![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Women's Reservation Bill 2023: రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం, అనుకూలంగా 215 ఓట్లు
ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా 10 గంటల పాటు చర్చ జరిగింది.
![Women's Reservation Bill 2023: రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం, అనుకూలంగా 215 ఓట్లు woman reservation bill 2023 passed in rajyasabha after loksabha Women's Reservation Bill 2023: రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం, అనుకూలంగా 215 ఓట్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/21/4a53fed55352258c471e98dac0ced3631695315774508234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Women's Reservation Bill 2023: రాజ్యసభలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 215 ఓట్లు పడగా, ఒక్కటి కూడా వ్యతిరేక ఓటు పడలేదని రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై సుదీర్ఘంగా 10 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం గురువారం (సెప్టెంబరు 21) రాత్రి 10 గంటల సమయంలో ఆటోమేటెడ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించి ఈ చారిత్రక బిల్లును రాజ్యసభలో ఆమోదించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 19న లోక్సభలో ప్రవేశపెట్టగా ఆ మర్నాడు 20న చర్చ జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 8 గంటల పాటు చర్చ తర్వాత మ్యాన్యువల్ ఓటింగ్ నిర్వహించారు. లోక్సభలో 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా (ఎంఐఎం ఎంపీలు) ఓటు వేశారు. ఇప్పుడు ఉభయ సభల్లో చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినట్లు అయింది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును గురువారం (సెప్టెంబర్ 21) రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. బిల్లుకు అనుకూలంగా 214 ఓట్లు వచ్చాయి. సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో ఈ బిల్లుపై ప్రతిపాదించిన సవరణలన్నీ వీగిపోయాయి. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇది.
రాజ్యసభ చైర్మన్ అభినందనలు
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఈ బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.
ఇది చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించిన ప్రధాని మోదీ
ఈ బిల్లు ఆమోదంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మన దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇదొక నిర్ణయాత్మక ఘట్టమని అన్నారు. 140 కోట్ల మంది భారతీయులకు అభినందనలు. నారీ శక్తి వందన చట్టానికి ఓటేసిన రాజ్యసభ ఎంపీలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి ఏకగ్రీవ మద్దతు నిజంగా హర్షణీయం. దీనితో భారత మహిళలకు బలమైన ప్రాతినిధ్యం, సాధికారత యుగానికి నాంది పలుకుతున్నాం. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో వారి స్వరాన్ని మరింత సమర్థవంతంగా వినిపించడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
బిల్లును ప్రవేశపెట్టే సమయంలో అర్జున్ రామ్ మేఘ్వాల్ ఏమన్నారంటే.
ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మహిళా సాధికారతకు సంబంధించినదని, ఇది చట్టంగా మారితే 543 మంది సభ్యులున్న లోక్ సభలో మహిళా సభ్యుల సంఖ్య 82 నుంచి 181కి పెరుగుతుందని చెప్పారు. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తారు.
దీని కింద ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు లభిస్తాయన్నారు. అందువల్ల జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ముఖ్యమైనవి. బిల్లు ఆమోదం పొందిన వెంటనే జనాభా గణన, డీలిమిటేషన్ ఉంటుంది. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ. ఏ సీటు మహిళలకు దక్కుతుందో డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై గురువారం రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది.
ఎంపీలందరికీ ధన్యవాదాలు
రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ బిల్లు దేశ ప్రజల్లో కొత్త నమ్మకాన్ని కలిగిస్తుందని అన్నారు. మహిళా సాధికారత, మహిళా శక్తిని పెంపొందించడంలో అందరు సభ్యులు, రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. ఈ బిల్లు ఆమోదంతోనే మహిళా శక్తికి ప్రత్యేక గౌరవం దక్కుతోంది. ఈ బిల్లు పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా ఆలోచించడం దేశంలోని మహిళా శక్తికి కొత్త శక్తిని ఇవ్వబోతోంది. సభ్యులందరికీ నా కృతజ్ఞతలు.
"ఇది జోక్ కాకూడదు."
రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చర్చ సందర్భంగా ఈ బిల్లుకు తాము మద్దతుగా నిలుస్తున్నానని చెప్పారు. మా పార్టీతోపాటు I.N.D.I.A. లోని పార్టీలు ఈ బిల్లుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చినట్టు పేర్కొన్నారు. చిన్న సవరణతో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఓబీసీ మహిళలను ఎందుకు వదిలేస్తున్నారు?, మీరు ఈ బిల్లును ఎప్పుడు అమలు చేయబోతున్నారో స్పష్టం చేయండి, తేదీని చెప్పండి. మేం సపోర్ట్ చేస్తున్నాం కానీ బిల్లు జోక్ కాకూడదన్నారు.
ప్రధాని మోదీకి జేపీ నడ్డా కృతజ్ఞతలు
చాలా కాలంగా కొనసాగుతున్న రిజర్వేషన్ల అంశాన్ని నిర్ణయాత్మక దశలోకి తీసుకురావడానికి ప్రయత్నించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు జేపీ నడ్డా. ఈ బిల్లును ఇప్పటి నుంచే అమలు చేయాలనే చర్చ జరుగుతోంది. కొన్ని రాజ్యాంగపరమైన ఏర్పాట్లు ఉన్నాయని, కొన్ని రాజ్యాంగబద్ధమైన పద్ధతులు ఉన్నాయని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)