Asaduddin Owaisi: మదర్సా గది కూడా కట్టలేని దళారులు అమోనియం నైట్రేట్తో దేశంపై దాడి చేస్తున్నారు - ఉగ్రవాదులపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం
MIM Owaisi: పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ముస్లింలు స్థాపించిన విద్యా సంస్థలపై ఎవరైనా కుట్ర చేస్తే ఖండిస్తామన్నారు.

Asaduddin Owaisi Warns terrorists: ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తిహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఔవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ శత్రువులు మా శత్రువులని స్పష్టం చేశారు. ముస్లింలు స్థాపించిన విద్యా సంస్థలపై ఎవరైనా కుట్ర చేస్తే, మేము దాన్ని ఖండిస్తామన్నారు. ఎర్రకోట పేలుడు ఘటనలో 14 మంది మరణించారని.. వారిలో హిందువులు , ముస్లింలు ఉన్నారనన్నారు. ఇలాంటి వారి చేతిలో దేశం బలహీనపడుతోందని ఓవైసీ ఆవేదన వ్యక్తంచేశారు.
ఆత్మాహుతి దాడి చేయడానిిక అమోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలతో రద్దీ ప్రాంతంలో పేల్చుకున్నారు. ఘటనా స్థలంలో వాహనాలు కాలిపోయాయి, అనేక మంది గాయపడ్డారు. పోలీసులు మరియు భద్రతా సిబ్బంది తక్షణం స్థలానికి చేరుకుని, పరిస్థితిని నియంత్రించారు. ఈ ఘటన దిల్లీ NCR ప్రాంతంలో భయాందోళన కలిగించింది. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్లు ఉన్నారు. అందరూ ముస్లింలే కావడంతో.. ఓవైసీ స్పందించారు.
ఈ పేలుడు ఘటనను దేశ శత్రువుల కుట్రగా ఓవైసీ భావించారు. "ఒక మదర్సా లేదా స్కూల్ గది కూడా కట్టలేని ఉగ్రవాదులు అమోనియం నైట్రేట్తో కూర్చుని దేశాన్ని దెబ్బలు తీస్తున్నారు అని ఒవైసీ ప్రకటించారు. "దేశ శత్రువులు మా శత్రువులు. ఒక సంస్థను నిర్మించడం ఎంత కష్టమో తెలుసా? ముస్లింలు స్థాపించిన విద్యా సంస్థల్లో ఎవరైనా కూర్చుని దాన్ని కూల్చే కుట్ర చేస్తే, మేము దాన్ని ఖండిస్తాము. మదర్సా గది కూడా కట్టలేని దళారులు పేలుడు పదార్థాలతో దేశాన్ని బలహీనపరుస్తున్నారు. ఈ బ్లాస్ట్లో హిందువులు, ముస్లింలు కలిసి మరణించారు. దేశంపై దాడి చేసే కుట్రలను మేము తీవ్రంగా ఖండిస్తాము. దేశ శత్రువు అయితే మా శత్రువు. ఇలాంటి చర్యలు కొనసాగితే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చని" ప్రకటించారు.
ఇదే సభలో ఒవైసీ ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రస్తావించారు. ముస్లింలను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా మార్చాలని భావించే వారు తప్పుగా ఆలోచిస్తున్నారు. మా తరాలు ముగిసిపోవచ్చు, కానీ భారతదేశంలో ముస్లింలు గౌరవప్రదంగా జీవిస్తూనే ఉంటారు. మేము మా హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్దతుల్లోనే పోరాడతామని ప్రకటించారు. మా మసీదులను కాపాడుకుంటాము. మీరు ఒక మసీదిని ధ్వంసం చేస్తే, మేము లక్షలాది మసీదులు నిర్మిస్తాము. మేము చాలా బాధలు భరించాము, రేపు కూడా భరిస్తాము. కానీ మా దేశాన్ని ఎప్పుడూ ద్వేషించలేదన్నారు. ముస్లింలను ద్వేషంతో చూస్తూ అన్యాయం చేస్తే, భారతదేశం ఎలా అభివృద్ధి సాధిస్తుందని ఓవైసీ ప్రశ్నించారు.
ప్రపంచం మొత్తం భారత్ను శాంతికాముక దేశంగా చూడాలంటే 19 కోట్ల ముస్లింలను అవమానంతో చూడకూడదు. రాజ్యాంగంలో సమానత్వం మూలాధికారం – దాన్ని మరచిపోకూడదన్నారు. మసీదు వ్యవహారంలో తీర్పు వచ్చినప్పుడు ఏ ముస్లిం కోర్టులో జడ్జిపై చెప్పు విసరలేదని గుర్తు చేశారు.




















