Chandrababu on Population: ఏపీకి వయసైపోతోంది. - కుర్రాడు చంద్రబాబు చెప్పేది కాస్త వినండి !
Family Plan: పిల్లల్ని కనాలని తెలుగు ప్రజలకు చంద్రబాబు పిలుపునిస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీకి అర్హత ఉండేలా చట్టం చేస్తామంటున్నారు. ఇంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు ?

Chandrababu Family Plan: పిల్లలని కనండి.. వాళ్లే మీ ఆస్తి. అని అధికారంలోకి వచ్చినప్పుటి నుంచీ చంద్రబాబు ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఎవరైనా జనాభా తగ్గించమని చెబుతారు... ఈయనేంటి పెంచమంటున్నారు... కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నారా.. అని ప్రశ్నించేవాళ్లున్నారు. కొంపతీసి చంద్రబాబు చెప్పే సంపద సృష్టి అంటే ఇదేనా అని ఎద్దేవా చేసేవాళ్లూ లేకపోలేదు. అసలు చంద్రబాబు ఏం చెప్పారు.. జనాలకు ఏం అర్థమవుతోంది.,? అందులో రాజకీయ విమర్శలు ఏంటనేది పక్కన పెట్టి ఆయన ఎందుకు అలా చెబుతున్నారు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు అంత ఆందోళన ?
జనాభా తగ్గిపోవడం ఇప్పుడు ప్రపంచదేశాల సమస్య
పాపులేషన్ డెఫిషిట్ అన్నది ఇప్పుడు చాలా దేశాలను ఇబ్బంది పెడుతున్న సమస్య.. జపాన్, చైనా , సౌత్ కొరియా ఇలా కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ముసలివాళ్లు పెరిగిపోయి ఉత్పత్తి తగ్గిపోయి ఆందోళన పడుతున్నాయి. వయోభారం వల్ల పదేళ్లలో జపాన్ జీడీపీ 1.4శాతం తగ్గిపోయింది. ఇక చైనా సరేసరి. ఇప్పుడు ఆ సమస్య ఇండియాకు పొంచి ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో దీనితో ఇబ్బంది పడాల్సిందే. దీని గురించి చర్చ జరగాల్సిందే. సహజంగానే పాజిటివ్ థింకింగ్.. ప్యూచర్ అవుట్లుక్ ఉన్న చంద్రబాబు దీని గురించి మొదట మాట్లాడారు. ఎన్నికలకు ముందే ఆయన దీని గురించి మాట్లాడటం స్టార్ట్ చేసినా ఎన్నికల తర్వాత ఎక్కువ మీటింగ్లలో దీని గురించి చెప్పారు. నిన్నా మొన్నా.. అయితే స్థానిక ఎన్నికల్లో ఎక్కువ మంది పిల్లలుంటేనే పోటీ కి అవకాశం కల్పించాలేమో అని వ్యాఖ్యలు కూడా చేశారు.
దేశంలో తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు
వ్యతిరేక వ్యాఖ్యలు వస్తున్నా.. ఇంత ముందుకెళ్లి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటా అని విశ్లేషిస్తే కళ్లు బైర్లు గమ్మే వాస్తవాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ దీని గురించి మాట్లాడుకోవాలి. ఆయన అదే చేస్తున్నారు.
