Ys Jagan: 'శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?' - క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
Andhra News: తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధ్యులపై చర్యల విషయంలో కూటమి ప్రభుత్వ తీరు అత్యంత దారుణమని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో విమర్శించారు.

YS Jagan Slams AP Government In Tirupati Stampede Incident: ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట (Tiruapati Stampede) జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోతే బాధ్యుల విషయంలో కూటమి ప్రభుత్వ తీరు అత్యంత దుర్మార్గమని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా విమర్శలు గుప్పించారు. 'జనవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యాహ్నం వరకూ పోలీసులు అందరినీ తన కుప్పం కార్యక్రమంలో పెట్టుకోవడం సహా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. టీటీడీ కార్యకలాపాలు, వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ ఉన్న టీటీడీ బోర్డు ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా, స్థానిక కలెక్టర్, ఎస్పీల నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణంగా తేలిన నేపథ్యంలో, విచారణ చేసి, జైల్లో పెట్టాల్సిన వీరిని కూటమి ప్రభుత్వం విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటి?' అని ప్రశ్నించారు.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొలిసారిగా తొక్కిసలాట జరిగి, 6గురు మరణించిన ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యల విషయంలో @ncbn గారి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గంగా ఉంది. చంద్రబాబుగారి నిర్లక్ష్య వైఖరి, తన చుట్టూ 6వ తారీఖు నుంచి 8వ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2025
'వీరిని కాపాడడానికేనా.?'
ఇవన్నీ చూస్తుంటే జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదని అర్థమవుతోందని జగన్ అన్నారు. 'తూతూ మంత్రంగా తీసుకున్న చర్యలు వీరిని కాపాడ్డానికే కదా?. శ్రీవారి భక్తుల మరణాలకు అసలు కారకులను రక్షించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు?, వారిపై తీసుకున్న ఆ కొద్దిపాటి చర్యల్లోనూ వివక్ష చూపలేదంటారా?. సంబంధం లేని వారిపై సస్పెన్షన్ వేటు వేయడం, అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సిన అధికారిని కేవలం బదిలీతో సరిపెట్టడం, మరికొందరిపై అసలు చర్యలే లేకపోవడం, ప్రభావం లేని సెక్షన్లతో కేసులు పెట్టడం, వెంటనే టీటీడీ ఛైర్మన్ను, ఈవోను, ఏఈఓను, ఎస్పీను, కలెక్టర్ను డిస్మిస్ చేయకపోవడం, ఇవన్నీ దోషులను కాపాడ్డానికే కదా?. ప్రభుత్వం ఇంత అలసత్వం చూపినా చంద్రబాబు గారు దాన్నికూడా గొప్పగా చెప్పుకుంటున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది.' అని పేర్కొన్నారు.
'క్షమాపణ చెబితే చాలా.?'
మరోవైపు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షమాపణ అంటూ రాజకీయ డ్రామాకు తెర లేపారని జగన్ విమర్శించారు. 'ముఖ్యమంత్రి గారేమో తొక్కిసలాట ఘటనపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని, దాన్నే పెద్ద దండనగా చిత్రీకరిస్తుంటే, మరోవైపు డిప్యూటీ సీఎంగారేమో, లేదు… క్షమాపణ చెప్పాలంటూ మరో రాజకీయ డ్రామాకు తెరలేపారు. ఇంతకన్నా దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా?. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి, ఆరుగురు ప్రాణాలు కోల్పోతే ఆ ఘటనకు ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్తే సరిపోతుందంటారా?. ఏమిటీ దారుణం? శ్రీవారి భక్తుల ప్రాణాలకు విలువ ఇదేనా?. సీఎం, డిప్యూటీ సీఎంలు ఇద్దరూ కూడా రాజకీయ ఎత్తుగడలు ఆపేయాలి. ఈ ఘటనకు ప్రత్యక్షంగా బాధ్యులైన టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో సహా స్థానిక కలెక్టర్, ఎస్పీలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వర స్వామి భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు.' అని పేర్కొన్నారు.






















