Lokesh Yuvagalam : జాదూరెడ్డి పాలనలో అంతా అరాచకం - యూత్ మేనిఫెస్టో ప్రకటిస్తామన్న లోకేష్ !
త్వరలో యూత్ నేమనిఫెస్టో ప్రకటిస్తామని టీడీపీ నేత నారా లోకేష్ ప్రకటించారు. పాదయాత్ర తొలి రోజు బహిరంగసభలో ప్రసంగించారు.

Lokesh Yuvagalam : జాదూరెడ్డి పాలనలో అన్ని వర్గాలు మోసానికి గురయ్యాయని టీడీపీ యువనేత నారా లోకేష్ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర ప్రాంభించిన లోకేష్ తొలి రోజు దారిమధ్యలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించారు. యువగళం, మనగళం, ప్రజాబలమని లోకేష్ ప్రకటించారు. యువగళం పేరు ప్రకటించిన వెంటనే వైసీపీ నేతల ప్యాంట్లు తడిశాయని ఎద్దేవాచేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు వేల కోట్ల పనులు చేశానని యువతకు ఉద్యోగాలు ఇప్పించానన్నారు. మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం పీకింది ఏమిటని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలుగుజాతి గర్వపడేలా దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఏపీకి టీడీపీ అధినేత చంద్రబాబు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. అయితే ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు.
రాజధానులు అన్నారని ఒక్క ఇటుక అయినా వేశారా? అని లోకేష్ ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమ అయినా ఏర్పాటు చేశారా అని నిలదీశారు. త్వరలో యువత కోసం యూత్ మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలిపారు. తనకు చీర, గాజులు పంపిస్తానని మహిళా మంత్రి అన్నారని, చీర, గాజులు పంపించాలని వాటిని మా అక్కాచెల్లెమ్మలకు ఇచ్చి కాళ్లు మొక్కుతానని పేర్కొన్నారు. తాను తల్లి, చెల్లిని గెంటేసేవాడిని కాదన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని తెలిపారు. జే బ్రాండ్తో మహిళల మంగళసూత్రాలు తెంపుతున్న జాదూరెడ్డి అని జగన్పై మండిపడ్డారు. ఏపీని రైతులు లేని రాజ్యం చేస్తున్నారని, రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడోస్థానంలో ఉందన్నారు.
జగన్ రెడ్డి అంటే జాదూ రెడ్డి అని దుయ్యబట్టారు. ఏడాదిలోనే 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ (Job Calendar) రిలీజ్ చేస్తానన్నారని గుర్తుచేశారు. ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా? అని లోకేష్ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి రావాల్సిన పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయని, జే ట్యాక్స్ కట్టలేదని పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారని తప్పుబట్టారు. ‘జే ట్యాక్స్ ఫుల్లు.. పెట్టుబడులు నిల్లు. పరిశ్రమలన్నీ బై.. బై.. ఏపీ అంటూ వెళ్లిపోతున్నాయి’ అని లోకేష్ తెలిపారు. చంద్రబాబు హయాంలో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు.
‘‘జగన్ రెడ్డి సాగునీటి పనులను పడుకోబెట్టారు. టీడీపీ ప్రభుత్వం రాగానే సాగునీటి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో ఇసుక దొరకడం లేదు. ఇసుకను జాదూరెడ్డి దోచేస్తున్నారు. భవన నిర్మాణ పనులు నిలిచి కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఉచితంగా ఇసుక సరఫరా చేస్తాం’’ అని లోకేష్ ప్రకటించారు. నా మీద మాటల దాడికి 10 మంది మంత్రులను పెట్టారు. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని ప్రశ్నించారు. ఆ మంత్రులను మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికని ప్రశ్నించారు. వీధుల్లో డ్యాన్సులు వేస్తే.. క్యాసినో ఆడిస్తేనో పరిశ్రమలు రావని ఎద్దేవా చేశారు. మీరు చేసిన దానికి వడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తానని.. మీ చేత కక్కించే ప్రతి రూపాయి కుప్పంలో పేద ప్రజలకు ఖర్చు చేస్తానని ప్రకటించారు. మీ జీవో నెంబర్ 1 మడతపెట్టి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో వారాహి ఆగదు.. ఈ యువగళం ఆగదు...మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు.
Before You Go
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















