Ather Rizta సేల్స్ సునామీ - రెండేళ్లలోనే 2 లక్షల యూనిట్ల అమ్మిన ఫ్యామిలీ ఈ-స్కూటర్
Ather Rizta ఈ-స్కూటర్ భారత్లో 2 లక్షల సేల్స్ మార్క్ దాటింది. 4 వేరియంట్లలో లభించే ఈ ఫ్యామిలీ స్కూటర్ ఆథర్ మొత్తం అమ్మకాలలో 70% వాటాను సాధించి కంపెనీ వృద్ధికి వేగాన్ని యాడ్ చేసింది.

Ather Rizta Electric Scooter Sales: భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో వేగంగా ఎదుగుతున్న కంపెనీల్లో ఆథర్ ఎనర్జీ ఒకటి. ముఖ్యంగా ఫ్యామిలీ వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుని లాంచ్ చేసిన Ather Rizta ఇప్పుడు కంపెనీకి మార్గదర్శక మోడల్గా నిలిచింది. ఈ స్కూటర్ తాజాగా 2 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. లాంచ్ అయిన రెండేండ్లలోనే ఈ స్థాయి సేల్స్ను సాధించడం ఆథర్ సాధించిన పెద్ద విజయంగా చెప్పొచ్చు.
రిజ్తా రికార్డులు
ఆథర్ రిజ్తా 2024 ఏప్రిల్లో మార్కెట్లోకి వచ్చింది. మొదటి లక్ష యూనిట్ల అమ్మకాలను ఒకే ఏడాదిలో చేరగా, రెండో లక్ష మాత్రం కేవలం ఆరు నెలల్లోనే పూర్తయింది. ఇది రిజ్తా స్కూటర్కు మార్కెట్లో ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చెబుతోంది. ఆథర్ ప్రస్తుతం విక్రయిస్తున్న మొత్తం స్కూటర్లలో 70 శాతం రిజ్తానే కావడం గమనార్హం.
రిజ్తా వల్ల ఆథర్ వృద్ధి వేగం రెట్టింపు
రిజ్తా లాంచ్ కాకముందు ఆథర్ బ్రాండ్ అంటే ప్రజల మైండ్సెట్లో “స్పోర్టీ, హై-పెర్ఫార్మెన్స్, కొంచెం ఖరీదైన స్కూటర్లు” అన్న ఇమేజ్ ఉండేది. 450 సిరీసే దీనికి ఉదాహరణ. అయితే రిజ్తా మాత్రం ఈ ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్లో ప్రాక్టికల్ డిజైన్, వెడల్పైన సీట్, సరైన రేంజ్, అందుబాటు ధర... ఇవన్నీ కలిసి రిజ్తాను ఫ్యామిలీ క్లాస్కి అచ్చొచ్చిన ఎంపికగా మార్చాయి.
ఈ స్కూటర్ వల్ల ఆథర్ మార్కెట్ షేర్ కూడా గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, యూపీ వంటి రాష్ట్రాల్లో కంపెనీ వృద్ధి మరింత వేగమందుకుంది. దేశవ్యాప్తంగా ఆథర్ 524 డీలర్షిప్లు పని చేస్తుండటం కూడా అమ్మకాలు పెరగడానికి ఒక ప్రధాన కారణం.
వేరియంట్లు, బ్యాటరీ ఆప్షన్లు – కుటుంబాల కోసం టైలర్మేడ్
రిజ్తా స్కూటర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. రెండు ట్రిమ్లలో (S & Z) అందుబాటులో ఉండే ఈ స్కూటర్కి రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి, అవి:
2.9 kWh బ్యాటరీ – IDC ప్రకారం 123 కి.మీ. రేంజ్
3.7 kWh బ్యాటరీ – IDC ప్రకారం 159 కి.మీ. రేంజ్
ఈ రైడింగ్ రేంజ్ ఫ్యామిలీ రోజువారీ ఉపయోగానికి పూర్తిగా సరిపోతుంది. ఫీచర్ల పరంగా కూడా రిజ్తా సమర్థవంతంగా డిజైన్లో ఉంటుంది. ఖర్చు ఎక్కువ కాకుండా, ప్రయోజనం తగ్గకుండా ఉండేలా రూపొందించడం దీని ప్రధాన హైలైట్.
ధరల విషయానికి వస్తే, రిజ్తా రూ.1.15 లక్షల నుంచి రూ.1.52 లక్షల వరకు (ఎక్స్–షోరూమ్) లభిస్తోంది. నగరాల్లో రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, ఫ్యామిలీ రైడింగ్ కోరుకునేవారికి ఈ ధర సరైన రేంజ్గా చెప్పొచ్చు.
ప్రస్తుతం, ఆథర్, భారత్లో 5 లక్షలకు పైగా ఈ-స్కూటర్లను విక్రయించిన కంపెనీగా నిలిచింది. ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో నెలవారీ టాప్-3 బ్రాండ్ల్లో ఒకటిగా నిలవడంలో రిజ్తా కీలక పాత్ర పోషించింది. కుటుంబాలకి పర్ఫెక్ట్గా సరిపోయే ఈ స్కూటర్... తన కంపెనీకి మాత్రమే కాకుండా, వినియోగదారులకు కూడా మంచి విలువను అందిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.





