టోటల్ ఫర్టిలిటీ రేట్... TFR అంటే.. మహిళల్లో సంతానోత్పత్తి వయసు 19-49 ఏళ్లు అని లెక్కించి.. ఆ మొత్తం వయసులో వాళ్లు ఎంత మంది పిల్లలను కనగలరు అనే సగటను లెక్కిస్తారు. తాజా డేటా ప్రకారం ఇండియాలో TFRరేట్ 2.0 . మహిళల్లో ఈ సగటు 2.1 ఉంటే దానిని రీప్లేస్మెంట్ లెవల్ కింద లెక్కగడతారు. అంటే పది మంది మహిళలు తమ జీవిత కాలంలో 21మంది బిడ్డలకు జన్మనిస్తే.. ఇప్పుడున్న జనాభా పెరుగుదల రేటు యథావిధిగా ఉంటుంది. అది తగ్గిందంటే ముసలి వాళ్లు పెరుగుతారు.. జనం తగ్గుతారు. ఇదే పద్ధతిలో వెళితే 2050నాటికి ఇండియాలో 20శాతం ముసలివాళ్లే అంటే 60 ఏళ్ల పైబడిన వారే ఉంటారు. ప్రస్తుతం అది 10శాతం మాత్రమే. ప్రంపంచంలో ఏ దేశానికి లేనంత అనుకూలత ఇండియాకు ఉంది. ప్రపంచంలోనే అత్యధికమంది పనిచేసే మానవవనరులు (15-64 ఏళ్లు) ఇక్కడ ఉన్నారు. ఇది 2100 నాటికి 67శాతం నుంచి 58కి పడిపోతుందని యునైటైడ్ నేషన్స్ అంచనా వేస్తోంది. అంటే మన ఉత్పాదక సామర్థ్యాన్ని మరి కొన్నేళ్ల తర్వాత కొద్దికొద్దిగా కోల్పోతమన్నామాట..
ఏపీకి వయసు మళ్లుతోంది.!
ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ ఘోరం. ఏపీ దేశంలో అత్యంత తక్కువ TFR ఉన్న రాష్ట్రం. ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ 1.7. అంటే బర్త్ రేట్ తిరోగమనంలో ఉంది. మరో ఐదారేళ్లలోనే మన జనాభా పెరుగుదల నిలిచిపోయి.. ఆ తర్వాత ఐదేళ్లకు అంటే 2041 నుంచి రివర్స్ అవ్వడం మొదలవుతుంది. భారత్లో 2051కి రివర్స్ అయితే మనకు పదేళ్ల ముందే మొదలవుతుంది. దాని గురించే చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. పదే పదే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
జనాభా తగ్గితే ఏమవుతుంది.? జనాభా తగ్గించమని ఎప్పటి నుంచో చెబుతున్నారు కదా.. తగ్గితే ప్రజల మీద భారం తగ్గుతుందని చాలా మంది వాదిస్తుంటారు. అప్పుడు వనరులు తక్కువ. అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడంతా ప్రొగ్రెసివ్.. ప్రొడక్టివిటీనే. ఆంధ్రప్రదేశ్లో 60ఏళ్ల పైబడిన వారు జనాభాలో 13.4 శాతం. జాతీయ సగటు 10.1శాతం మాత్రమే. ఇదిలాగే కొనసాగితే 2050నాటికి 18శాతం మంది వృద్ధులే ఉంటారు. ఏపీ వర్రీ అవుతున్న మరో విషయం వలసలు. ఈ రాష్ట్రం నుంచి 15 శాతం వర్క్ ఫోర్స్ ప్రతీ ఏటా పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, విదేశాలకు తరలిపోతోంది. పుట్టేవాళ్లు తక్కువై... పనిచేసే వాళ్లు బయటకు వెళ్లిపోయి.. వయసుమళ్లిన వాళ్లతో రాష్ట్రం నిండిపోతే ఏమవుతుంది...? అదే చంద్రబాబు చెబుతోంది.
సగటు వయసు పెరిగితే వచ్చే సమస్యలు ఇవి !
పెద్దవాళ్లకు వయసు పెరిగితే ఆరోగ్య సమస్యలొస్తాయి. కానీ ఓ రాష్ట్రానికి వయసు పెరిగితే ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి. వర్కింగ్ ఏజ్ జనాభా తగ్గిపోవడం వల్ల 2040 తర్వాత ఏపీ జీడీపీ 0.5శాతం తగ్గిపోతుంది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఎక్కువ మంది మానవవనరులు అవసరం ఉన్న వ్యవసాయ, ఐటీ రంగాల్లో మనుషుల కొరత వస్తుంది. ఇప్పటికే మనం పల్లెల్లో చూస్తూ ఉన్నాం.. పొలం పనులు చేసే జనాలు తగ్గిపోయారు. బెంగాల్, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అగ్రికల్చర్లో తొందర్లోనే 12-15శాతం మానవవనరుల లోటు కనిపించనుంది,
వృద్ధుల డిపెండన్సీ బాగా పెరుగుతుంది. అంటే సంపాదించే క్లాస్పైన ఆధారపడే వృద్ధుల సంఖ్య ఇప్పుడున్న 16శాతం నుంచి 2035 నాటికి 24శాతానికి పెరుగుతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిందంటే వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ ఏజ్ పెన్షన్లు పెరుగుతాయి. వారిపై చేసే వైద్య పరమైన ఖర్చు కూడా పెరుగుతుంది. 2035నాటికి ప్రభుత్వానికి వృద్ధుల సంక్షేమానికి అయ్యే ఖర్చు 35శాతం పెరగనుంది.
