Sambala Kesava Rao: గెరిల్లా వ్యూహాలతో దాడులకు సూత్రధారి సంబాల కేశవరావు- అమిత్షా ట్వీట్ వెనుక అసలు ఉద్దేశం అదే!
Sambala Kesava Rao: మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ముప్పాళ్ల గణపతి అనారోగ్య కారణాల వల్ల ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో సంబాల కేశవరావు బాధ్యతలు తీసుకున్నారు. అందరికీ భయాన్ని పరిచయం చేసిన వ్యూహకర్త.

Sambala Kesava Rao: మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తోన్న కీలక నేతలు, చురుగ్గా పని చేసే అగ్ర నేతలు ఉన్నారన్న సమచారంతోనే కర్రె గుట్టలను పోలీసు బలగాలు అష్ట దిగ్భంధం చేశాయి. ఈ నాయకులను మట్టుబెడితే ఇక మావోయిస్టు పార్టీ దిక్కుతోచనిస్థితిలో పడిపోతుందన్నది పోలీసుల వ్యూహం. నయానో, భయానో ఇప్పటి వరకు కింది స్థాయి క్యాడర్ను కంట్రోల్ చేశారు పోలీసులు. అప్పడప్పడు కీలక నేతలను పట్టుకుని కాల్చి చంపిన ఘటనలు ఉన్నాయి. ఇలా క్యాడర్ను, లీడర్లను టార్గెట్ చేస్తూ మావోయిస్టు పార్టీని బలహీనపర్చారు.
అయితే మావోయిస్టు అగ్రనేతల కనుసన్నల్లో అప్పడప్పుడు ఆ పార్టీ పోలీసులపై గెరిల్లా దాడులు చేస్తూ ఉనికి చాటుకుంటునే ఉంది. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు పార్టీ మొత్తాన్ని తుడిచిపెడతామని ఎన్డీఏ సర్కార్ ప్రకటించి ఆ దిశగా ముందుకు సాగుతూ వచ్చింది. ఇక ఇదే చివరి అంకం అంటూ కర్రె గుట్టలపై అగ్రనేతలంతా ఉన్నారని వారిని పట్టుకుంటే మావోయిస్టు పార్టీ అంతరించినట్లేనని లెక్కలు వేస్తోంది. దీనికి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో చర్యలు తీసుకుంది. కర్రెగుట్టలతోపాటు దేశ వ్యాప్తంగా మావోయిస్టు ఉనికి ఉన్న ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.
ఈ ఆపరేషన్లో కీలక నేత అయిన సంబాల కేశవరావు ఛత్తీస్గఢ్ అడవుల్లో పోలీసులు కాల్పుల్లో మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షానే ట్వీట్ చేసి చెప్పారు. కేంద్ర హోంమంత్రి స్థాయి వ్యక్తి ఈ విషయాన్ని ప్రకటించారంటే నిజంగా సంచలనమే. ఇంతకీ ఎవరీ సంబాల కేశవరావు? ఆయన హిస్టరీ ఏంటీ, మావోయిస్టు పార్టీ కీలక ఘటనల్లో ఆయన పాత్ర ఏంటో చూద్దాం.
ఛత్తీస్గఢ్ అడవుల్లో సంబాల కేశవరావు మృతి
ఛత్తీస్గఢ్ అడవుల్లో పోలీలులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి సంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈయన్నే గగన్న అని కూడా పిలుస్తారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత. 2018లో నాటి మావోయిస్టు ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల గణపతి అనారోగ్య కారణాల వల్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా, పార్టీలో సీనియర్ అయిన సంబాల కేశవరావు ఆ బాధ్యతలు స్వీకరించారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
వరంగల్లో ఇంజనీరింగ్ చేసిన కేశవరావు
బసవరాజు 24 సంవత్సరాలు పొలిట్బ్యూరో సభ్యుడిగా పని చేశాడు. పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్చార్జ్గా కూడా పని చేశాడు. బసవరాజు వరంగల్లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బి.టెక్ పూర్తి చేశాడు. 1970లో అడవిబాటపడ్డాడు.
మెరుపు దాడులకు మారు పేరు సంబాల
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాల్లోనీ జీయన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి కేశవరావు. 1955లో ఆయన జన్మించారు. మావోయిస్టు పార్టీ అంతటిని నడుపుతున్న కీలక నేతగా సంబాల కేశవరావు ఉన్నారు. పోలీస్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న అగ్రనేత సంబాల కేశవరావు. ఇతను సైనిక వ్యూహకర్తగా పార్టీలో పేరు ఉంది. పీఎల్జీఏ అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ మిలటరీ విభాగానికి నాయకత్వం వహించి భద్రతా బలగాలపై ఎన్నో దాడులకు పాల్పడ్డారు. గెరిల్లా వ్యూహాలను అమలు చేయడంలో అత్యంత నైపుణ్యం ఉన్న నాయకుడిగా పేరు. పేలుడు పదార్థాల నిపుణిడిగా పార్టీ ఆయన్ను గుర్తించింది. సంబాల కేశవరావు సెంట్రల్ మిలిటరీ కమిషన్కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయుధ వ్యాపారులతో మంచి సంబంధాలు కలిగిన కీలక నేత. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర,, ఒడిశా వంటి రాష్ట్రాల్లో జరిగిన అనేక గెరిల్లా దాడుల్లో సంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు చెబుతారు. ఆపరేషన్ కగార్ టార్గెట్లో ఉన్న అగ్రనేత .
