Anakapalli News: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడేళ్ల బాలిక వేపాడ దివ్య హత్యకేసులో నిందితునికి మరణశిక్ష
Anakapalli News:తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏడేళ్ల బాలిక వేపాడ దివ్య హత్యకేసులో నిందితునికి మరణశిక్ష విధించింది న్యాయస్థానం. దీంతోపాటు పదివేల రూపాయల జరిమానాకూడా వేసింది.

Anakapalli News:తెలుగు రాష్ట్రాల్లో 10 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఏడు సంవత్సరాల బాలిక వేపాడ దివ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితునికి మరణశిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించారు అనకాపల్లి జిల్లాలోని చోడవరం అదనపు జిల్లా న్యాయమూర్తి. వివరాల్లోకి వెళ్తే వేపాడ మురుగన్, ధనలక్ష్మి దంపతులు అనకాపల్లి జిల్లా లోని దేవరపల్లి గ్రామంలో హెూటల్ నిర్వహించేవారు. వారి ఒక్కగానొక్క కుమార్తె వేపాడ దివ్య, వయస్సు ఏడు సంవత్సరాలు. స్థానిక ఉషోదయ స్కూల్లో యూకేజీ చదువుకునేది. తాము నిర్వహిస్తున్న హోటల్లో పని చేయడానికి ధనలక్ష్మికి వరుసకు సోదరుడయ్యే ప్రకాశం జిల్లా, చీమకుర్తికి చెందిన గుణశేఖర్ సుబ్బాచారి అలియాస్ తంబీని పనికి కుదుర్చుకున్నారు. సుబ్బాచారి పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విసిగి వేసారిన పనిలో నుంచి తొలగించారు. దీంతో అవమానంగా భావించిన సుబ్బాచారి కక్ష కట్టాడు. కుటుంబం మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురుచూసాడు.
పగతో చిన్నారిని చంపేసిన కిరాతకుడు
2015 డిసెంబర్ 23వ తేదీన స్కూల్కి వెళ్లి వచ్చిన వేపాడ దివ్య సాయంత్రం నుంచి కనపడకుండాపోయిందని తల్లిదండ్రులు ధనలక్ష్మి, మురుగన్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎవరి మీదన్నా అనుమానం ఉందా అని మురుగన్ దంపతులను అడగ్గా దివ్య మేనమామ అయిన సుబ్బాచారి పేరు చెప్పారు. ఆ దిశగా పోలీసులు విచారించారు.
2015 డిసెంబర్ 24వ తేదీన ఉదయం 6 గంటలకు బిల్లాల మెట్ట వద్ద ఓ బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. బాలిక మృతదేహంపై కత్తితో కోసిన గాయాలున్నట్లు పోలీసులు గమనించారు. చనిపోయిన బాలికను దివ్యగా గుర్తించి, సుబ్బాచారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దివ్యను తానే హత్య చేసినట్లు నేరాన్ని ఒప్పుకొన్నాడు.
23వ తారీఖున దివ్య చదువుకుంటున్న ఉషోదయ స్కూల్ దగ్గరికి వెళ్లి, దివ్య చేతిలో 20 రూపాయలు పెట్టి గారెలు కొనుక్కోమని చెప్పాడు. అక్కడ నుంచి చిన్నారి దివ్యను రైవాడ జలాశయం సమీపంలోని బిల్లలమెట్ట కొండ వద్దకు తీసుకువెళ్లి పగలకొట్టిన బీరు సీసాతో పీక కోసి హత్య చేశాడు. నిందితుడు సుబ్బాచారి పోలీసుల వద్ద నేరం ఒప్పుకున్నాడు.
నిందితుడు సుబ్బాచారిపై అంతకు ముందే ఒంగోలులో వాహన దొంగతనం కేసు నమోదు అయిఉంది. ఈ కేసును విచారణ జరిపిన చోడవరం, 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి U/Sec 302 IPC ప్రకారం సుబ్బాచారిని దోషిగా నిర్ధారిస్తూ మరణశిక్ష, రూ.10,000/- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
మహిళలు,చిన్నారులపై నేరాలు చేస్తే తీవ్ర శిక్షలు తప్పవు :డీజీపీ హరీష్
కేసును ఛేదించిన, న్యాయస్థానం ముందు పటిష్టమైన సాక్ష్యాధారాలతో నిందితునికి ఉరి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారు. ఈ సందర్భంగా మహిళలపై నేరాలకు సంబంధించి గడచిన 8 నెలల్లో 97 నేరాలకు శిక్షలు పడ్డాయని అందులో 04 నేరాలకు 25 సంవత్సరాల జైలు శిక్ష, 22 నేరాలకు జీవిత ఖైదు, 17 నేరాలకు 20 సంవత్సరాల జైలు శిక్ష 4 నేరాలకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 50 నేరాలకు 07 సంవత్సరాల జైలుశిక్షలు పడ్డాయని డీజీపీ వెల్లడించారు. మహిళలు, చిన్నారులపై హత్య, అత్యాచారాలకు పాల్పడేవారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని డీజీపీ హెచ్చరించారు.





















