నియామక కమిటీలో కేంద్ర మంత్రి ఉండటం వల్ల స్వతంత్రత లోపిస్తుందని, నిర్ణయాలు 2:1 మెజారిటీతోనే జరుగుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Election Commission Selection | ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్యానెల్లో స్వతంత్రత ఎక్కడుందని, ఎవరైనా మంత్రి ప్రధానికి వ్యతిరేకంగా వెళ్లగలరా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

- ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్ర మంత్రి చేరికపై సుప్రీంకోర్టు ఆరా.
- ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, మంత్రి ఉన్న కమిటీపై ఆందోళన వ్యక్తం చేసింది.
- నిర్ణయ ప్రక్రియలో మంత్రి ప్రధానికి వ్యతిరేకంగా వెళ్లలేరని కోర్టు పేర్కొంది.
- CBI డైరెక్టర్ నియామకంలో CJI ఉన్నప్పుడు, ఇక్కడ ఎందుకు స్వతంత్రత లేదు?
Cabinet Ministers Role in Election Commission Selection | న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన సెలక్షన్ కమిటీలో కేంద్ర మంత్రిని చేర్చడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం ప్రశ్నించింది. నిర్ణయ ప్రక్రియలో ఒక మంత్రి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా వెళ్లలేరని కోర్టు పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియకు సంబంధించిన కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, ఒక కేంద్ర కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్న ఈ కమిటీపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి నియామకాల్లో నిర్ణయాలు 2:1 మెజారిటీతో జరుగుతాయని, కేబినెట్ మంత్రి ప్రధాని నిర్ణయంతో విభేదించే అవకాశం కచ్చితంగా ఉండదని ధర్మాసనం పేర్కొంది.
ప్రస్తుత ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నిర్మాణాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘ఎన్నికల కమిషనర్ నియామకంలో ఈ ఇండిపెండెన్సీ ఎందుకు?. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డైరెక్టర్ నియామకంలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) భాగస్వామిగా ఉండినప్పుడు, ఎన్నికల కమిషనర్ల నియామకంలో స్వతంత్ర ప్రక్రియను ఎందుకు అనుసరించకూడదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరపాలంటే ఎన్నికల కమిషనర్ల నియామకం తప్పనిసరి. భారత ఎన్నికల సంఘం తటస్థంగా ఉండటంతో పాటు, దాని పనితీరులో తటస్థంగా కనిపించాలని’ అని కోర్టు పేర్కొంది.
ధర్మాసనం ఇంకా ఏం వ్యాఖ్యలు చేసింది..
కేబినెట్ నుండి ఒక మంత్రి ఈ ప్యానెల్లో ఎందుకు ఉండాలి?. అధికార పార్టీకి 300 మంది ఎంపీలు ఉన్నారనుకుంటే ప్రధాని వారిలో 25 మంది బెస్ట్ అని ఎంపిక చేస్తారు. మళ్ళీ మీరు దాన్ని మైక్రో మేనేజ్ చేసి ఆ 25 మందిలో ఒకరిని ఎందుకు తీసుకువస్తారు. అలాంటప్పుడు ప్రతిపక్ష నేతను ఎందుకు చేరుస్తారు? ఆయన కేవలం అలంకారప్రాయంగా ఉండటం తప్ప.. ఆయన నిర్ణయానికి విలువ ఉంటుందా. ఎందుకంటే ప్రధాని, మంత్రి ఓట్లతో రిజల్ట్ ఎప్పుడూ 2:1 గానే ఉంటుంది. ఈ వ్యవస్థలో స్వతంత్రత ఉందని ఎలా చెబుతారు. కేబినెట్ మంత్రి ఎవరైనా ప్రధానికి వ్యతిరేకంగా వెళ్తారా?’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