సంబాల కేశవరావు నాయకత్వంలో జరిగిన మిలటరీ ఆపరేషన్లు
1. 2003 లో చంద్రబాబుపై దాడి
తిరుపతి సమీపంలోని అలిపిరి ఘాట్ రోడ్డు, వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్ళే మార్గంలో 2003 అక్టోబర్ 1వ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కాన్వాయ్పై మావోయిస్టులు అత్యంత శక్తివంతమైన క్లెమోర్ మైన్లు రిమోట్ ద్వారా పేల్చి దాడికి పాల్పడ్డారు. బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తున్న చంద్రబాబు భుజం, కాలుకు గాయాలయ్యాయి. కాన్వాయ్లోని పోలీసులు, దగ్గర్లో ఉన్న ప్రజలు గాయపడ్డారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి సంబాల కేశవరావని పోలీసులు నిర్థారించారు. ఏకంగా సీఎంపైనే ఈ దాడికి పాల్పడటం దేశవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఎంతో భద్రత ఉండే వీఐపీ వాహణ శ్రేణిపై జరిపిన ఈ దాడితో భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఈ దాడి తర్వాత దేశంలో వీఐపీ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. చంద్రబాబుకు జెడ్ ప్లక్ క్యాటగిరీ భద్రత ఏర్పాటు చేశఆరు.
2. దంతేవాడ దాడి ప్రధాన సూత్రధారి సంబాల కేశవరావు
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు చేసిన దాడి దేశ చరిత్రలోనే ఘోరమైన దాడిగా పోలీసులు అభివర్ణిస్తారు. 2010 ఏప్రిల్ 6వ తేదీన సీఆర్పీఎఫ్కు చెందిన 75 మంది పోలీసులు, ఒక స్థానిక పోలీసుతో కలిసి కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు అంబుష్ వేసి దాడి చేశారు. తుపాకులతో కాల్పులు, గ్రెనెడ్లు, ఐఈడీలను పేల్చి సీఆర్పీఎఫ్ దళాలపై మావోలు విరుచుకుపడ్డారు. దీంతో 76 మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడిలో 300 మందికిపైగా మావోయిస్టులు పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేశారు. ఈ దాడుల సూత్రధారి సంబాల కేశవరావేనని పోలీసులు తెల్చిచెప్పారు.
3. రాజకీయ నాయుకులే లక్ష్యంగా జరిగిన అతి పెద్ద దాడి జీరంఘాట్ దాడి
జీరం ఘాట్ దాడి మే 25, 2013న జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జీరం ఘాట్లో మావోయిస్టులు జరిపిన దాడుల్లో 27 మంది మరణించారు. ఇది చాలా కీలకమైన దాడిగా చెబుతారు. రాజకీయ నాయకులు టార్గెట్గా జరిపిన దాడుల్లో ఇదే అతి పెద్ద దాడిగా పోలీసులు అభివర్ణిస్తారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, దర్బలోయలో జీరం ఘాట్ వద్ద జగదల్పూర్ - సుక్మా హైవేపై ఈ దాడి జరిగింది. 2013లో జరిగిన శాసన సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బస్తర్ ఏరియాలో పరివర్తన యాత్ర నిర్వహించింది. సుక్మా జిల్లా నక్సల్స్ అత్యంత ప్రభావితం చూపే ప్రాంతం. ఓ రకంగా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ ప్రకటించిన రెడ్ కారిడార్ ప్రాంతంగా చెప్పవచ్చు. పరివర్తన యాత్రలో పాల్గొన్న చత్తీస్ఘడ్ కాంగ్రెస్ నాయకులే లక్ష్యంగా మావోయిస్టులు అంబుష్ వ్యూహాన్ని అమలు చేశారు. ఏకే 47, ఇన్సాస్ రైఫిల్స్, గ్రెనెడ్లు, ఐఈడీ, ఆటోమెటిక్ ఆయుధాలతో కాంగ్రెస్ నేతల వాహన శ్రేణిపై ఆకస్మిక దాడి జరిపారు. దాదాపు 200 మంది మావోయిస్టులు ఇందులో పాల్గొన్నారు. ఈ దాడిలో 27 మంది మరణించారు. ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి సల్వాజుడుం సృష్టికర్త మహేంద్ర కర్మ ఈ దాడిలో మరణించారు. మావోలకు వ్యతిరేకంగా ప్రత్యేక దళం సల్వాజుడుంను రూపొందించి ఉద్యమం నడిపిన వ్యక్తి మహేంద్ర కర్మ. ఆయనతోపాటు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందకూమర్ పటేల్, ఆతని కుమారుడు దినేశ్ పటేల్, మాజీ కేంద్రమంత్రి విద్యాచరణ్ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ మద్లియార్, దాదాపు 10 మంది సెక్యూరిటీ సిబ్బంది, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీనికి మాస్టర్ మైండ్ సంబాల కేశవరావేనని పోలీసులు చెబుతున్నారు.
