ACB notices to KTR: సోమవారం పొద్దున్నే రండి - కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం పది గంటలకు తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

ACB issues notice to KTR once again : ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఇంతకు ముందుఓ సారి నోటీసులు జారీ చేసినా.. తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని రాలేనని.. వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. ఆ మేరకు ఏసీబీ అధికారులు ఇప్పుడు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో ఓ సారి ఈడీ ఎదుట కూడా హాజరయ్యారు. ఓ సారి ఏసీబీ విచారణకు వెళ్లినా లాయర్ ను అనుమతించలేదని మళ్లీ వెనక్కి వెళ్లిపోయారు. అప్పట్లోనే మరోసారి పిలుస్తారని ప్రచారం జరిగింది కానీ ఎలాంటి నోటీసులు రాలేదు. చాలా కాలం తర్వాత గత నెలలో నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై అప్పట్లో కేటీఆర్ కేటీఆర్ సోషల్ మీడియాలో స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ, నేను ఖచ్చితంగా ఏజెన్సీలతో సహకరిస్తానననిప్రకటించారు. చాలా ముందుగానే పార్టీ కార్యక్రమాల కోసం UK & USAకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని తెలిపారు. తాను తిరిగి వచ్చిన తర్వాత వారి ముందు హాజరవుతాను. ACB అధికారులకు అదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాననని ప్రకటించారు. ఆ ప్రకారం ఇప్పుడు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. కానీ అనుకున్న ఫలితంరాలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను వెంటనే విచారించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో అప్పట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. 'అసలు ఫార్ములా ఈ రేస్ ఎందుకు తీసుకురావాలనుకున్నారు.?, ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు.?, HMDA నిధులు ఎలా బదిలీ చేశారు.?, అగ్రిమెంట్లు, ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలా చెల్లింపులు చేశారు.?, HMDA నుంచి ఈ కార్ రేసింగ్కు రూ.55 కోట్లు ట్రాన్స్ఫర్ ఎలా జరిగింది.?, ఐటీకి HMDA రూ.8.6 కోట్లు ఎందుకు పే చేయాల్సి వచ్చింది.?, 10 సీజన్స్ నిర్వహించాలని వారు షరతులు విధించారా.?, అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిల పాత్ర ఏంటి.?' వంటి వాటిపై గత విచారణలో అడిగినట్లుగా చెబుతున్నారు.
ఎన్నికలకు ముందు ఫార్ములా ఈ నిర్వహించే కంపెనీకి హెచ్ఎండీఏ ఖాతా నుంచి యాభై కోట్ల ను చెల్లించారు. అయితే అలాంటి చెల్లింపుల కోసం కనీసం కేబినెట్ అనుమతి కూడా తీసుకోలేదు. కేవలం కేటీఆర్ నోటి మాట ద్వారానే చెల్లించేశారు. తర్వాత ఎన్నికల్లో.. బీఆర్ఎస్ పరాజయం పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో యాభై కోట్ల గోల్ మాల్ పై చర్యలు ప్రారంభించారు. అయితే తన ఆదేశంతోనే చెల్లించామని కేటీఆర్ అంగీకరిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు కోసం.. హైదరాబాద్ కోసమే చెల్లించామని అంటున్నారు. ఇందులో అవినీతికి అవకాశమే లేదని చెబుతున్నారు.





















