం అని, జీవితంలో యువత కూడా రేసు కారు మాదిరి దూసుకుపోవాలని కేటీఆర్ అన్నారు.

ఐటీ మంత్రిగా తన హయాంలో, ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ అయిన టీ-హబ్, భారతదేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ కేంద్రమైన టీ-వర్క్స్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను ఎలా నిర్మించిందో కేటీఆర్ వివరించారు. "ఒక ఆలోచన టీ-హబ్ నుండి టీ-వర్క్స్కు వెళ్లడానికి ఒక టీ తాగేంత సమయం మాత్రమే పడుతుంది" అంటూ ఆలోచన అమలు వేగాన్ని చమత్కరించారు.
యువత ఉద్యోగాలు సృష్టించాలి: కేటీఆర్ పిలుపు
వందలాది మంది యువ ఇంజనీర్లకు సందేశమిస్తూ, అవకాశాల కోసం ఎదురుచూడకుండా, వాటిని మీరే సృష్టించుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. "మీరు సొంతంగా ఒక క్యూను సృష్టించగలిగినప్పుడు, ఇతరులు ఏర్పాటు చేసిన క్యూలో ఎందుకు నిలబడాలి?" అని ప్రశ్నించారు. "ఉద్యోగాలు వెతికేవారుగా కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేవారుగా మారండి. మీరు పెద్ద కలలు కనడం ప్రారంభించిన తర్వాత, మీ సొంత సామర్థ్యాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు" అని ఆయన ఉద్భోదించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రయాణాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. ఒకప్పుడు రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని చాలామంది సందేహించారని, కానీ, "ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత, అనేక రంగాలలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డాము. తెలంగాణ సాధించిన ప్రగతి విశ్వాసానికి పట్టుదలకు దర్శనీకత నిదర్శనం అన్నారు.
Gen Z కు కేటీఆర్ కీలక సందేశం
నేటి యువతరం, Gen Z కు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తూ, కేటీఆర్... ఆదాయం కంటే ప్రభావానికి, అధికారం కంటే ప్రామాణికతకు (Authenticity) ప్రాధాన్యత ఇవ్వాలని, వేగం, విస్తరణ (Speed and Scale) పట్ల ఆకలిని కలిగి ఉండాలని సూచించారు. మీరు ఇతరులు అనుకున్నదాని కంటే తెలివైనవారు, బాధ్యత కలిగినవారు. భారతదేశాన్ని ముందుకు నడిపించేది మీరే" అని విద్యార్థులకు తెలిపారు. మోటార్స్పోర్ట్స్ అయినా, పాలన అయినా, జీవితంలో అయినా విజయం కేవలం యాదృచ్ఛికంగా రాదని, "మనం అవకాశాలను రూపొందించుకోవాలి, ధైర్యంతో అమలు చేయాలి. అప్పుడే భవిష్యత్తు ఉంటుందని" కేటీఆర్ స్పష్టం చేశారు.






















