TGRJC CET 2025: తెలంగాణ ఆర్జేసీసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
RJCCET 2025: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

TSRJC Common Entrance Test - 2025: తెలంగాణలోని 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్ఆర్జేసీ సెట్–2025 (TSRJC CET-2025) నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 20 గురుకుల జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 24 నుంచి ప్రారంభంకానుంది. విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి ఏప్రిల్ 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి మే 10న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందుతారు. ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 040-24734899 నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు.
వివరాలు..
* టీఎస్ఆర్జేసీ సెట్–2025
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ.
సీట్లసంఖ్య: 2,996.
సీట్ల కేటాయింపు: ఎంపీసీ - 1,496, బైపీసీ - 1,440, ఎంఈసీ - 60.
అర్హత: ఈ ఏడాది మార్చిలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ర్యాంకు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
పరీక్ష విధానం: టీఎస్ఆర్జేసీ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం మల్టీపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. విద్యార్థులు ఎంచుకునే గ్రూప్ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్ నుంచి; బైపీసీ విద్యార్థులకు ఇంగ్లిష్, బయోలజికల్ సైన్స్, ఫిజిక్స్ నుంచి అదేవిధంగా ఎంఈసీ గ్రూప్లో చేరేవారికి ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కోసబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు.
పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
⫸ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 24.03.2025.
⫸ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరితేది: 23.04.2025.
⫸ ప్రవేశ పరీక్ష తేది: 10.05.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

