Supreme Court: ఏఐతో పిటిషన్ రాసుకొచ్చి సుప్రీంకోర్టులోనే అభాసుపాలయ్యాడు - ఈ స్వెట్టర్ వ్యాపారి ఇలా తెల్లారింది !
Ludhiana sweater petitioner : తేరగా ఏఐ ఉంది కదా అని ఓ వ్యక్తి ఓ పిటిషన్ రాసుకున్నాడు. నేరుగా సుప్రీంకోర్టుకే వచ్చాడు. అందులో ఉన్న వాటికి అర్థం చెప్పమని అడిగితే .. చెప్పలేక పరువు పోగొట్టుకున్నాడు.

Strange petition in the Supreme Court: చదువుకుంది 12వ తరగతి.. వృత్తి రీత్యా స్వెట్టర్లు అమ్ముకునే వ్యాపారి.. కానీ వేసిన పిటిషన్ మాత్రం దేశ అత్యున్నత న్యాయస్థానంలో, అది కూడా పీఎం కేర్స్ ఫండ్ వంటి క్లిష్టమైన అంశంపై! లూథియానాకు చెందిన రజనీష్ సిద్ధూ అనే వ్యాపారి చేసిన ఈ సాహసం చివరకు సుప్రీంకోర్టులో నవ్వులు పూయించడమే కాకుండా, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఘాటు సెటైర్లకు వేదికైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి పిటిషన్ రాసి, కోర్టును బురిడీ కొట్టించబోయిన ఈ మేధావికి న్యాయమూర్తులు చురకలు అంటించారు.
మంగళవారం జరిగిన విచారణలో, సిద్ధూ తన పిటిషన్ను స్వయంగా వినిపించడం మొదలుపెట్టారు. అయితే, ఆయన చదువుతున్న ఇంగ్లీష్లోని కఠినమైన న్యాయ పదజాలం చూసి ధర్మాసనానికి అనుమానం వచ్చింది. "ఇదంతా మీరే రాశారా?" అని చీఫ్ జస్టిస్ ప్రశ్నించగా.. "అవును మిలార్డ్, నేనే రాశాను, కావాలంటే నా ఫోన్ చెక్ చేయండి" అని సిద్ధూ చాలా కాన్ఫిడెంట్గా సమాధానమిచ్చారు. దీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్ వ్యంగ్యంగా.. "అబ్బో! ఎంతటి సాహసం.. లూథియానా నుంచి నేరుగా సుప్రీంకోర్టుకే వచ్చేసి భలే ధైర్యం చేశారే!" అంటూ చలోక్తి విసిరారు.
అసలు గుట్టు రట్టు చేయడానికి చీఫ్ జస్టిస్ సిద్ధూకి ఒక చిన్న పరీక్ష పెట్టారు. నేను ఇక్కడే మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ పెడతాను, ఇందులో కనీసం 30 శాతం మార్కులు సాధించినా.. ఈ పిటిషన్ మీరే రాశారని నమ్ముతాను అని చెప్పారు. అప్పుడే పిటిషన్లో ఉన్న Fiduciary Risk of Corporate Donors అనే పదానికి అర్థం చెప్పమని సీజేఐ కోరారు. అంతే స్వెట్టర్ వ్యాపారి గాల్లో తేలారు. నోరు మెదపలేక, కాగితాల్లో వెతుక్కుంటున్న పిటిషనర్ను చూసి, సిద్ధూ గారు.. ఇదంతా ఎవరో లాయర్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ అని అర్థమవుతోంది అని కోర్టు తేల్చి చెప్పింది.
చివరికి అసలు విషయం ఒప్పుకున్న సిద్ధూ.. ఒక టైపిస్ట్కు నాలుగు స్పెట్టర్లు గిఫ్ట్గా ఇచ్చి, మూడు నాలుగు ఏఐ టూల్స్ సాయంతో ఈ పిటిషన్ తయారు చేశానని అంగీకరించారు. లాయర్లకు ఇచ్చేంత డబ్బు లేకే గూగుల్ ను ఆశ్రయించానని చెప్పుకొచ్చారు. ఈ సమాధానంతో విస్తుపోయిన న్యాయమూర్తులు.. మీలాంటి అమాయకులను వాడుకుని ఇలాంటి పిటిషన్లు వేయించే వాళ్లు మీకే నష్టం కలిగిస్తారు, భారీ జరిమానాలు పడేలా చేస్తారు అని హెచ్చరించారు.
చివరగా పిటిషన్ను కొట్టేస్తూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వేసిన సెటైర్ కోర్టు హాల్నే షేక్ చేసింది. వెళ్లి.. లూథియానాలో మరో రెండు మూడు స్వెట్టర్లు అమ్ముకోండి.. ఈ పిటిషన్ల జోలికి వచ్చి అనవసరంగా జరిమానాలు కట్టుకోకండి అని ఉచిత సలహా ఇచ్చి పంపేశారు. ఏఐ తెలివితేటలతో సుప్రీంకోర్టునే బురిడీ కొట్టించాలనుకున్న ఈ 'స్వెట్టర్ సాహసం' ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.























