AP CM Chandrababu: వేట్లపాలెంలో బాణసంచా పేలుడు స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు, సహాయక చర్యలు, బాధితులకు వైద్య చికిత్సపై అధికారులను ఆరా తీశారు.

Chandrababu Visits Vetlapalem Firecracker Blast Site | సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుడు జరిగిన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. ప్రమాద తీవ్రతను దృష్ట్యా ఆయన తక్షణమే వేట్లపాలెం చేరుకున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ వాహనంలోనే సీఎం చంద్రబాబు నేరుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే చంద్రబాబు పేలుడు జరిగిన బాణసంచా తయారీ కేంద్రం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, దానికి గల కారణాలేమిటి అనే అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు అక్కడి జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ ఆయనకు వివరించారు. అనంతరం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ నుండి సహాయక చర్యలు, మృతుల వివరాలకు సంబంధించి మరిన్ని కీలక వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదాలు జరగడానికి గల కారణాలు విశ్లేషించి, వీటిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
కాకినాడ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో విషాదం
కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అనేకమంది కార్మికులు మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్నారు. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించగా.. మంటలు అంటుకుని చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల మేర పొగలు వ్యాపించాయి. ఇప్పటివరకు 21 మంది మరణించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో మహిళా కార్మికులు అధికంగా ఉన్నారు. కొందరి మృతదేహాలు ముక్కలు ముక్కలుగా తెగిపడి కొంత దూరంలో ఎగిరిపడ్డాయి. కొందరు కార్మికుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. తమ తల్లిదండ్రులు, అన్నాచెల్లెళ్లు, సోదరుల జాడ తెలియక కొందరు బాధితుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
























