Konaseema Politics: ఏపీ మంత్రి సుభాష్ వైసీపీ కోవర్టా? పార్టీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు! రాజకీయ దుమారానికి కారణం ఇదేనా?
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ కోవర్టుగా మారి సొంత పార్టీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుపై విజిలెన్స్ కమిటీకు ఫిర్యాదు చేశాడని, వైసీపీ నేత ఆరోపణలు చేయడం మరింత అగ్గిని రాజేసింది..

Vasamsetti Subhash News Updates | శెట్టిబలిజ సమాజిక వర్గానికి జారీ చేసే కుల దృవీకరణ పత్రాల్లో గౌడ్ శెట్టిబలిజ పేరున పత్రాలు జారీ అవుతుండడంపై వైసీపీకి చెందిన శెట్టిబలిజ నేతలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతున్న నాటి నుంచి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రాజుకున్న రగడ నానాటికీ ముదురుతోంది. ఇది టీడీపీ, వైసీపీ శెట్టి బలిజ నాయకుల్లో మరింత మాటల యుద్ధం కొనసాగుతోంది. చినికి చినికి గాలివానలా మారి ఇప్పడు టీడీపీలోనే నిప్పును రాజేసింది. అది ఎంతలా అంటే ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ కోవర్టుగా మారి సొంత పార్టీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుపై విజిలెన్స్ కమిటీకు ఫిర్యాదు చేశారని, వైసీపీ నేత ఆరోపణలు చేయడం మరింత అగ్గి రాజేసింది.
వివాదం రేగిందిలా.. తారా స్థాయికి చేరిందిలా...
ఇటీవల శెట్టిబలిజ సామాజిక వర్గీయులకు కుల దృవీకరణ పత్రాల్లో శెట్టిబలిజ అని కాకుండా గౌడ్ శెట్టిబలిజ అని రావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన అమలాపురానికి చెందిన వైసీపీ నేతలు కోనసీమ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అక్కడున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా దీనిపై స్పందించి ఇది ముమ్మాటికీ శెట్టిబలిజలను ఓసీలోకి మార్చే కుట్ర అని విమర్శించారు. అధికార పార్టీలో ఉన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ శెట్టిబలిజ అయి ఉండి అవగాహన లేకుండా ఉన్నారా అంటూ ప్రశ్నించారు.
దీనికి కౌంటర్గా మాట్లాడిన మంత్రి సుభాష్ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. నువ్వు ఒక జోకర్లా మాట్లాడుతున్నావని, చిర్ల జగ్గిరెడ్డివి కాదు నువ్వు చీరల జగ్గిరెడ్డి అంటూ వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. దీనికి కౌంటర్గా అమలాపురం చిర్ల జగ్గిరెడ్డితోపాటు పట్టణ వైసీపీ శెట్టిబలిజ నాయకులు వేర్వేరుగా ప్రెస్మీట్లు పెట్టి మండిపడ్డారు. ఈ సమావేశంలో వైసీపీ నేత, మంత్రి సామాజిక వర్గానికి చెందిన సంసాని నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
మంత్రి సుభాష్ వైసీపీ కోవర్టు అన్న వైసీపీ నేత..
టీడీపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా అమలాపురం పట్టణ వైసీపీ నేత సంసాని బులినాని చేసిన వ్యాఖ్యలు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రిగా ఉన్న టీడీపీ నేత వాసంశెట్టి సుభాష్ వైసీపీ కోవర్టు అని, నీ పార్టీకి చెందిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తలు ఆనందరావుపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయించావని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే మంత్రి సుభాష్ విజిలెన్స్ కంప్లైంట్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. మంత్రి సుభాష్ వ్యవహార శైలి వల్ల బీసీ సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయని, అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తూ సొంత సామాజిక వర్గానికి అందర్నీ దూరం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. గతంలో ఎంతో మంది శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి మంత్రులుగా పనిచేశారని, అయితే వారు చాలా హుందాగా వ్యవహరించేవారని, నువ్వు అయితే దిగజారి ప్రవర్తిస్తున్నావని దుయ్యబట్టారు.
మంత్రి సుభాష్, ఎమ్మెల్యే ఆనందరావుల మధ్య పొసగడం లేదా..
అమలాపురానికి చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి తొలిసారిగా గెలవడమే కాదు.. సామాజిక సమీకరణాల్లో ఏకంగా మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. అమలాపురం నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యే అయిన అయితాబత్తుల ఆనందరావు మంత్రి పదవి ఆశించారు కానీ ఆయనకు దక్కలేదు.. దీనిపై కొంత అసంతృప్తిలో ఉన్న ఆనందరావు, మంత్రి సుభాష్ల మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవనే చెప్పవచ్చు. తన నియోజకవర్గంలో కొన్ని వ్యవహారాల్లో మంత్రి సుభాష్ పెత్తనం కొనసాగుతోందని ఎమ్మెల్యే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని వినిపిస్తోంది. అయితే మంత్రి సుభాష్ దీనిని పలుస్లార్లు కొట్టిపడేశారు.
అమలాపురం మున్సిపాలిటీలో జరుగుతోన్న అభివృద్ధి పనులకు సంబందించి మాత్రం ఎమ్మెల్యే వర్గీయులకు, మంత్రి సుభాష్ వర్గీయులకు మధ్య అంతర్గత పోరు మాత్రం నడుస్తోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నాడంటూ కొంత మంది విజిలెన్స్ కు కంప్లైంట్ చేయడం వెనుక మంత్రి ఉన్నారని, దీనికి బలం చేకూరేలా వైసీపీ నేత తాజాగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయించాడన్న ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఈ ఎపిసోడ్లో టీడీపీ ఎమ్మెల్యే అయితాబత్తలు ఆనందరావు సైలెంట్గా ఉండడం గమనార్హం..





















