Karimnagar Check Dam Politics: కరీంనగర్లో చెక్ డ్యామ్ బ్లాస్టింగ్ కలకలం - ఇసుక మాఫియా పనేనని ఆరోపణలు
Check dam Politics: తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఓ చెక్ డ్యాం ధ్వంసం అయింది. ఇసుక మాఫియా పేల్చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Sand mafia blew up the Karimnagar check dam: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలోని మానేరు వాగు పై నిర్మించిన కొత్త చెక్ డ్యామ్ ధ్వంసం అయింది. ఇసుక మాఫియా బ్లాస్టింగ్తో ధ్వంసం చేసినట్లు ఇరిగేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి ముందే ఈ టన జరిగింది. 90 మీటర్ల పొడవు పగుళ్లు, మూడు చోట్ల బ్రీచ్లు ఏర్పడ్డాయి. ప్రభుత్వానికిరూ. 3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ద్వారా 3,000 ఎకరాల ఆయకట్టు ప్రభావితమవుతుందని, వెంటనే 100 ఎకరాల్లో పంటలు నాశనం కావచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ టీమ్, నిపుణులు స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇరిగేషన్ శాఖ అధికారుల ప్రకారం అక్రమ ఇసుక వ్యాపారానికి ఈ చెక్ డ్యాం అడ్డంకిగా మారిందన్న కారణంతో పేల్చేశాని భావిస్తున్నారు రోజుకు 300-400 ట్రాక్టర్లు, ట్రక్లతో హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తున్న మాఫియా, నీటి నిల్వ కారణంగా ఇసుక తవ్వలేకపోవడంతో జిలెటిన్ స్టిక్లు, డిటోనేటర్లతో బ్లాస్టింగ్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇది సహజ కారణాల వల్ల కాదు, ఉద్దేశపూర్వకంగా పేల్చినట్లు కనిపిస్తోంది. మూడు చోట్ల 90 మీటర్ల పొడవు పగుళ్లు, బ్రీచ్లు ఏర్పడ్డాయి అధికారులు ప్రకటించారు.
జమ్మికుంట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ దర్యాప్తు కొనసాగుతోందని చెబుతున్నారు. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి టీమ్ నవంబర్ 24న స్థలాన్ని పరిశీలించింది. సహజ కారణాలా, ఉద్దేశపూర్వక బ్లాస్టింగ్ కావడమా అని నిర్ధారించడానికి సాంపిల్స్ సేకరించారు. కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ కూడా స్థలాన్ని పరిశీలించి, రైతుల ఆందోళనలను విన్నారు.
ఈ ఘటనపై రాజకీయ కలకలం రేగింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీశ్ రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కె. సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు డి. మనోహర్ రెడ్డి, ఆర్. బాలకిషెన్, ఎస్. రవి శంకర్లు నవంబర్ 25న స్థలాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ ఇసుక మాఫియా పేల్చింది. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్కు కూడా ఇదే కారణమా అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేసి, నిందితులపై చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. నిర్మాణ లోపమైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ను బ్లాక్లిస్ట్ చేయాలని, టెండర్లు రద్దు చేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అండదండతోనే ఇసుక మాఫియా చెలరేగిపోతుంది
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) November 25, 2025
చెక్ డ్యామ్లను కూల్చివేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి
కెసిఆర్ కడితే రేవంత్ రెడ్డి కూలుస్తున్నాడు
కాలేశ్వరం ప్రాజెక్టుపై కూడా ఇలాంటి దుష్టచర్యలే జరిగాయేమో అనుమానం
టెర్రరిస్టులను మించిపోతున్న ఇసుక మాఫియా
కాలేశ్వరం కింద… pic.twitter.com/DCfFnS1MVV
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.చెక్ డ్యామ్ కూలిపోవడంపై పరిశీలనకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. జమ్మికుంటలోని తనుగుల-గుంపుల చెక్ డ్యామ్లో విస్తృత నిర్మాణ లోపాలు, చెక్ డ్యామ్లు కూలిపోవడం పెద్ద సమస్య అన్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది.





















