Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Kavitha new party: కవిత కొత్త పార్టీతో బీఆర్ఎస్ పార్టీకి పెను సమస్యలు రానున్నాయి. కవిత పార్టీ చీల్చే ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీవే అవుతాయన్న అంచనాలు ఉన్నాయి.

BRS party will face big problems with Kavitha new party: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెను సంచలనం ముంచుకొస్తోంది. కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కొత్త పార్టీని ప్రకటిస్తున్నారు. ఈ పరిణామం కేవలం ఒక కొత్త పార్టీ ఆవిర్భావం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీ పునాదులను కదిలించే ఒక వ్యూహాత్మక చీలికగా చెప్పుకోవచ్చు.
బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు సర్జికల్ స్ట్రైక్
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అత్యంత బలమైన ఓటు బ్యాంకులో చీలిక తేవడమే కవిత ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఒక కొత్త పార్టీగా కవిత కేవలం 4 నుండి 5 శాతం ఓట్లను చీల్చగలిగినా, అది బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదకరంగా మారనుంది. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్, ఇప్పుడు కవిత రూపంలో ఎదురవుతున్న ఈ ఇంటి పోరు ను తట్టుకోవడం కష్టతరమే. ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్, సాంస్కృతిక అంశాలపై పట్టున్న కవిత, బీఆర్ఎస్ కోర్ ఓటర్లను తనవైపు తిప్పుకుంటే ఆ పార్టీ కోలుకోవడం అసాధ్యం కావచ్చు.
అసంతృప్త నేతలకు జాగృతి ఆశ్రయం
బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం కేటీఆర్ ఆధిపత్యం పెరిగిందని, సీనియర్లకు ప్రాధాన్యత తగ్గటంపై లోలోపల తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేసీఆర్ మౌనం, హరీష్ రావు ఇరకాటం వంటి పరిస్థితులతో .. పార్టీలో గుర్తింపు లేని ద్వితీయ శ్రేణి నాయకులు, టిక్కెట్లు దక్కని ఆశావాహులు ఇప్పుడు కవిత వైపు చూస్తున్నారు. కవిత పార్టీ ప్రకటన వెలువడగానే, బీఆర్ఎస్ నుండి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అవకాశాలు రాని నేతలకు కవిత ఒక ప్రత్యామ్నాయ వేదికగా మారడం బీఆర్ఎస్ క్యాడర్ను నిలువునా చీల్చనుంది.
కుటుంబంలో చీలిక - ఇరకాటంలో కేసీఆర్
కేటీఆర్, హరీష్ రావుల తీరుపై గుర్రుగా ఉన్న కవిత, తనపై జరిగిన రాజకీయ కుట్రలకు ప్రతీకారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కవితతో సర్దుకుపోయే ప్రసక్తే లేదని సంకేతాలిస్తుంటే, అటు తండ్రిగా కేసీఆర్ వారించలేక, ఇటు పార్టీని కాపాడుకోలేక మౌనం వహిస్తున్నారు. ఈ అంతర్గత కలహాలు బీఆర్ఎస్ బలహీనపడటానికి ప్రధాన కారణం కానున్నాయి. కవిత పార్టీ పెట్టడం వెనుక ఉన్న బలమైన ఉద్దేశ్యం అధికారం కంటే కూడా, తనను దూరం పెట్టిన బీఆర్ఎస్ నేతలకు ఒక గట్టి పాఠం చెప్పడమేనని అర్థమవుతోంది.
రాజకీయ సమీకరణాల్లో మార్పులు
విత చేయబోయే అధికారిక ప్రకటనతో తెలంగాణలో సరికొత్త సమీకరణాలు మొదలవుతాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుండి బయటపడిన తర్వాత బాధితురాలిగా ప్రజల్లోకి వెళ్లాలని ఆమె యోచిస్తున్నారు. వ్యక్తిగా వెళ్తున్నాను.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను అన్న ఆమె నినాదం ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కవిత చీల్చే ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్ విజయవకాశాలను దెబ్బతీస్తూ, పరోక్షంగా ప్రత్యర్థి పార్టీలకు లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించే పరిష్కారం బీఆర్ఎస్ వద్ద కనిపించడం లేదు.























