Andhra Pradesh Assembly: ఏపీ అసెంబ్లీలో ఇక డిజిటల్ అటెండన్స్ - స్పీకర్ కీలక నిర్ణయం - వైసీపీ ఎమ్మెల్యేల కోసమే !
Digital attendance : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇక డిజిటల్ అటెండెన్స్ అమలు చేస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Digital attendance in Ap Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసుకున్న సాంకేతిక నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సంప్రదాయ అటెండెన్స్ విధానానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వస్తి పలికారు. వైసీపీ సభ్యులు సభకు హాజరు కాకుండానే బయట రిజిస్టర్లలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారనే ఆరోపణలు వస్తున్నందున ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం, ఎమ్మెల్యేలు కేవలం లాబీల్లో సంతకాలు చేస్తే సరిపోదు.. సభ లోపలికి వచ్చి తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే అక్కడ అమర్చిన ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు వారి ముఖాలను గుర్తించి హాజరును నమోదు చేస్తాయి.
జగన్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకూ అసెంబ్లీ బహిష్కరిస్తామని ప్రకటన
జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. అయితే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం వరుసగా 60 రోజుల పనిదినాల పాటు సభకు గైర్హాజరైతే సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉంది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి, కేవలం రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోతున్నారు కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు. కానీ, స్పీకర్ తెచ్చిన కొత్త ఏఐ నిబంధనతో ఇప్పుడు వారు కచ్చితంగా సభ లోపలికి అడుగుపెట్టాల్సిందే. లోపలికి వచ్చి సీట్లలో కూర్చున్నారంటే, అది సాంకేతికంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లే అవుతుంది.
దొంగ సంతకాలు పెట్టిపోతున్నారని స్పీకర్ ఆగ్రహం
గవర్నర్ ప్రసంగం ఒక్క రోజే హాజరు కావాలనుకుంటున్న నేతలకు ఈ డిజిటల్ నిఘా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సభ జరుగుతున్నంత సేపు సీట్లలో కూర్చుని అటెండెన్స్ రికార్డ్ చేయించుకోకపోతే, ఆ రోజు వారు గైర్హాజరైనట్లుగానే పరిగణిస్తారు. వరుసగా ఇలాంటి గైర్హాజరు నమోదైతే అనర్హత వేటు పడే అవకాశం ఉండటంతో, ఇష్టం లేకపోయినా సభలో కూర్చోవాల్సిన అనివార్య పరిస్థితి వైసీపీ సభ్యులకు ఏర్పడింది. కేవలం సాంకేతికతను ఉపయోగించి ప్రతిపక్షం అనుసరిస్తున్న సంతకాల రాజకీయాన్ని స్పీకర్ అడ్డుకున్నట్లేనని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
కొత్త వ్యవస్థతో అసెంబ్లీకి హాజరు తప్పని సరి
ప్రజల సమస్యలపై చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు, కేవలం పదవులను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లను ఈ వ్యవస్థ ఎండగడుతోంది. కేవలం జీతభత్యాలు, పదవి రక్షణ కోసం కాకుండా, సభా మర్యాదలను గౌరవించి చర్చల్లో పాల్గొనేలా చేయడమే ఈ ఏఐ అటెండెన్స్ ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆధునిక సాంకేతికతతో అసెంబ్లీలో సభ్యుల జవాబుదారీతనం పెరుగుతుందని, దొంగ సంతకాల సంస్కృతికి శాశ్వతంగా తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.























