PM Modi: ‘కోల్డ్ ప్లే’.. ఎవరి నోట విన్నా ఇదే మాట.. ప్రధాని మోదీ కూడా..
PM Modi: ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తున్న కోల్డ్ ప్లే మ్యూజిక్ బ్యాండ్ ఇప్పుడు భారత్లో సందడి చేస్తోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ షోపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

PM Modi Comments On Cold Plays: ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగిస్తున్న అత్యంత పాపులర్ మ్యూజిక్ బ్యాండ్ కోల్డ్ ప్లే (Coldplay). 1996లో లండన్లో మొదలైన ఈ బ్రిటీష్ రాక్ బ్యాండ్కు విశ్వవ్యాప్తంగా అభిమానులున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన బ్యాండ్గా దీనిని 2013లో ఫోర్బ్స్ గుర్తించింది. ఈ బ్యాండ్ ఇప్పుడు భారత్లో సందడి చేస్తోంది. వీరు నిర్వహిస్తున్న ఈవెంట్స్కు యువత నుంచి భారీ స్పందన వస్తోంది. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు
గత సెప్టెంబర్లో వీరి పర్యటన భారత్లో ఖరారు కాగానే కొన్ని నిమిషాల్లోనే ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోయాయి. అమ్మకాల రద్దీని తట్టుకోలేక ఒక దశలో బుక్ మై షో హ్యాంగ్ అయిపోయింది. ముంబయి, అహ్మదాబాద్లో జరిగిన ఈవెంట్లలో యువత సందడి అంబరాన్నంటింది. ఈ నేపథ్యంలోనే కన్సర్ట్పై ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ షోపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
లైవ్ కాన్సర్ట్లకు దేశంలో మంచి స్కోప్
ప్రస్తుతం ఒడిశా పర్యటనలో ఉన్న ప్రధాని భువనేశ్వర్లో రెండు రోజుల పాటు జరిగే ఉత్కర్ష ఒడిశా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కోల్డ్ ప్లే’ ప్రదర్శనల గురించి ప్రస్తావించారు. కాన్సర్ట్ ఎకానమీకి బూస్ట్ ఇచ్చే దిశగా ఆలోచించాలన్నారు. ‘ముంబయి, అహ్మదాబాద్లో నిర్వహించిన కోల్డ్ప్లే కాన్సర్ట్ అద్భుత దృశ్యాలను మీరు వీక్షించే ఉంటారు. ఇలాంటి లైవ్ కాన్సర్ట్లకు మన దేశంలో మంచి స్కోప్ ఉందని చెప్పేందుకు ఆ షోలు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్దపెద్ద కళాకారులు.. ఇప్పుడు భారత్వైపు చూస్తున్నారు’ అని మోదీ అన్నారు.
కాన్సర్ట్ ఎకానమీకి మరింత బలోపేతం చేయాలి
ప్రధాని మాట్లాడుతూ.. ‘గత పది సంవత్సరాలుగా లైవ్ ఈవెంట్లు, కాన్సర్ట్ల ట్రెండ్ కనిపిస్తోంది. దేశంలో కాన్సర్ట్ ఎకానమీ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. మ్యూజిక్, డ్యాన్స్, కథలకు సంబంధించి మనది ఘనమైన వారసత్వం. ఇలాంటి దేశంలో కాన్సర్ట్లకు విశేష ఆదరణ లభిస్తుంది. ఇందుకు తగ్గట్లు సదుపాయాలు ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగాలు దృష్టి పెట్టాలి. కాన్సర్ట్ ఎకానమీకి మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలి’ అని పేర్కొన్నారు.
హర్ష్ గోయంకా ఆశ్చర్యం
కోల్డ్ ప్లే బృందం చేస్తున్న హడావిడి.. భారత్లో కన్సర్ట్లకు వస్తున్న ఆదరణపై ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయంకా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం ఎక్స్లో స్పందిస్తూ.. ‘భారతీయులు కూడు, గూడు, గుడ్డ కోసం ఆరాటపడే స్థాయి నుంచి జీవితం మళ్లీ దొరకదన్నట్లు అనుభవించే వైపునకు మళ్లారు. టికెట్ల రీసేల్ ధర ఐదు రెట్లు ఉంది’ అని వ్యాఖ్యానించారు.
ఈవెంట్లపై ప్రముఖుల ఆసక్తి
ఈ కాన్సర్ట్లపై ప్రముఖులు సైతం మనసు పారేసుకుంటున్నారు. ఈవెంట్లను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. భారత పేసర్ బుమ్రా, నటి కాజల్ అగర్వాల్, సింగర్ శ్రేయా ఘోషల్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. అహ్మదాబాద్ స్టేడియంలో నిర్వహించిన కన్సర్ట్కు దాదాపు లక్ష మందికిపైగా హాజరయ్యారు.
Also Read: మొరార్జీ దేశాయ్ - నిర్మల సీతారామన్, అత్యధిక బడ్జెట్ల రికార్డ్ ఎవరిది?






















