ఫిరాయింపుల నిరోధక చట్టం (10వ షెడ్యూల్) ప్రకారం అనర్హత ప్రమాదాన్ని తప్పించుకోవడానికే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. రెండు వంతుల సభ్యులు విలీనమైతే వారికి చట్టపరమైన రక్షణలు లభిస్తాయి.
టీఎంసీ విలీనం ప్రక్రియలో ఈ కొత్త పార్టీ ట్విస్ట్ ఏంటి? మమతపై మాస్టర్ ప్లానా!!
టీఎంసీలో సంక్షోభంలో తిరుగుబాటు ఎంపీలు నేరుగా బీజేపీలో చేరకుండా NCPI లో విలీనం కావడం కొత్త చర్చ. ఫిరాయింపు చట్టం నిబందనలు, శివసేన-ఎన్సీపీ ఉదాహరణలు, మమతా బెనర్జీకి మిగిలిన చట్టపరమైన అవకాశాలపై విశ్లేషణ.

- తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఫిరాయింపు చట్టం తప్పించుకునేందుకు చూస్తున్నారు.
- మూడింట రెండొంతుల సభ్యుల విలీనంతో రక్షణ పొందే వ్యూహం.
- బీజేపీ పరోక్ష మద్దతుతో ఈ ప్రక్రియ జరుగుతోందని విశ్లేషణ.
- స్పీకర్ నిర్ణయం, న్యాయ పోరాటాలపై దీని భవిష్యత్తు ఆధారపడుతుంది.
టీఎంసీ విలీనం ప్రక్రియలో ఈ కొత్త పార్టీ ట్విస్ట్ ఏంటి? మమతపై మాస్టర్ ప్లానా!!
రాజకీయ పార్టీలు చీలిపోవడం కొత్త కాదు. కానీ ఈసారి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో జరుగుతున్న పరిణామాలు సాధారణ తిరుగుబాటుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకమైన పార్టీగా పేరున్న టీఎంసీలోనే ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ తిరుగుబాటు కాదు... వారు ఎంచుకున్న "విలీన మార్గం".
సాధారణంగా ఒక పార్టీకి చెందిన ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరితే అది ఫిరాయింపుగా పరిగణించే అవకాశం ఉంటుంది. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ (ఆంటీ డిఫెక్షన్ చట్టం) ప్రకారం వారు అనర్హతను ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే గతంలో చాలామంది రాజకీయ నాయకులు చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు.
టీఎంసీ ఎంపీల వ్యూహమేంటి..??
టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు ఇప్పుడు వేరే వ్యూహాన్ని ఎంచుకున్నారు. నేరుగా బీజేపీలో చేరకుండా, ముందుగా నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనం కావాలని నిర్ణయించడం వెనుక ఇదే కారణమని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిన్న లోక్సభ స్పీకర్ ను టీఎంసీ సభ్యుడు సుదీప్ బంధోపాద్యాయ నేతృత్వంలో కలిసి ఆమేరకు వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒక పెద్ద పార్టీకి చెందిన ఎంపీలు, దేశవ్యాప్తంగా పెద్దగా గుర్తింపు లేని చిన్న పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? అని.
దీనికి సమాధానం చట్టపరమైన రక్షణ కోసమే అని తెలుస్తోంది. యాంటీ డిఫెక్షన్ చట్టం ( 10th Schedule, Para -4) ప్రకారం శాసనసభ లేదా పార్లమెంటులో ఒక పార్టీకి చెందిన కనీసం మూడింట రెండు వంతుల సభ్యులు కలిసి మరో పార్టీలో విలీనం అయితే వారికి కొన్ని రక్షణలు లభించే అవకాశం ఉంటుంది. అందుకే "ఫిరాయింపు" అనే ముద్రను తప్పించుకుని "విలీనం" అనే మార్గాన్ని ఎంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వ్యూహం వెనక బీజేపీ వుందా..
ఈ ప్రక్రియ మొత్తం టీఎంసీ అంతర్గత వ్యవహారమే అయినా వారు చేరాలనుకున్నది బీజేపీ. ఐతే నేరుగా బీజేపీలో చేరితే పార్టీలను చీల్చే రాజకీయం చేస్తున్నారు అనే విమర్శ ఎదుర్కోవాల్సిఉంటుంది. పైగా న్యాయపరమైన చిక్కుల్లో బీజేపీ కూడా సమాధానం చేప్పుకోవాల్సి ఉంటుంది.అందుకే పార్టీ పరోక్షంగా ఈ పావులు కదిపింది. స్పీకర్ ను కలవడానికి ముందే బీజేపీ సీనియర్ నాయకులు అమిత్ షా, భూపేంద్ర యాదవ్ లతో టీఎంసీ ఎంపీలు పలు దఫాలుగా సమావేశమయ్యారు. పార్లమెంటులో ఎన్డీయే బలం పెంచుకుంటూనే బీజేపీ చేతికి మట్టంటకుండా మూడో చిన్న పార్టీని తెరపైకి తెచ్చారు. ఇది కేవలం నంబర్ గేమ్ కాదు. ఇది రాజకీయ వ్యూహం కూడా.
మహారాష్ట్రలో అనుభవాలతో..
