Mass Jathara : చిరు, విజయశాంతి కాంబో గుర్తొస్తుంది - ఫ్యాన్స్కు 'మాస్ జాతర' ఓ సెలబ్రేషన్... డైరెక్టర్ భాను లేటెస్ట్ ఇంటర్వ్యూ
Ravi Teja : మాస్ మహారాజ ఫ్యాన్స్ ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా రవితేజను 'మాస్ జాతర' మూవీలో చూడబోతున్నట్లు డైరెక్టర్ భాను భోగవరపు తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు షేర్ చేసుకున్నారు.

Director Bhanu Bhogavarapu About Mass Jathara Movie : మాస్ మహారాజ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర' ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతోనే భాను భోగవరపు దర్శకుడిగా మారారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్, లుక్స్ భారీ హైప్ క్రియేట్ చేయగా... తాజాగా మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు డైరెక్టర్ భాను.
రవితేజ గ్రేస్... టైటిల్ అలా ఫిక్స్
'మాస్ జాతర'లో మాస్ అంశాలు ఎక్కువగా ఉంటాయని... అదే టైంలో న్యూ పాయింట్ కూడా ఉంటుందని డైరెక్టర్ భాను తెలిపారు. 'రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. ఆ బ్యాక్ డ్రాప్లో జరిగే క్రైమ్ కూడా కొత్తగా ఉంటుంది. 'మాస్ జాతర' అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. దీని తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని యాడ్ చేశాను. థియేటర్లో ప్రేక్షకులు కొన్ని సర్ప్రైజ్లు చూడబోతున్నారు.
ఇది ఓ కల్పిత కథే అయినా ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాలు, వారు ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలుసుకున్నా. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సీన్స్ రాసుకున్నా.' అని చెప్పారు.
'శివుడు' గురించి మాట్లాడుకుంటారు
మూవీలో విలన్ రోల్ శివుడు చాలా పవర్ ఫుల్ అని... మూవీ రిలీజ్ తర్వాత దాని గురించే అందరూ మాట్లాడుకుంటారని అన్నారు భాను భోగవరపు. 'ఈ పాత్ర కోసం మొదట ఇద్దరు ముగ్గురు నటుల పేర్లు కూడా పరిశీలించాం. కానీ సంతృప్తి లేదు. అలాంటి టైంలో నవీన్ చంద్రని కలిసి కథ వినిపించాను. ఆయనకు కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించారు. అయితే, ఈ పాత్రలో ఎలా ఉంటారనే ఉద్దేశంతో ప్రత్యేక మేకోవర్ చేసి, ఫోటోషూట్ చేశాం. ఆ లుక్ నిర్మాత నాగవంశీతో సహా అందరికీ నచ్చింది. శివుడు పాత్రకు నవీన్ చంద్ర గారు పూర్తి న్యాయం చేశారు.' అని చెప్పారు.
Also Read : చిరంజీవి బాబీ మూవీలో హీరోయిన్! - 'ది రాజా సాబ్' బ్యూటీ మాళవిక రియాక్షన్ ఇదే!
అప్పటి కాంబో రిపీట్ అంతే
హీరోయిన్ తులసి పాత్ర కోసం వేరే ఏ హీరోయిన్ను అనుకోలేదని డైరెక్టర్ భాను చెప్పారు. 'కథ రాస్తున్నప్పుడు నేను, కథ వింటున్నప్పుడు రవితేజ, నిర్మాతలు మాకు తెలియకుండానే.. హీరోయిన్ శ్రీలీల అని అనుకున్నాం. ధమాకా జోడి కాబట్టి శ్రీలీలని తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. తులసి పాత్ర అనగానే మా అందరికీ శ్రీలీల గుర్తుకొచ్చారు. ఆమె పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యముంది. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో శ్రీలీల గారు కొత్తగా కనిపిస్తారు. గ్యాంగ్ లీడర్లో చిరంజీవి విజయశాంతి మధ్య సీన్స్ ఎలాగైతే కామెడీ టచ్తో ఎంటర్టైన్ చేస్తాయో... ఇందులో రవితేజ శ్రీలీల మధ్య సన్నివేశాలు కూడా అలా ఉంటాయి.' అని అన్నారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్
తాను రవితేజకు బిగ్ ఫ్యాన్ అని... ఆయన ఖాకీ డ్రెస్ వేసిన సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలుసని అని భాను అన్నారు. అది దృష్టిలో పెట్టుకొనే స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ప్రతీ మూమెంట్ను థియేటర్స్లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పారు. 'సినిమాలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. దర్శకుడిగా నాకిది మొదటి సినిమా అయినప్పటికీ నాగవంశీ ఎంతో సపోర్ట్ చేశారు. జాతర ఎపిసోడ్ కోసం ఓ భారీ సెటప్ కూడా చేయించారు. ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలు ఉంటూనే 'మాస్ జాతర' చిత్రం కొత్తగా ఉంటుంది. కామెడీ సీన్స్, యాక్షన్ సన్నివేశాలను కొత్తగా రూపొందించాం. రచయితగా కొన్ని సినిమాలు చేస్తున్నా. అలాగే, దర్శకుడిగా రెండో సినిమా కోసం స్టోరీ రెడీ చేస్తున్నా. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాను.' అని తెలిపారు.





















