Idli Kottu OTT: ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఇట్స్ అఫీషియల్
Idli Kottu OTT Platform: కోలీవుడ్ స్టార్ ధనుష్ లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై' నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

Dhanush's Idli Kottu Movie OTT Release Date: కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై' తెలుగులో 'ఇడ్లీ కొట్టు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 1న రిలీజ్ అయిన మూవీ మంచి టాక్ సొంతం చేసుకోగా... నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఆ రోజే ఓటీటీలోకి!
'ఇడ్లీ కొట్టు' డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. 'గెట్ రెడీ టు హేవ్ బ్లాక్ బస్టర్ బ్రేక్ ఫాస్ట్ విత్ ఇడ్లీ కడై' అంటూ రాసుకొచ్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ధనుష్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్గా నటించారు. వీరితో పాటు అరుణ్ విజయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్, షాలిని పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మించగా... జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. తెలుగులో మూవీని వేదాక్షర మూవీస్ బ్యానర్పై రామారావు చింతపల్లి రిలీజ్ చేశారు.
View this post on Instagram
Also Read: పవన్ 'OG' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
స్టోరీ ఏంటంటే?
శంకరాపురంలో శివకేశవులు (రాజ్ కిరణ్) ఇడ్లీ కొట్టు అంటే ఎంతో ఫేమస్. చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికే వచ్చి ఇడ్లీలు తింటారు. అయితే, ఈ బిజినెస్ కేవలం ఊరికే పరిమితం చేయకుండా అంతటా విస్తరించాలని అనుకుంటాడు శివకేశవులు కొడుకు మురళి (ధనుష్). దీన్ని ఫ్రాంచైజీలా డెవలప్ చేసి ఇతర చోట్ల హోటల్స్ పెట్టి డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేస్తాడు. దీనికి తండ్రి మాత్రం అంగీకరించడు. దీంతో ఊరు, కన్నవాళ్లను వదిలేసి పట్నం వచ్చేస్తాడు మురళి. హోటల్ మేనేజ్మెంట్ చేసిన అతను... ఎన్నో ప్రయత్నాల తర్వాత బ్యాంకాక్లో పాపులర్ రెస్టారెంట్ చైన్ ఏఎఫ్సీ అధినేత విష్ణువర్దన్ (సత్యరాజ్) దగ్గర ఉద్యోగిగా మంచి స్థానంలో ఉంటాడు.
మురళికి మంచి ఉద్యోగం ఇవ్వడమే కాకుండా తన కుమార్తె మీరా (షాలినీ పాండే)ను ఇచ్చి పెళ్లి జరిపించాలనుకుంటాడు విష్ణువర్దన్. సరిగ్గా పెళ్లికి 2 వారాలు ఉందనగా మురళి తండ్రి శివకేశవులు చనిపోతాడు. తండ్రిని చివరిసారిగా చూసేందుకు సొంతూరికి వచ్చిన మురళి.. తండ్రి చివరి కోరిక మేరకు ఇడ్లీ కొట్టు చూసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది? విష్ణు వర్దన్ కొడుకు అశ్విన్ (అరుణ్ విజయ్) ఇడ్లీ కొట్టుు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు? కల్యాణి (నిత్యామీనన్) ఎవరు? కల్యాణికి మురళికి సంబంధం ఏంటి? మురళికి ఊరి ప్రజలు ఎలా మద్దతు పలికారు? మురళి అనుకున్నది సాధించాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