ఇలాంటి వ్యూహం రాజకీయాల్లో కొత్తది కాదు. మహారాష్ట్రలో శివసేన చీలిక సమయంలో ఏక్నాథ్ షిండే వర్గం, అలాగే ఎన్సీపీ విభజన సమయంలో అజిత్ పవార్ వర్గం కూడా మూడింట రెండు వంతుల సంఖ్యాబలాన్ని ఆధారంగా చేసుకుని తమ చర్యలకు చట్టబద్ధత ఉందని వాదించాయి. ఆ అనుభవాల నేపథ్యంలోనే ఇప్పుడు టీఎంసీ తిరుగుబాటు వర్గం కూడా ఫిరాయింపు ఆరోపణలను తప్పించుకునేందుకు విలీన మార్గాన్ని ఎంచుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ వ్యూహం విజయవంతమవుతుందా లేదా అనేది పూర్తిగా లోక్సభ స్పీకర్ నిర్ణయం, తదనంతర న్యాయపోరాటాలపై ఆధారపడి ఉంటుంది. టీఎంసీ ఇప్పటికే ఈ చర్యను సవాలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. మమతా బెనర్జీ శిబిరం దీన్ని "విలీనం పేరుతో ఫిరాయింపు" కుట్రగా ఆరోపిస్తోంది. టీఎంసీ మొత్తాన్నీ ఒకే బృందంగా చూడాలని స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొంది.
మమత నెగ్గుకురాగలదా..
ప్రస్తుత పరిస్థితుల్లో నంబర్ గేమ్ మమతకు వ్యతిరేకంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ పార్టీకి, నాయకురాలికి అత్యంత విధేయులుగా కనిపించిన సుదీప్ బంధోపాద్యాయ, కకోలీ ఘోష్ లాంటి నేతలే తిరుగుబాటు బావుటాఎగరేసారు. పదిమందితో ప్రారంభమైన తిరుగుబాటు ఎంపీల బృందం నేడు మూడింటి రెండొంతులకు చేరింది. మరోవైపు ఎమ్మెల్యేలూ అంతే గెలిచిన 80మందిలో 60 మంది మమతతో విభేదించి వేరే ఫ్లోర్ లీడర్ను ఎన్నుకున్నారు.దీంతో పార్టీ నిట్టనిలువునా చీలింది. అంతే కాదు అసలైన తృణమూల్ పార్టీ తమదే అనే వరకూ మమత చిక్కుల్లో పడింది.
ఐతే ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్న మమతకు ఉంది. పార్లమెంటు, అసెంబ్లీ పక్షం చీలినా పార్టీ పై ఇంకా మమత పట్టు ఉందంటున్నారు. అందుకే అన్ని కమిటీలు రద్దుచేసి తిరుగుబాటు నాయకులను ఏరివేసి మళ్లీ కొత్త రూపు తెచ్చే ప్రయత్నం చేసుకుంటున్నారు. ఎలాగూ బెంగాల్లో మమతను మించిన ప్రతిపక్షలేదు కాబట్టి పార్టీని కొత్త రక్తంతో మరో కొత్త ఉత్సాహంతో పునర్ణిర్మించుకునేందుకు ఇదో అవకాశంగా తీసుకోవచ్చు.
ప్రజాస్వామ్యంపై పెద్ద ప్రశ్న
శివసేన, ఎన్సీపీ రాజకీయ సంక్షోభాల తర్వాత మరోసారి భారత రాజకీయాలు ఒక ప్రశ్నను ఎదుర్కొంటున్నాయి — ఎవరు అసలైన పార్టీ? పార్టీ అధినేతనా? పార్టీ ఓ సంస్థగానా? లేక ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులా? అనేది అసలు ప్రశ్న. మరోవైపు టీఎంసీలో తిరుగుబాటు వర్గం సంఖ్యాబలం తమవైపే ఉందని చెబుతున్నా.. పార్టీలో విభేదాలతో చీలడం వేరు కానీ అధికారం వైపు లాలూచీ పడే ఈ కొత్త వైఖరి మాత్రం ఇప్పుడు ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించే ఆవకాశముంది.
తృణమూల్ కాంగ్రెస్లో జరుగుతున్న ఈ పరిణామాలు ఆ ప్రశ్నకు మరోసారి సమాధానం వెతికే పరిస్థితిని తీసుకొచ్చాయి.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Frequently Asked Questions
టీఎంసీ ఎంపీలు నేరుగా బీజేపీలో చేరకుండా వేరే పార్టీలో ఎందుకు విలీనం అవుతున్నారు?
టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు ఏ పార్టీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నారు?
వారు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనం కావాలని నిర్ణయించుకున్నారు. ఇది 'ఫిరాయింపు' అనే ముద్రను తప్పించుకోవడానికి ఎంచుకున్న వ్యూహం.
టీఎంసీ ఎంపీల ఈ విలీన వ్యూహంలో బీజేపీ పాత్ర ఏమిటి?
బీజేపీ పరోక్షంగా ఈ పావులు కదిపిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నేరుగా చేరకుండా పార్లమెంటులో ఎన్డీయే బలం పెంచుకోవడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం.
ఈ వ్యూహం విజయవంతమవుతుందా లేదా అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఈ వ్యూహం విజయం లోక్సభ స్పీకర్ నిర్ణయం, అలాగే తదనంతర న్యాయపోరాటాలపై ఆధారపడి ఉంటుంది. మమతా బెనర్జీ శిబిరం ఇప్పటికే దీనిని సవాలు చేసేందుకు సిద్ధమవుతోంది.
ట్రెండింగ్ వార్తలు






















