Delhi Air Pollution: ఢిల్లీలో ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుంది? అది చాలా ఖర్చుతో కూడిన పని !
Delhi Air Quality Index Today: ఢిల్లీ, పరిసర ప్రాంతాలను శుక్రవారం గాలి కాలుష్యం కమ్మేసింది. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. SAFAR గణాంకాల ప్రకారం, శుక్రవారం ఉదయం గాలి నాణ్యత 404గా నమోదైంది.

Delhi Air Quality Index Today: ఢిల్లీ, పరిసర ప్రాంతాలను శుక్రవారం గాలి కాలుష్యం (Delhi Air Pollution) కమ్మేసింది. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం, ఢిల్లీలో శుక్రవారం ఉదయం గాలి నాణ్యత (Air Quality Index) 404గా నమోదైంది. ఢిల్లీలో గాలులు వీచకపోవడం, తక్కువ ఉష్ణోగ్రతలే ఇందుకు కారణమని భారత వాతావరణ శాఖ (IMD) అధికారి తెలిపారు. కాలుష్య కారకాలు పేరుకుపో కాలుష్య వాతావరణాన్ని సృష్టించాయని, రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదని ఆయన చెప్పారు.
ఢిల్లీలో AQIని ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు లెక్కిస్తారు. ఈ క్రమలో గురువారం 419 వద్ద నమోదైంది. బుధవారం 401, మంగళవారం 397, సోమవారం 358, ఆదివారం 218, శనివారం 220గా నమోదయ్యాయి. ఢిల్లీలో గురువారం కాలుష్యానికి ప్రధాన కారణం వాహనాల నుంచి వెలువడిన ఉద్గారాలే అని ఢిల్లీ ప్రభుత్వం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - కాన్పూర్ తెలిపాయి. ఢిల్లీలో కాలుష్యంలో వాహనాల నుంచి వచ్చిన పొగ 25 శాతంగా ఉందని వెల్లడించాయి.
కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాల మేరకు గురువారం ఈ ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ బృందం నిబంధనలను అమలు చేయడం, పర్యవేక్షణ, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోనుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలోఇప్పటికే రెండు స్మోక్ టవర్లు ఏర్పాట్లు చేశారు.
అయితే అవి నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించలేకపోయాయని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కి తెలిపింది. అంతేకాకుండా, ఈ జెయింట్ ఎయిర్ ప్యూరిఫైయర్ల నిర్వహణ ఖర్చుతో కూడుకుందని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ 4ని అమలు చేసినప్పటికీ, దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా క్షీణించిందని తెలిపింది. గత బుధవారం ఢిల్లీలో 23 శాతం వాయు కాలుష్యానికి వ్యవసాయ వ్యర్థాలను కాల్చడమేనని పుణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ పేర్కొంది.
పార్కింగ్ ఫీజులను పెంచిన ఎన్డీఎంసీ
సుప్రీంకోర్టు (Supreme Court) విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ ఢిల్లీ ప్రజలు పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చడంతో ఢిల్లీ గాలి నాణ్యత 'తీవ్రమైన' స్థాయికి దిగజారింది. ఫలితంగా ఢిల్లీని విషపూరిత పొగమంచు దేశ చుట్టుముట్టింది. పొరుగున ఉన్న నోయిడా, జాతీయ రాజధాని ప్రాంతంలో ఎన్సీఆర్ గురుగ్రామ్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
సుప్రీం కోర్టు నిషేధం విధించినప్పటికీ ఢిల్లీ ప్రజలు బాణ సంచా పేల్చారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఢిల్లీ పోలీసులు సోమవారం 97 కేసులు నమోదు చేశారు. తూర్పు ఢిల్లీలో 29, నైరుతి ప్రాంతంలో 28 అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని రోహిణి, ఉత్తర ఢిల్లీలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) దాని పరిధిలోని ప్రదేశాలలో పార్కింగ్ ఫీజులను రెట్టింపు చేసింది.
ఈ చర్య తక్షణం అమలులోకి వస్తుందని, జనవరి 31, 2024 వరకు అమలులో ఉంటుందని ఎన్డీఎంసీ పేర్కొంది. ఢిల్లీలో 91 పార్కింగ్ స్థానాలు ఎన్డీఎంసీ పరిధిలో ఉన్నాయి. ఔట్సోర్సింగ్ పద్ధతిలో 41 నేరుగా నిర్వహిస్తోంది. రాజ్పథ్, ఎయిమ్స్, సరోజినీ నగర్ మార్కెట్, ఖాన్ మార్కెట్ వంటి అధిక రద్దీ ఉండే ప్రాంతాలు ఎన్డీఎంసీ పార్కింగ్ నిర్వహణ క్రిందకు వస్తాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

