Andhra Coalition Politics: కల్తీ నెయ్యి ఇష్యూలో అంటీముట్టనట్లుగా బీజేపీ - టీడీపీ, జనసేనలదే పోరాటం - ఎందుకిలా ?
Adulterated ghee Politics: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. హిందూ ధర్మ పరిరక్షణ తమ బాధ్యతగా చెప్పుకునే బీజేపీ టీడీపీ, జనసేనల కంటే వెనుకబడింది. ఎందుకని?

BJP ignore adulterated ghee issue: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తున్న తీరు, దీనిపై బీజేపీ నేతల మౌనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాజమండ్రి జైలు వద్ద మీడియాలో మాట్లాడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలాన్నిచ్చాయి. లడ్డూ కల్తీపై చంద్రబాబు విపరీతంగా స్పందిస్తున్నారని, కానీ హిందూత్వానికి పేటెంట్ ఉన్నట్లు భావించే బీజేపీ నేతలు కూడా అలా మాట్లాడటం లేదని ఆయన విశ్లేషించారు. ఇలాంటి అభిప్రాయం ఇప్పటికే రాజకీయవర్గాల్లో ఉంది.
హిందూత్వ అంశంలో ముందుగా స్పందించే బీజేపీ
సాధారణంగా హిందూ ధర్మం, దేవాలయాల పరిరక్షణ అనే అంశాలు రాగానే బీజేపీ అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు అందరూ ఉవ్వెత్తున స్పందిస్తుంటారు. శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్ జరిగిందన్న వార్త రాగానే బీజేపీ నేత మాధవ్ తక్షణమే స్పందించారు. కానీ, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న, అత్యంత ఘోరమైన అపచారంగా భావిస్తున్న లడ్డూ కల్తీ విషయంలో మాత్రం బీజేపీ స్పందన నామమాత్రంగానే ఉండటం గమనార్హం. జాతీయ మీడియాలో ఈ అంశంపై భారీ చర్చ జరుగుతున్నా, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఆందోళనలకు గానీ, బలమైన నిరసనలకు గానీ పిలుపునివ్వలేకపోయారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ ప్లాన్
లడ్డూ కల్తీ అంశాన్ని కేవలం ఒక అవినీతి కేసుగా కాకుండా, కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్గా మార్చడంలో టీడీపీ, జనసేన అగ్రనేతలు సఫలమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ప్రతి వేదికపై ఈ అపచారాన్ని ఎండగడుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ మాత్రం ఈ క్రెడిట్ అంతా తమ మిత్రపక్షాల ఖాతాలోకి వెళ్తున్నా, ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతోంది.
బీజేపీ మౌనం వెనుక మర్మమేంటి?
చంద్రబాబు ప్రత్యేకంగా బీజేపీ నేతలను పిలిపించి మాట్లాడించిన తర్వాత కూడా వారిలో ఆశించిన స్థాయిలో చలనం కనిపించడం లేదు. హిందూ ధర్మానికి అపచారం జరుగుతున్నా, బీజేపీ నేతలు ఎందుకు ఈ అంశంతో తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై అప్పుడు గళమెత్తిన బీజేపీ, ఇప్పుడు ఇంత పెద్ద ఆధారాలు బయటపడుతున్నా గట్టిగా మాట్లాడలేకపోవడానికి కారణం ఏమిటనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బీజేపీ నేతల ఈ ఉదాసీన వైఖరి ఇప్పుడు విపక్షాలకు అస్త్రంగా మారుతోంది. జాతీయ స్థాయిలో ఈ అంశంపై విచారణకు మొగ్గు చూపుతున్న కేంద్ర పెద్దలు, రాష్ట్ర స్థాయిలో మాత్రం స్థానిక నేతలను కట్టడి చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అది రాజకీయ వ్యూహమా లేకపోతే ఇంకేదైనా కారణమా అన్నది కూటమిలోని ఇతర పార్టీలకు అంతు చిక్కడం లేదు.
Before You Go
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















