Hyderabad Old City Minority Voters: పాతబస్తీలో ఓటరు సంక్షోభం - SIRపై మైనారిటీల్లో అభద్రతా భావం.. కర్ణాటక మోడల్ డిమాండ్పై రేవంత్ సర్కార్ సైలెన్స్!
Special Voter Revision Old City Technical Issues: SIR ప్రక్రియ వల్ల హైదరాబాద్ లో పాతబస్తీలో ఓటర్లకు అనేక సమస్యలు వస్తున్నాయి. పర్మినెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్ లేకపోవడమే కారణం.

CM Revanth Reddy AIMIM Conflict On Hyderabad Voters: హైదరాబాద్ పాతబస్తీ లో నివసించే మైనారిటీ వర్గాల ఓటర్లు ప్రస్తుతం తీవ్రమైన అభద్రతా భావంతో పాటు ఒక రకమైన సాంకేతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పాతబస్తీలోని వేలాది మంది పేద ముస్లిం ఓటర్ల పాలిట ఒక పెద్ద శాపంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. దశాబ్దాలుగా ఇక్కడే పుట్టి పెరిగి, ప్రతి ఎన్నికల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నప్పటికీ.. నూతన సవరణ నిబంధనలు, కఠినమైన పత్రాల కొరత కారణంగా చాలా మంది పేర్లు ఓటరు జాబితా నుంచి శాశ్వతంగా గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది.
పాతబస్తీలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులను గమనిస్తే.. ఇక్కడి జనాభాలో అత్యధికులు అద్దె ఇళ్లలో, మురికివాడల్లో నివసించే పేద వర్గాలే. మారుతున్న నిబంధనల ప్రకారం ఓటు నమోదుకు లేదా సవరణకు సరైన అడ్రస్ ప్రూఫ్, ఆధార్ లింకేజ్, గ్యాస్ లేదా ఎలక్ట్రికల్ బిల్లులు వంటి పక్కా పత్రాలను అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, చాలా కాలంగా ఒకే ప్రాంతంలో స్థిర నివాసం లేని వారికి, సరైన అవగాహన లేని పేదలకు ఈ పత్రాలను సమర్పించడం ఒక పెద్ద సవాలుగా మారింది. దీంతో క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చే అధికారులు నిబంధనల సాకుతో వేలాది మంది ఓట్లను తొలగిస్తున్నారని, ఇది కేవలం ఒక మున్సిపల్ వార్డుకో లేదా నియోజకవర్గానికో పరిమితం కాకుండా మొత్తం పాతబస్తీ పొలిటికల్ డెమోగ్రఫీని మార్చేసేంత తీవ్రమైనదిగా మారిందని మజ్లిస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
పాతబస్తీ ప్రజల ఓట్లు గల్లంతు కాకుండా ఉండాలంటే వారికి కర్ణాటక తరహాలో శాశ్వత నివాస ధృవీకరణ పత్రం ’ ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల పత్రాల కొరత తీరి ఓటు హక్కు సురక్షితంగా ఉంటుందని మజ్లిస్ భావిస్తోంది. ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ పాతబస్తీలో ఎంఐఎం పార్టీ గుత్తాధిపత్యానికి, సాంప్రదాయ ఓటు బ్యాంకుకు పెద్ద గండి కొట్టే ప్రమాదం ఉంది. మజ్లిస్ పార్టీకి ల్యాండ్ మార్క్ లాంటి పాతబస్తీ స్థానాల్లో ఓట్ల సంఖ్య భారీగా తగ్గితే, అది భవిష్యత్తులో ఆ పార్టీ రాజకీయ ఉనికికే నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ సాంకేతిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, ఓటర్లకు ఉపశమనం కలిగించేలా చట్టపరమైన నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని అసదుద్దీన్ ఓవైసీ గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ దిశగా ఎలాంటి సానుకూల ప్రయత్నాలు చేయడం లేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఓవైసీ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
మజ్లిస్ ను పెద్దగా పట్టించుకోని రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న ఈ వ్యూహాత్మక మౌనం వెనుక పక్కా రాజకీయ లెక్కలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ మజ్లిస్ పార్టీ అడిగిందే తడవుగా నిర్ణయాలు తీసుకునేవారు. కానీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం పాతబస్తీలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే సవరణలు జరగనిస్తోంది తప్ప, మజ్లిస్ కోసం ప్రత్యేక మినహాయింపులు లేదా నివాస ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. ఒకవేళ ఇక్కడ ఓట్లు తగ్గిపోతే అది పూర్తిగా మజ్లిస్ పార్టీకే పొలిటికల్ డ్యామేజ్ కలిగిస్తుంది తప్ప, అక్కడ నామమాత్రపు బలం ఉన్న కాంగ్రెస్కు వచ్చే నష్టమేమీ లేదని రేవంత్ భావిస్తున్నారు.
అంతేకాకుండా, మజ్లిస్కు లొంగిపోకుండా స్వతంత్రంగా వ్యవహరించడం ద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీలకు తామే అసలైన ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవాలనేది కాంగ్రెస్ దీర్ఘకాలిక వ్యూహం. ఈ పొలిటికల్ మైండ్ గేమ్ కారణంగానే పాతబస్తీ ఓటర్ల సమస్యపై ప్రభుత్వం అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తోంది.
పాతబస్తీలోని పేద ముస్లింల ఓటు హక్కు సాంకేతిక కారణాలతో గల్లంతవుతుండటం సామాజికంగా ఆందోళనకరమైన విషయమే అయినప్పటికీ, ఇది ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం మధ్య ఒక పెద్ద పొలిటికల్ వార్గా రూపాంతరం చెందింది. ఓవైసీ బ్రదర్స్ ఈ ఓటర్ల సంక్షోభాన్ని సాకుగా చూపి మైనారిటీలలో సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తుండగా, రేవంత్ రెడ్డి మాత్రం నిబంధనల ప్రకారం సాగుతున్న ప్రక్రియలో జోక్యం చేసుకోకుండా మజ్లిస్ను మరింత డిఫెన్స్లోకి నెట్టే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఈ ఓటర్ల గల్లంతు వ్యవహారం పాతబస్తీ రాజకీయ చిత్రపటాన్ని ఎలా మార్చబోతోందనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