ఇక్కడ వచ్చే మరో ముఖ్యమైన సమస్య జనాభా అసమానతలు. రాయలసీమలోని కడప, అనంతపురం జిల్లాల్లో ఫెర్టిలిటీ రేట్ 2.2 ఉంటే విశాఖలో అది 1.5శాతం ఉంది. ఇప్పుడు ఎలాగైతే.. జనాభా ఎక్కువ రాష్ట్రాలు బీహార్, యూపీ ఎక్కువ నిధులు పొందుతున్నాయని సౌత్ రాష్ట్రాలు విమర్శిస్తున్నాయో అదే వ్యాఖ్యలు రాష్ట్రంలోనే వచ్చే అవకాశాలు ఉంటాయి.
పెళ్లి, పిల్లలుపై మారిపోతున్న యువత అభిప్రాయం!
ఓ పక్క ఫర్టిలిటీ రేటు ఇప్పటికే తగ్గిపోతుంటే..యువత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే అంశంలో ఆలస్యం చేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి వయసు తగ్గించినా 20 ఏళ్లకు పెళ్లి చేసుకునేవాళ్లు ఎవరూ లేరు. అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా 30 దాటిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అసలు పెళ్లే వద్దనే వారు.. పెళ్లిచేసుకున్నా పిల్లల్ని మాత్రం కనం అంటున్నవారు పెరిగిపోతున్నారు. నేటి ఐటీ జంటల్లో 30-35 ఏళ్లు వచ్చే వరకూ పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. పోనీ చేసుకున్నా ఒక్కర్నే కనేవారు.. లేదా అసలు కననివారే ఎక్కువ. ఇది చాలదన్నట్లు ప్రతి ఆరుగురిలో ఒకరికి ఫెర్టిలిటీ సమస్యలున్నాయి.
కొన్ని దశాబ్దాలుగా ఇద్దరు లేదా ఒకరికే పరిమితమైన కుటుంబాల్లో ఇప్పుడు మార్పు వస్తుందా అంటే సందేహమే. అంతే కాదు. ఇప్పుడు జరిగే కాన్పుల్లో 25శాతం సిజీరియన్లు. ఈ ఆపరేషన్లు చేయించుకుని ఎక్కువ మంది పిల్లలను కనడం సాధ్యం కాదు. పైగా ఇప్పుడు గంపడేసి పిల్లలను కనగలిగే సామర్థ్యం, పెంచగలిగే స్థోమత తల్లిదండ్రులకు ఉందా...? అంతమంది పిల్లలను ఇప్పటి న్యూక్లియర్ కుటుంబాల్లో ఎలా సాకగలరు అని ప్రశ్నించే వాళ్లున్నారు.
చంద్రబాబు విజన్ ఇదీ…!
విజన్ 2047 అంటూ గోల్ పెట్టిన చంద్రబాబు.. అందులో ముఖ్యమైన పారామీటర్ గా డెమోగ్రఫీ డివిడెంట్ను పరిగణిస్తున్నారు. పిల్లలను కనండి అంటూ మౌఖికంగా చెబుతున్న ఆయన త్వరలోనే పాలసీ డెసిషన్ తీసుకోవచ్చు కూడా. ఇంకో వైపు రాష్ట్రంలోని వర్క్ ఫోర్స్ బయటకు జారిపోకుండా ‘Skill AP’ వంటి ప్రోగ్సామ్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక పిల్లలు కనడానికి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించొచ్చు.
మొత్తం మీద ఈ విషయంపై ఫోకస్ పెట్టడం ద్వారా తాను ఫూచరిస్టు అని బాబు మరోసారి నిరూపించుకున్నారు. చంద్రబాబు వయసులో ఓల్డే… కానీ థింకింగ్ లో మాత్రం యంగ్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

