Revanth Reddy Challenges KCR: కాళేశ్వరంపై అసెంబ్లీ జాయింట్ సెషన్కు సీఎం రేవంత్ సవాల్ - డేట్,టైం చాయిస్ కేసీఆర్, కేటీఆర్, హరీష్కే !
Kaleshwaram Scam: ప్రజా భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఆర్థిక ఉగ్రవాదులుగా తేల్చారు. చర్చకు రావాలన్నారు.

Medigadda Barrage NDSA Report: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారం మరోసారి కార్చిచ్చులా రగులుకుంది. హైదరాబాద్ ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై మునుపెన్నడూ లేనంతగా నిప్పులు చెరిగారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందించిన తిరుగులేని నివేదికలు, ఆధారాలను ప్రస్తావిస్తూ.. కాళేశ్వరం పేరుతో తెలంగాణకు జరిగిన చారిత్రాత్మక విధ్వంసానికి మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే ప్రత్యక్ష బాధ్యులని, ప్రజల సొమ్మును దోచుకున్న వారిని ఆర్థిక ఉగ్రవాదులు అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము చేసిన ఘోర తప్పిదాలను ఇతరులపై నెట్టేసి రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ నేతల మైండ్ గేమ్ను ఇక సాగనిచ్చేది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలను, కేసీఆర్ చేసిన రీడిజైన్ అక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి విడమరిచి చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ. 39 వేల కోట్ల అంచనాతో 16.40 లక్షల ఎకరాలకు నీరందించేలా ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి రూ. 11,670 కోట్లు ఖర్చు చేశాక.. కమిషన్ల కక్కుర్తి కోసం కేసీఆర్ ఆలోచనలు మార్చారని ధ్వజమెత్తారు. రీడిజైనింగ్ కోసం 2015లో వేసిన నిపుణుల కమిటీ "మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దు.. కేసీఆర్ ఆలోచన తప్పు" అని నివేదిక ఇచ్చినా.. దాన్ని పక్కనపెట్టి వ్యాప్కోస్’ సంస్థతో తనకు కావాల్సినట్లు తప్పుడు రిపోర్ట్ ఇప్పించుకున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు ఊరు మార్చి, పేరు మార్చి అంచనాలను రూ. 81 వేల కోట్లకు, ఆపై లక్ష కోట్లకు పెంచినా.. అటు నీళ్లు పెరగలేదు, ఇటు ఆయకట్టు పెరగలేదని సీఎం ఎద్దేవా చేశారు.
తన మేదస్సుతోనే కాళేశ్వరాన్ని డిజైన్ చేశానని కేసీఆర్ స్వయంగా డబ్బా కొట్టుకున్నారు. కానీ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టిన చోట ఎలాంటి భూ పరీక్షలు చేయలేదు. కేసీఆర్ ఇసుకపై ఇసుక మేడల్లా బ్యారేజీలు కట్టారు" అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 2019 జూన్ 21న ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టిన ఏడాది నుంచే గ్రహణం పట్టిందని, నాణ్యత లోపం వల్లే కన్నెపల్లి పంప్హౌస్ మునిగిపోయిందని సీఎం పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నదని, వెంటనే రీస్టోర్ చేయాలని 2020లోనే నాటి ఇంజనీర్ బీవీ రమణారెడ్డి లేఖ రాసినా కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇవాళ కాళేశ్వరానికి వెన్నెముక లాంటి మేడిగడ్డ కుప్పకూలే పరిస్థితికి వచ్చిందన్నారు. కనీస ప్లానింగ్, మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే బ్యారేజీ దెబ్బతిన్నదని ఎన్డీఎస్ఏ నివేదిక కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. 9.5 ఏళ్లలో రూ. 8.21 లక్షల కోట్ల అప్పులు చేసి, కాళేశ్వరం పేరుతో రూ. 1.02 లక్షల కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చేశారని మండిపడ్డారు. వర్షాలు లేక, ఎల్ నినో ప్రభావంతో నీళ్లు లేకపోయినా ఎత్తిపోసుకోవచ్చంటూ హరీష్ రావు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని సీఎం మండిపడ్డారు.
ఈ ప్రాజెక్టు విధ్వంసంపై చర్చించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. చర్చకు రమ్మంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లను పంపిస్తున్నారు. కేసీఆర్ కోరుకున్న రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం సిద్ధం. స్పీకర్కు లేఖ రాసి తేదీ ఖరారు చేయండి. కేసీఆర్ గౌరవానికి భంగం కలగకుండా సభను సజావుగా నడిపే బాధ్యత నాది. ప్రాజెక్టును ఎలా బాగు చేయాలో చెబితే.. వచ్చే మూడేళ్ల రిపేర్ల బాధ్యత కూడా మీకే అప్పగిస్తాం అని సవాల్ చేశారు. కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించొద్దనే ఉద్దేశంతోనే, లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టును నిలబెట్టేందుకు తాము నిపుణులతో ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, ప్రజా భవన్లను వాడుకుంటున్నట్లే.. కాళేశ్వరం నిజంగా ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ఎందుకు వాడబోమని, బీఆర్ఎస్ చేసిన తప్పులకు వాళ్లను ఉరితీయాలని ప్రజలు కోరుకుంటున్నా నిబంధనలు అడ్డొస్తున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ట్రెండింగ్ వార్తలు






















