![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Breaking News Telugu Live Updates: కేసీఆర్తో ముగిసిన ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం
LIVE
![Breaking News Telugu Live Updates: కేసీఆర్తో ముగిసిన ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ Breaking News Telugu Live Updates: కేసీఆర్తో ముగిసిన ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/c9d0923ff474d5cb58add922469b0e5c_original.jpg)
Background
తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ ప్రస్తుతం తగ్గింది. శుక్రవారం, శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్ వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 40 గంటల సమయం పట్టింది. ఆదివారం నాడు శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు దాదాపు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో పేర్కొంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో వికేండ్ లో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా భక్తుల కోసం వారపు ఆర్జిత సేవలను సైతం రద్దు చేయాలని ఈవో ధర్మారెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలకు, కొంకణ్లోని పలు ప్రాంతాలకు, ముంబై, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు శనివారం ప్రవేశించాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ ఉపరితల ఆవర్తనం, పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రుతుపవనాల గమనం మందగించడంతో తెలుగు రాష్ట్రాల్లోకి ఆలస్యంగా ప్రవేశిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఏపీలోని రాయలసీమలోకి ప్రవేశించాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. కానీ అమరావతి వాతావరణ కేంద్రం మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
రానున్న 48 గంటల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, కొంకణ్ లోని మిగిలిన ప్రాంతాల్లోకి, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య, వాయువ్యవ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఆంధ్రప్రదేవ్ తీరం వద్ద సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు ఏపీ, తెలంగాణ సహా బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, ఉపహిమాలయాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిశా, గంగా టిక్ పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బిహార్ లోని కొన్ని ప్రాంతాలలోకి తదుపరి రెండు నుంచి మూడు రోజులలో రుతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి.
తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారి (55) అదృశ్యం కావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా తన భర్త వెంకటాచారి కనిపించడం లేదంటూ ఆయన భార్య కాసోజు శంకరమ్మ హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆయన అదృశ్యమైన పది రోజుల తరువాత శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 1వ తేదీన ఓ పని మీద వెంకటాచారి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదని, ఆయనను చూడలేదని.. తన భర్త జాడ కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదులో శంకరమ్మ పేర్కొన్నారు.
తన భర్త వెంకటాచారి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వద్ద ఉండొచ్చునని శంకరమ్మ అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటాచారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్లు కేఏ పాల్ ప్రకటించడం తెలిసిందే. కేఏ పాల్ ఆహ్వానం మేరకు వెంకటాచారి ప్రజా శాంతి పార్టీలో చేరారు.
బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. నిన్న దిగొచ్చిన బంగారం ధరలు నేడు పెరిగాయి. మరోవైపు వెండి ధర నిలకడగా ఉంది. రూ.650 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750కి పుంజుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,350 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు నేడు హైదరాబాద్లో 1 కేజీ వెండి ధర రూ.67,000 అయింది.
CM Jagan News: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి – ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు బాలసాకేత్ రెడ్డి – మహిమల వివాహం ఇటీవల హైదరాబాద్ లోని ఫిలింనగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ హాజరు కాలేదు. అక్కడ విజయమ్మ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా కావలిలో బాలసాకేత్ రెడ్డి -మహిమ ల వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం ఆల్రడీ మంత్రుల బృందం నెల్లూరులోనే మకాం వేసింది. వీరంతా రిసెప్షన్ కు హాజరయ్యారు. వేదికమీద నూతన దంపతులను సీఎం జగన్ ఆశీర్వదంచారు. కావలిలోని ఆర్ఎస్ఆర్ విద్యాసంస్థల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
KCR Undavalli Arun Kumar Meeting: కేసీఆర్తో ముగిసిన ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే వీరిద్దరి భేటీ ముగిసింది. అంతకుముందు కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఇలా ప్రముఖులతో కేసీఆర్ వరుసగా భేటీ అవుతుండడం చర్చనీయాంశం అయింది. సీఎం జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
KCR PK Meet: ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ - పీకే చర్చలు
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. మూడు గంటలుగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి మంత్రి హరీశ్ రావు కూడా హాజరయ్యారు. జాతీయ పార్టీ ప్రకటన, ఎన్నికలు, సర్వే తదితర కీలక అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ మరో రెండు రోజులు హైదరాబాద్లోనే ఉండనున్నట్లు సమాచారం.
Payal Rajputh in Tirupati: తిరుపతిలో పాయల్ రాజ్ పుత్ సందడి
ప్రముఖ సినీ తార పాయల్ రాజ్ ఫుత్ తిరుపతిలో సందడి చేసింది. తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిలోని రామానుజపల్లి వద్ద హోటల్ ద్వారకా ఇన్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైంది. రిబ్బన్ కట్ చేసి హోటల్ ను ప్రారంభించింది. హోటల్
ప్రారంభోత్సవంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని అన్నారు పాయల్ రాజ్ ఫుత్. హోటల్ ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడిన పాయల్. సక్సెస్ అనేది మన సొంతం అయితే మనమే ఆ సక్సెస్ కు డెఫినిషన్ అవుతామని అన్నారు. హోటల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవాలని కోరుకున్నట్లు తెలిపారు. త్వరలోనే నాలుగు సినిమాలు విడుదల కానున్నాయని, అందులో రెండు ఫ్యాన్ ఇండియా సినిమాలని చెప్పారు. నిరంతరాయంగా ఆరు నుంచి ఏడు సినిమాల్లో నటించడంతో చాలా బిజీగా ఉన్నానని అన్నారు. మంచు విష్ణు జిన్నా మూవీలను, జయరాజ్ బయోపిక్ లోనూ నటిస్తున్నట్లు పాయల్ రాజపుత్ పేర్కొన్నారు.
Tirumala News: టీటీడీ ట్రస్టులకు రూ.3.20 కోట్లు విరాళం..
తిరుపతి: టీటీడీలోని ట్రస్టులకు వివిధ సంస్థల నుండి రూ.3.20 కోట్లు ఆదివారం ఉదయం విరాళంగా అందింది.. హైదరాబాదుకు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ గ్రూప్స్ సంస్థ యాజమాన్యం వెంకటేశ్వర్లు,ప్రసాదరావు,రాజమౌళి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.1.20 కోట్లు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు అందించారు.. అదేవిధంగా హైదరాబాద్ కు చెందిన హానర్ హోమ్స్ సంస్థ యాజమాన్యం బాలచంద్ర, స్వప్న కుమార్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.40 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు సంబంధిత డీడీలను అందజేశారు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)