సీజేఐ అని కాదు.. స్వతంత్ర సభ్యుడు ఉండాలని సూచన
జస్టిస్ దత్తా మాట్లాడుతూ.. సీబీఐ డైరెక్టర్ నియామకానికి సీజేఐ ఉన్నారు. శాంతిభద్రతల కోసం కనుక పరవాలేదు. దానిని చట్టబద్ధమైన పాలన వరకు పొడిగించవచ్చు. అయితే ఎన్నికల కమిషనర్ల విషయంలో సీజేఐ ఉండాలని చెప్పడం లేదు. కానీ ఒక స్వతంత్ర సభ్యుడు ఉండాలి. కేవలం మంత్రే సభ్యుడిగా ఎందుకు ఉండాలి?. ప్రధాని ఒకరిని ఎంచుకుంటే, ప్రతిపక్ష నాయకుడు మరొకర్ని సెలక్ట్ చేస్తారు. మూడవ సభ్యుడైన మంత్రి అప్పుడు ప్రతిపక్ష నిర్ణయానికి మద్దతిస్తారా.. ? అని ప్రశ్నించారు. ఈ చట్టం ఆర్టికల్ 14 కింద రాజ్యాంగ హామీలను ఉల్లంఘిస్తుందా లేదా ఈ నిర్మాణం ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రజల విశ్వాసాన్ని నిర్ధారిస్తుందా లేదా అన్నదే కోర్టు ముందున్న సవాల్ అన్నారు. నియమితులైన అధికారులకు ఐఏఎస్ బ్యాగ్రౌండ్, రిటర్నింగ్ ఆఫీసర్లుగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉంటుందని వ్యాఖ్యానించారు.
పిటిషనర్ 'లోక్ ప్రహరీ' తరపున హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్. శుక్లా, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన చట్టాన్నే కాకుండా, ప్రస్తుత ముఖ్య ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాలను కూడా ఛాలెంజ్ చేశారు. కేవలం చట్టాన్ని మాత్రమే కాకుండా, ఈ చట్టం ద్వారా సీఈసీ, ఇద్దరు ఈసీల నియామకాలను ఛాలెంజ్ చేసినట్లు తెలిపారు. కేవలం అనూప్ బరన్వాల్ తీర్పు ఆధారంగానే కాకుండా, ఆర్టీఐ ద్వారా లభించిన చట్టపరమైన లోపాల ఆధారంగా సవాలు చేశామన్నారు. ఎంపిక కమిటీ one man show లాంటిదే. ప్రతిపక్ష నేత అభిప్రాయాన్ని పట్టించుకోనప్పుడు ఆయనను చేర్చడంలో అర్థం లేదు. ఇది పేరుకు మాత్రమే కమిటీగా శుక్లా పేర్కొన్నారు. కేవలం అధికార పార్టీకే కాకుండా, మెజారిటీ రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని నియమించడమే కమిటీ ఉద్దేశం కావాలన్నారు.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Frequently Asked Questions
సుప్రీంకోర్టు ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియను ఎందుకు ప్రశ్నించింది?
ఎన్నికల కమిషనర్ల నియామకంలో స్వతంత్రత ఎందుకు ముఖ్యం?
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం తటస్థంగా ఉండటం, దాని పనితీరులో కనిపించడం చాలా అవసరం.
ప్రస్తుత నియామక కమిటీలో మంత్రే ఎందుకు సభ్యుడిగా ఉండాలి?
ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రి సభ్యులుగా ఉన్న కమిటీలో, మంత్రి ప్రధాని నిర్ణయానికే మద్దతు ఇస్తారని, ప్రతిపక్ష నాయకుడికి విలువ ఉండదని సుప్రీంకోర్టు పేర్కొంది.
నియామక కమిటీలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఏమిటి?
ప్రతిపక్ష నాయకుడిని చేర్చినా, ప్రధానమంత్రి, మంత్రి ఓట్లతో ఫలితం ఎప్పుడూ 2:1 గానే ఉంటుందని, ఆయన నిర్ణయానికి విలువ ఉండదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ట్రెండింగ్ వార్తలు






















