Kerala Assembly Elections 2026:కేరళలో బీజేపీ క్రిస్టియన్ మంత్రం - ఈ స్కెచ్ మరో రేంజ్ !
Kerala Christians: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్రిస్టియన్ల మద్దతుతో బ లమైన పోటీ ఇచ్చే దిశగా ఎదుగుతోంది. చర్చిల మద్దతు చాలా చోట్ల బిజేపీకి లభిస్తోంది.

BJP gains support among Christians in Kerala Assembly elections: కేరళ రాజకీయాల్లో పాగా వేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ, అక్కడ కేవలం హిందూత్వ కార్డుతోనే విజయం సాధించలేమని గుర్తించి, వ్యూహాత్మకంగా తన రూటు మార్చింది. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో దాదాపు 18-20 శాతం ఉన్న క్రైస్తవులను ఆకర్షించేందుకు క్రిస్టియన్ మంత్రం పఠిస్తోంది.
కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకుపై గురి
కేరళలో దశాబ్దాలుగా క్రైస్తవ సమాజం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కి వెన్నెముకగా ఉంటూ వస్తోంది. అయితే, ఇటీవల ముస్లిం లీగ్ ప్రభావం యూడీఎఫ్లో పెరిగిందన్న భావన క్రైస్తవుల్లో ఒక రకమైన అసంతృప్తిని కలిగిస్తోంది. దీనిని ఆసరాగా చేసుకున్న బీజేపీ, క్రైస్తవులను తనవైపు తిప్పుకోవడం ద్వారా కాంగ్రెస్ పునాదులను దెబ్బతీయాలని చూస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిసూర్ విజయం , సురేష్ గోపీకి లభించిన క్రైస్తవ ఓట్ల మద్దతు ఈ వ్యూహం ఫలిస్తున్నదని బీజేపీ బలంగా నమ్ముతోంది.
ఉమ్మడి శత్రువు - భయాందోళనల రాజకీయాలు
ముస్లిం జనాభా పెరుగుదల, వక్ఫ్ బోర్డు భూముల వివాదాస లవ్ జిహాద్ వంటి అంశాలపై క్రైస్తవ సమాజంలో ఉన్న ఆందోళనలను బీజేపీ తన రాజకీయాస్త్రాలుగా మలుచుకుంటోంది. ఈ అంశాల్లో క్రైస్తవ మత పెద్దలకు మద్దతుగా నిలవడం ద్వారా, మీ ప్రయోజనాలను రక్షించేది మేమే అనే సంకేతాన్ని పంపిస్తోంది. ముఖ్యంగా కాథలిక్ చర్చిలోని కొన్ని వర్గాలు ఇటీవల బీజేపీ వైపు మొగ్గు చూపడం, ఆర్ఎస్ఎస్ ( నేతలు బిషప్లతో చర్చలు జరపడం ఈ సామాజిక ఇంజనీరింగ్ లో భాగమే.
పదవులు , అభ్యర్థుల ఎంపిక
కేవలం మాటలకే పరిమితం కాకుండా, పార్టీ పదవుల్లో క్రైస్తవులకు పెద్దపీట వేస్తోంది. కేంద్ర మంత్రిగా జార్జ్ కురియన్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అనీల్ ఆంటోనీ వంటి వారిని ముందుంచడం ద్వారా క్రైస్తవ వ్యతిరేక పార్టీ అనే ముద్రను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధిక సంఖ్యలో క్రైస్తవ అభ్యర్థులను నిలబెట్టాలని, తద్వారా ప్లాన్-బి కింద క్రైస్తవ ప్రాబల్యం ఉన్న మధ్య కేరళలో పట్టు సాధించాలని ప్లాన్ చేస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ స్నేహయాత్ర వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. క్రిస్మస్, ఈస్టర్ పండగల సమయంలో బీజేపీ నేతలు చర్చిలను సందర్శించడం, క్రైస్తవ కుటుంబాల ఇళ్లకు వెళ్లి మోదీ ప్రభుత్వ పథకాలను వివరించడం వంటివి క్షేత్రస్థాయిలో మార్పు తెస్తున్నాయి. ముఖ్యంగా రబ్బర్ ధరల పతనం వంటి ఆర్థిక అంశాలపై కేంద్రాన్ని ఒప్పించి రైతులకు మేలు చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా కేరళలోని సిరో-మలబార్ చర్చి మద్దతును పొందేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది.
బీజేపీ భావజాలంతో క్రైస్తవుల్లో అనుమానాలు
బీజేపీ వ్యూహానికి కొన్ని ప్రధాన సవాళ్లు కూడా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో క్రైస్తవ మిషనరీలపై జరుగుతున్న దాడులు, మణిపూర్ హింసాకాండ వంటి అంశాలను ఇతర పార్టీలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఒకవైపు ఇక్కడ స్నేహం నటిస్తూనే, మరోవైపు దాడులు చేస్తున్నారు అనే ప్రచారాన్ని క్రైస్తవ సమాజంలోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు కొంతవరకు సఫలమవుతున్నాయి. ప్రస్తుతానికి బీజేపీ వేస్తున్న అడుగులు కేరళలో త్రిముఖ పోటీకి తెరలేపాయి. క్రైస్తవ ఓట్లలో కనీసం 10-15 శాతం చీల్చగలిగినా, అది ఎల్డీఎఫ్ లేదా యూడీఎఫ్ ల గెలుపోటములను శాసిస్తుంది. . బహిరంగంగా బీజేపీని వ్యతిరేకించే క్రైస్తవులు కూడా రహస్యంగా ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే బీజేపీ ఈ క్రైస్తవ మంత్రం ఎంతవరకు పారిందో తేల్చే అసలైన తీర్పు కానున్నాయి.























