US Iran War Updates: పశ్చిమాసియాకు భారీగా చేరుకున్న అమెరికా సైన్యం.. ఏ క్షణంలోనైనా ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్ ?
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం విరామం సమయంలోనూ అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అమెరికా యుద్ధనౌక USS ట్రిపోలి, 31వ మెరైన్ యూనిట్లు మధ్యప్రాచ్యానికి చేరుకున్నాయి.

Israel Iran war: ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం నెల రోజులు పూర్తి చేసుకున్న సమయంలో అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక ఉనికిని మరింత పెంచింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, వార్ షిప్ USS ట్రిపోలిలో ఉన్న దాదాపు 3,500 మంది మెరైన్లు, నావికులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అమెరికా ఇరాన్లో సైనిక చర్యకు దిగుతుందా ? గగనతలం నుంచే కాకుండా భూతల దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది అనేది స్పష్టమవుతోంది.
50,000 మంది అమెరికా సైనికులు
కొత్తగా బలగాలను రప్పించడంతో ఇప్పుడు పశ్చిమాసియాలో దాదాపు 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇంతకుముందు కూడా అమెరికా ఈ ప్రాంతంలో తన సైనిక శక్తిని పెంచింది. కానీ గత 20 సంవత్సరాలలో ఇది అమెరికా అతిపెద్ద సైనిక సమీకరణగా చెప్పవచ్చు. అంటే ఇరాన్తో తాడోపేడో తేల్చుకునేందుకు అమెరికా సిద్థమైనట్లు సంకేతాలు ఇచ్చింది. శాంతి చర్చలు జరుగుతాయని, దాడులకు బ్రేక్ ఇస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూనే మరోవైపు సైన్యాన్ని అక్కడికి తరలించడం దేనికి సంకేతం.
మార్చి 27న USS ట్రిపోలి చేరుకుంది
అమెరికా యుద్ధనౌక USS ట్రిపోలి మార్చి 27న మధ్యప్రాచ్యానికి చేరుకున్నట్లు CENTCOM సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ Xలో తెలిపింది. 'యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రాంతంలో USS ట్రిపోలిలో మోహరించిన నావికులు, మెరైన్లు చేరుకున్నారు' అని ప్రకటనలో పేర్కొంది.
ఓడలో అత్యాధునిక ఆయుధాలు, విమానాలు
USS ట్రిపోలిలో రవాణా, దాడి కోసం ఉపయోగించే అనేక రకాల విమానాలు, యుద్ధ పరికరాలు ఉన్నాయి. CENTCOM విడుదల చేసిన ఫొటోలలో మెరైన్ సైనికులు పూర్తిగా యూనిఫాంలో కనిపించారు. అలాగే సీహాక్ హెలికాప్టర్లు, ఓస్ప్రే ట్రాన్స్పోర్ట్ విమానాలు, అమెరికా F-35 ఫైటర్ జెట్లు కూడా ఓడలో ఉన్నాయి.
జపాన్ నుండి మళ్లించారు
USS ట్రిపోలి, 31వ మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ సాధారణంగా జపాన్లో మోహరించి ఉంటాయి. నివేదిక ప్రకారం, ఈ యూనిట్ తైవాన్ సమీపంలో కసరత్తు చేస్తోంది. ఆ తరువాత పశ్చిమాసియా దేశాలకు పంపించారు.
U.S. Sailors and Marines aboard USS Tripoli (LHA 7) arrived in the U.S. Central Command area of responsibility, March 27. The America-class amphibious assault ship serves as the flagship for the Tripoli Amphibious Ready Group / 31st Marine Expeditionary Unit composed of about… pic.twitter.com/JFWiPBbkd2
— U.S. Central Command (@CENTCOM) March 28, 2026
ఇప్పటికే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, యుద్ధనౌకలు
మెరైన్లు రాకముందే అమెరికా ఇప్పటికే ఈ ప్రాంతంలో 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు, పలు వార్ షిప్స్.. వేలాది సైనికులను మోహరించింది. ఇది గత రెండు దశాబ్దాలలో అతిపెద్ద సైనిక మోహరింపు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
AP నివేదిక ప్రకారం, అమెరికా సరికొత్త ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ USS గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ ఇటీవల మరమ్మత్తు కోసం మధ్యప్రాచ్యం నుండి యూరప్నకు బయలుదేరింది. లాండ్రీ ఏరియాలో మంటలు చెలరేగడంతో అందులో కొన్ని స్లీపింగ్ క్వార్టర్లు దెబ్బతిన్నాయి.
భూతల దాడులపై సస్పెన్స్
అమెరికా సీనియర్ అధికారులు భూతలం నుంచి దాడి చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, సైనిక సన్నాహాలు దీనిని బలపరుస్తున్నాయి. ఇరాన్పై జరుగుతున్న ఆపరేషన్లు త్వరలో ముగుస్తాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కే రుబియో అన్నారు. ఫ్రాన్స్లో G7 దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశం తర్వాత, ఇది నెలల్లో కాదు, కొన్ని వారాల్లో పూర్తవుతుందని అన్నారు. భూమిపై నుంచి సైనికులను పంపకుండానే అమెరికా తన లక్ష్యాలను సాధిస్తుందని, అయితే సాధ్యమైనన్ని దారులు తెరిచే ఉంచడానికి కొన్ని సైనిక కార్యకలాపాలు చేపడుతున్నామని అన్నారు.
ఇరాన్ సమీపంలో మోహరించనున్న అమెరికా సైన్యం
ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, అమెరికా తమ సైన్యాన్ని ఇరాన్ సమీపంలో మోహరించవచ్చు. టార్గెట్ ప్రాంతాల్లో ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ద్వీపం ఏరియా కూడా ఉంది.
ట్రంప్ స్పష్టమైన వైఖరి తీసుకోలేదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. కానీ ఈ ప్రాంతానికి కనీసం 10,000 మంది అదనపు సైనికులను పంపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యుద్ధానికి విరామం అంటూనే సైనికులను తరలించడం ట్రంప్ భిన్న వైఖరికి నిదర్శనం.
























