Ujjain Mahakal Bhasma Aarti: మహాకాల్ ఆలయంలో భస్మ హారతి కోసం బుకింగ్ ఇకపై ఆన్లైన్లో! ఎంత చెల్లించాలి, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి!
Bhasma Aarti online tatkal ticket: మహాకాలేశ్వర ఆలయంలో భస్మ హారతిని వీక్షించడానికి, మీరు ఇకపై ఆన్లైన్లో టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బుకింగ్ కోసం మీరు ఎంత చెల్లించాలో తెలుసుకోండి.

Ujjain Mahakal Bhasma Aarti: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో షిప్రా నది ఒడ్డున వెలసిన శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత మహిమాన్వితమైనది. ఇక్కడ శివుడు 'కాలానికి, మరణానికి అధిపతి'గా మహాకాలుడిగా పూజలందుకుంటాడు. ఇక్కడ శివలింగం దక్షిణాభిముఖంగా ఉండటం విశేషం. ప్రతిరోజూ తెల్లవారుజామున ఇక్కడ జరిగే 'భస్మ హారతి'అత్యంత ప్రత్యేకం.
మహాకాలేశ్వర ఆలయంలో ఈ భస్మ హారతిని వీక్షించడానికి, మీరు ఇకపై ఆన్లైన్లో టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉచిత భస్మ హారతి సేవ నిలిపివేశారు.
మహాకాలేశ్వర ఆలయంలో జరిగే ప్రసిద్ధ భస్మ హారతికి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఉచిత ఆఫ్లైన్ అనుమతిని పూర్తిగా నిలిపివేశారు. ఇకపై భక్తులు భస్మ హారతిలో పాల్గొనడానికి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ బుకింగ్ కోసం భక్తులు ఒక్కొక్కరికి రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఒక భక్తుడు ఏప్రిల్ 18న జరిగే భస్మ హారతిలో పాల్గొనాలనుకుంటే, ఏప్రిల్ 17న ఉదయం 8:00 గంటలకు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
https://www.shrimahakaleshwar.mp.gov.in/ ఈ అధికారిక వెబ్సైట్లో మీరు మహాకాలేశ్వర్ వద్ద జరిగే భస్మ హారతి కోసం తక్షణ బుకింగ్లు చేసుకోవచ్చు. తక్షణ బుకింగ్ కోసం 300 మంది సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు.
పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ముందుగా వచ్చిన వారికి ముందుగా స్లాట్లు కేటాయిస్తారు
మహాకాల్ భస్మ హారతి కోసం బుకింగ్లను ఆలయ అధికారిక వెబ్సైట్లో చేసుకోవాలి. గతంలో, బుకింగ్లు మూడు నెలల ముందుగానే ప్రారంభమయ్యేవి, కానీ ఇప్పుడు దీనిని ఒక నెలకు తగ్గించారు. జూన్ నెల బుకింగ్లు మే 1వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి.
పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి "అవంతిక" అని పేరు.. ఏడు మోక్షధామాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది ఉజ్జయిని. కృతయుగం నాటికి చెందిన ఈ ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రం ఎన్నో రహస్యాలకు నెలవు. ఈ క్షేత్రంలోని శివలింగం మంత్ర శక్తిలో ఏర్పడిందని భావిస్తారు. అందుకే ఇక్కడ మహాకాళేశ్వరుడి దర్శనం భయం, పాపాల నుంచి విముక్తిని కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ మహాకాళేశ్వరుడు దక్షిణాభిముఖంగా వెలసి ఉండడం వల్ల ఈ స్వామిని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం మహాకాళ విగ్రహం పైన ఉంటుంది. ఉజ్జయిని మహాకాళేశ్వరుని దేవాలయం 5 అంతస్తుల్లో ఉంటుంది. ఒకటి భూ అంతర్భాగం. శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి.
మహాకాళేశ్వరుని ఆలయంలో తప్పకుండా చూడాల్సింది భస్మ హారతి. ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే ఈ హారతి దర్శనం చేసుకోవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలని పెద్దలు చెబుతారు. మహాకాళేశ్వరునికి జరిగే భస్మాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది.
మొదటి రకం విభూత్యాభిషేకంలో భాగంగా తెల్లని పలచని బట్టలో ఆవు పేడతో తయారైన మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పై పట్టుకుని మరో మూటతో దానిని కొడతారు. ఆ సమయంలో భస్మం కేవలం శివలింగంపైనే కాదు..మొత్తం అంతరాలయాన్ని చుట్టేసేతుంది. ఆ సమయంలో శంఖాలు, బేరీలు, పెద్ద పెద్ద మృదంగాలు మోగిస్తారు. ఆ క్షణం అక్కడున్న భక్తులు అలౌకిక ఆనందంలో మునిగిపోతారు
రెండో రకం భస్మహారతిలో భాగంగా బ్రాహ్మీ ముహూర్తంలో స్మశానానికి వెళ్లి అప్పుడే కాలిన శవం నుంచి భస్మాన్ని సేకరించి ఆలయానికి చేరుకుంటారు అర్చకులు. ఆ శవ భస్మంతో స్వామికి భస్మాభిషేకం చేస్తారు. భస్మ హారతి సాక్షాత్తు కైలాసంలో పరమేశ్వరుని దర్శించిన అనుభూతి కలుగుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























