US Iran War: పిచ్చివాళ్ల చేతిలో అణ్వాయుధాలు ఉండరాదు, ఏ క్షణమైనా ఇరాన్పై సైనికచర్య: డొనాల్డ్ ట్రంప్
US Iran Conflict | ఇరాన్తో యుద్ధం, కాల్పుల విరమణకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. పిచ్చివాళ్ల చేతిలో అణ్వాయుధాలు ఉండకుండా చూస్తామన్నారు.

US Iran War | వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధం ముగిసిందని పేర్కొంటూనే మరోవైపు తాము ఆ దేశంతో యుద్ధం చేయలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. పిచ్చివాళ్ల చేతుల్లో అణ్వాయుధాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇరాన్ను అడ్డుకునేందుకు అమెరికా బీ2 బాంబర్లతో దాడులు చేసిందన్నారు. ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. సీజ్ఫైర్ (కాల్పుల విరమణ) ప్రకటన తర్వాత ఇరుదేశాల మధ్య ఈ శత్రుత్వం ముగిసిందని పేర్కొన్నారు. ఇరాన్ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు చర్చల కోసం పంపిన కొత్త ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము అంగీకరించలేని కండీషన్లను ఇరాన్ పెడుతోందని అన్నారు. మరోవైపు ఇరాన్ అగ్ర నాయకత్వం కూడా ఏకాభిప్రాయంతో లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
గత మూడు వారాలుగా ఇరాన్, అమెరికా మధ్య సీజ్ఫైర్ కొనసాగుతుందంటే యుద్ధం ముగిసిందని అర్థం చేసుకోవాలన్నారు ట్రంప్. ఇరాన్తో శత్రుత్వం ముగిసిందని అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా కాంగ్రెస్కు సమాచారం ఇచ్చింది. అయితే ఆ ప్రాంతంలో అమెరికా సైన్యం ఇంకా మోహరించి ఉండటంతో వార్ ముగిసిందా లేదా అని ప్రపంచ దేశాలకు క్లారిటీ రావడం లేదు. వార్ పవర్స్ రిజల్యూషన్ ప్రకారం 60 రోజుల్లోపు సైనిక చర్యకు కాంగ్రెస్ ఆమోదం ఉండాలి.
మే 1 నాటి గడువు ముగిసిన సమయంలోనే ఈ అంశం తెరపైకి రావడంతో ట్రంప్ ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇరాన్ మీద అమెరికా చేపట్టిన సైనిక చర్యను సమర్థించుకున్న ఆయన.. దాన్ని యుద్ధంగా భావించడం లేదంటూ అందరికీ షాకిచ్చారు. మరోవైపు, యుద్ధాన్ని ఆపడానికి సెనెట్లో డెమొక్రాట్లు చేసిన ప్రయత్నం కూడా వీగిపోయింది.
పరిస్థితులు పూర్తిగా సద్దుమణగలేదు - ట్రంప్
అమెరికా కాంగ్రెస్కు రాసిన లేఖలో పరిస్థితులు పూర్తిగా ప్రశాంతంగా లేవని ట్రంప్ తెలిపారు. ఇరాన్ నుంచి అమెరికా పౌరులకు, సైన్యానికి ఇంకా ముప్పు పొంచి ఉందని, శాంతిని కాపాడటానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తానని అన్నారు. తమ దేశ ప్రయోజనాల కోసం యురేనియంను సుసంపన్నం చేసుకునే హక్కు తమకు ఉందని ఇరాన్ అంటోంది. అయితే పాశ్చాత్య దేశాలు దీనిని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అమెరికా తన వైఖరిని మార్చుకుంటే ఇరు దేశాల మధ్య చర్చలకు వీలుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ అన్నారు. తమ రక్షణ కోసం ఇరాన్ పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
సైనిక చర్య మళ్లీ జరగవచ్చు
అవసరమైతే ఇరాన్ మీద సైనిక చర్యను మరింత విస్తరించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అలా చేయడం తనకు ఇష్టం లేదన్నారు. తమ ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయని.. ఒకటి పూర్తిగా దాడి చేసి నాశనం చేయడం, లేకపోతే తమతో ఒప్పందం చేసుకోవడం అని తెలిపారు. మానవతా దృక్పథంతో తాను ఒప్పందమే బెస్ట్ ఆప్షన్గా భావిస్తున్నానని ఆయన అన్నారు.
హర్మూజ్పై పట్టుబిగిస్తామన్న ఐఆర్జీసీ
పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి సముద్ర మార్గాలపై తమ నియంత్రణను మరింత బలోపేతం చేయనున్నట్లు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ (IRGC) నౌకాదళం ప్రకటించింది. సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశాల మేరకు దాదాపు 2,000 కి.మీ. మేర విస్తరించి ఉన్న తీరప్రాంతంలో ఆధిపత్యంపై కొత్త నిబంధనలు, వ్యూహాలు సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ఈ జలాలను ఇరాన్ భద్రతకు, ప్రజల జీవనోపాధికి ప్రతీకగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొంది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో అమెరికా నేవీ దిగ్బంధనం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు 42 నౌకలను అడ్డుకున్నామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ సైతం పలు దేశాల ఓడలపై దాడులు చేసి తమ నియంత్రణను చాటుకుంటోంది. ఇరు దేశాల చర్యలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ట్రెండింగ్ వార్తలు





