4. 2019లో గడ్చిరోలి ప్రతీకార దాడికి సూత్రధారి
మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఐఈడీ బాంబు దాడిలో 15 మంది సీ -60 కమాండోలు ప్రాణాలు కోల్పోయారు. వారితోపాటు ఒక సామాన్య పౌరుడు చనిపోయారు. ఈ దాడి 2019 లోక్సభ ఎన్నికల సమయంలో జరిగింది. ఎన్నికల వేళ మావోయిస్టులు తన ఉనికిని చాటుకోవడం కోసం చేసినట్లు పోలీసులు భావించారు. అంతేకాకుండా 2018లో గడ్చిరోలి లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 40 మంది మావోయిస్టులు చనిపోయారు. దీనికి ప్రతీకారంతో ఈ దాడి చేసినట్లు మావోయిస్టులు చెప్పారు. 2019 మే 1వ తేదీన రాత్రి దాదాపూర్ గ్రామంలో రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 30కుపైగా వాహనాలను తగులబెట్టారు. ఈ సమాచారంతో క్విక్ రెస్పాన్స్ టీమ్లోని 15 మంది సీ-60 కమాండోలు స్థానిక డ్రైవర్తో కలిసి పురాడా పోలీస్ స్టేషన్ నుంచి వాహనంలో వెళ్తుండగా లెందరీ నుల్లా అనే ప్రాంతం వద్ద ఉన్న కల్వర్ట్ కింద ఐఈడీలు పేల్చారు. దీంతో డ్రైవర్ సహా 16 మంది మరణించారు. 30-40 కిలోల ఆర్డీఎక్స్ వాడినట్లు తెలిసింది. ఈ దాడిలో టిప్పగడ్, దేవ్రీ, పెర్మిలీ, అహేరీ, కేకడి, ఎటపల్లి దళాలు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడి వ్యూహకర్త సంబాల కేశవరావుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
5. హిడ్మా ఉచ్చులోకి లాగి 2021లో బీజాపూర్ - సుక్మా దాడి
ఛత్తీస్గఢ్లోని సుక్మా- బీజాపూర్ సరిహద్దు ప్రాంతం జోనాగుడ గ్రామ సమీపంలో ఏప్రిల్ 3, 2021లో మావోయిస్టులు భద్రతాబలగాలపై దాడి చేశారు. ఇందులో 22 మంది పోలీసులు మరణించగా 31 మంది గాయపడ్డారు. భద్రతా దళాల చరిత్రలో ఈ దాడి ఘోరమైన దాడిగా పోలీసులు అభివర్ణిస్తారు. ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ అడవుల్లో సుక్మా- బీజాపూర్ సరిహద్దు, జోనాగూడ గ్రామ సమీపంలోని జగర్ గుండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దాడి జరిగింది. 2021 ఏప్రిల్ 2వ తేదీ రాత్రి సీఆర్పీఎఫ్, కోబ్రా యూనిట్, డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్, 2000 మంది కూంబింగ్లో పాల్గొన్నారు. పోలీసుల మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లీడర్ హిడ్మా సెర్చింగ్ ఆపరేషన్ ఇది. ఇంటలిజెన్స్ సమాచారంతో భద్రతా బలగాలు ఈ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే భద్రతా బలగాల ఉనికిని ముందాగానే పసిగట్టిన మావోయిస్టులు హిడ్మా సమాచారాన్నే తమ దాడికి ఉపయోగించుకుని విరుచుకుపడ్డారు. దాదాపు 400మంది మావోయిస్టులు 3 వైపుల నుంచి ఈ పోలీసు బలాగలను చుట్టుముట్టాయి. ఎల్ఎంజీ, రాకెట్ లాంచర్లు, ఐఈడీలతో వారిపై ముప్పేట దాడికి దిగారు. నాలుగు గంటలపాటు భీకరంగా పరస్పర దాడులు జరిగాయి. మూడు వైపులా మావోయిస్టులు ఉండటంతో భద్రతా బలగాలు తప్పించుకునే మార్గం లేని పరిస్థితి. ఈ దాడిలో 22 మంది మరణించగా, 31 మందికి గాయాలయ్యాయి. అయితే ఈ దాడి అంతా పక్కా ప్లాన్తో హిడ్మా ఇన్ఫర్మేషన్తో ప్రణాళికా బద్దంగా పోలీసులను ఉచ్చులోకి లాగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ దాడిలో 20 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులుచెబుతున్నారు. మరణించినమావోలను, గాయపడిన వారిని నాలుగు ట్రాక్టర్లలో మావోయిస్టులు తీసుకెళ్లినట్లు పోలీసు నివేదికలు చెబుతున్నాయి. ఈ పథకం సూత్రధారి సంబాల కేశవరావేనని పోలీసులు చెబుతున్నారు.






















