BRS MLA Defection Case: ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత పిటిషన్ కొట్టివేత, ఫిరాయింపు కేసులో కీలక పరిణామం
BRS MLA Sanjay Kumar | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై నమోదైన అనర్హత పిటిషన్ ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ లో ఉన్నారని పేర్కొన్నారు.

Telangana Politics | హైదరాబాద్: ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్పై బిఆర్ఎస్ (BRS) దాఖలు చేసిన అనర్హత పిటిషన్ను స్పీకర్ కొట్టివేస్తూ, ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. సంజయ్ కుమార్ పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని, ఆయన సాంకేతికంగా బిఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు.
స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ ఆగ్రహం..
బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి వేసిన అనర్హతా పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేస్తూ ఎమ్మెల్యే సంజయ్ కు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని స్పీకర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తి చేసిన స్పీకర్, సుప్రీంకోర్టు గడువు లోపే తన నిర్ణయాన్ని వెలువరించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని, తాను పార్టీ జెండా కప్పుకోలేదని ఎమ్మెల్యే చేసిన వాదనను స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ కేసుతో పాటు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై బిఆర్ఎస్ అనర్హత వేటు వేయాలని కోరగా, ఇప్పటివరకు సంజయ్ కుమార్తో కలిపి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. గతంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య లకు సైతం స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ నిర్ణయాలపై బిఆర్ఎస్ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాటం చేస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
బీఆర్ఎస్ నుంచే గెలిచా.. ఆ పార్టీలోనే కొనసాగుతా: ఎమ్మెల్యే సంజయ్
తన వేతనం నుంచి ప్రతినెలా రూ.5 వేలు బీఆర్ఎస్ కోసం వెళ్తాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు విప్ జారీ చేస్తే తాను మద్దతు ఇస్తానని చెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచానని, ఆ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతా అన్నారు.
మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్
ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణ మోహన్, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు తెలంగాణ స్పీకర్ ఇదివరకే క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని, పార్టీ మారారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ చేయగా, బుధవారం ఉదయం స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణకు హాజరయ్యారు.
























