Trump Tariffs: యాపిల్, శాంసంగ్కు ఊరట.. సుంకాల నుంచి వాటికి మినహాయింపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం టారిఫ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రతీకార సుంకాల నుంచి మినహాయించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం టారిఫ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రతీకార సుంకాల నుంచి మినహాయించింది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో యాపిల్, శాంసంగ్, డెల్ వంటి బడా కంపెనీలతో పాటు అమెరికాలోని వినియోగదారులకూ ఊరట లభించినట్లయ్యింది.
ట్రంప్ నిర్ణయాన్ని అగ్రశ్రేణి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారు చేసే దిగ్గజాలతోపాటు ఆపిల్ శామ్సంగ్ లాంటి సంస్థలు స్వాగతిస్తున్నాయి. వార్తా సంస్థ AFP ప్రకారం.. చైనా నుంచి యూఎస్లోకి ప్రవేశించే స్మార్ట్ఫోన్లు, వాటి విడి భాగాలు సహా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ విభాగంలోకి వస్తాయి. ఇవి ప్రస్తుతం 145 శాతం అదనపు సుంకానికి లోబడి ఉన్నాయి.
అసంబద్ధంగా భావించే పద్ధతులను పరిష్కరించేందుకు తాము ‘ప్రతీకార సుంకాల’ను ప్రవేశపెట్టినట్లు అమెరికా పేర్కొంటోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా చైనాను లక్ష్యంగా చేసుకున్నారు. చైనా మినహా మిగిలిన దేశాలపై వేసిన సుంకాలను ఇటీవల ట్రంప్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చైనాపై మాత్రం 145 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఘాటుగా స్పందించిన చైనా.. తమ దేశం కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం సుంకం వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికాకు చెందిన యాపిల్ వంటి సంస్థలు చైనాలో ఐఫోన్లు, ఇతర యాపిల్ ప్రొడక్టులను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి.
ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందిన జాబితాలో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్ డ్రైవ్లు, కంప్యూటర్ ప్రాసెసర్లు, మెమొరీ చిప్లు, ఫ్లాట్ టీవీ డిస్ప్లేలు, సెమీ కండక్టర్లు, సోలార్ సెల్స్ వంటివి ఉన్నాయి. చైనాపై విధించిన 145 శాతం సుంకం వీటికి వర్తించదు. వీటికి వేర్వేరు సుంకాలు వర్తిస్తాయని కస్టమ్స్ విభాగం పేర్కొంది. వాస్తవానికి ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే వాటిని మినహాయిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
ట్రంప్ చర్యల కారణంగా అమెరికాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు స్థానికంగా ఎగబడిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రతీకార సుంకాలతో అత్యధికంగా నష్టపోయింది యాపిల్ కంపెనీనే. తాజా నిర్ణయంతో ఆ కంపెనీకి కాస్త ఊరట లభించినట్లయ్యింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

