Sivaji : ఆ కామెంట్స్తో మూడు రోజులు నిద్రపోలేదు - అనసూయ అంటే గౌరవం... మరోసారి శివాజీ రియాక్షన్
Sivajji Reaction : తనకు తెలిసిన వాళ్లే తనపై మహిళా కమిషన్కు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు శివాజీ. మహిళల డ్రెస్సింగ్ కాంట్రవర్సీపై మరోసారి ఆయన రియాక్ట్ అయ్యారు.

Sivaji About Women Dressing Comments Controversy Issue : మహిళల డ్రెస్సింగ్ అంశంపై 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని రోజుల పాటు ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఈ అంశంపై ఆయన రియాక్ట్ అయ్యారు.
'3 రోజులు నిద్రపోలేదు'
మహిళల డ్రెస్సింగ్ గురించి ఆ రోజు చేసిన కామెంట్స్తో తాను మూడు రోజులు నిద్ర పోలేదని చెప్పారు శివాజీ. 'మహిళల డ్రెస్సింగ్ గురించి ఆ రోజు నేను చేసిన కామెంట్స్లో రెండు పదాలు తప్పులు దొర్లాయి. అవి వాడకుండా ఉండాల్సింది. ఇదే మాట నేను గతంలోనూ చెప్పాను. నేనెప్పుడూ కంట్రోల్ లేకుండా మాట్లాడలేదు. ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానో నాకు తెలియడం లేదు. అన్నీ రోజులు మనవి కావు. ఆ పదాలు వాడిన తర్వాత చాలా మానసిక సంఘర్షణకు లోనయ్యా.
3 రోజులు నిద్రపోలేదు. ఇప్పటివరకూ కొన్ని వందల ప్రెస్ మీట్స్, డిబేట్స్ల్లో మాట్లాడాను. కానీ ఎప్పుడూ ఇలా నోరు జారలేదు. ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. నా ఉద్దేశం ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు.' అంటూ చెప్పారు.
'అనసూయ అంటే గౌరవం'
మహిళల డ్రెస్ ఆధారంగా వారి క్యారెక్టర్ నిర్ణయించకూడదని అన్నారు శివాజీ. 'నేను అనసూయను కూడా ఏమీ అనలేదు. ఆమెతో నాకు పరిచయం కూడా చాలా తక్కువ. నన్ను ఓసారి ఆమె ఇంటర్వ్యూ చేశారు. ఆ అమ్మాయి అంటే నాకు గౌరవం ఉంది. ఈ ప్రపంచంలో మగవారు ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లను కించపరచాలని అనుకోరనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
మహిళా కమిషన్ నన్ను విచారణకు పిలిచినప్పుడు వెళ్లాను. నాకు తెలిసిన వాళ్లే నాపై కంప్లైంట్ చేశారని తెలిసి చాలా షాక్ అయ్యాను. వారి పేర్లు ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్లంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది.' అని అన్నారు.
Also Read : మ్యూజిక్ డైరెక్టర్కు విశ్వక్ గోల్డ్ వాచ్ - రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశా అంటూ ఎమోషనల్
సినిమాల విషయానికొస్తే... ఇటీవల 'దండోరా' మూవీతో అలరించిన శివాజీ లేటెస్ట్గా క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ'తో రాబోతున్నారు. మొదట ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అని ప్రకటించినా క్రేజ్ దృష్ట్యా థియేటర్లలోకి రిలీజ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత శివాజీ, లయ జంటగా కనిపించబోతున్నారు.
మూవీకి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా... చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, అలీ, ధన్ రాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృథ్వీరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పంచాయతీ సెక్రటరీగా శివాజీ కనిపించనున్నారు. ఈటీవీ విన్ సమర్పణలో శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్పై శివాజీ నిర్మించగా... వంశీ నందిపాటి, బన్నీ వాస్ రిలీజ్ చేయనున్నారు. మార్చి 6న సినిమా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ బిగ్ హైప్ క్రియేట్ చేస్తోంది.
























