AP Education Reforms: ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మారిన లక్ష మందికిపైగా విద్యార్థులు - గిరిజన స్కూళ్లన్నింటికీ సొంత భవనాలు - లోకేష్ కీలక ప్రకటన
Nara Lokesh:రంపచోడవరం మెగా PTMలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలుచేశారు. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లకు 1.10 లక్షల మంది విద్యార్థులు మారారని తెలిారు. గిరిజన ప్రాంతాల్లో బడులకు సొంత భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు.

Mega PTM Rampachodavaram: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో చారిత్రాత్మక మార్పులు ఆవిష్కృతమవుతున్నాయని, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ పూర్వవైభవం వచ్చిందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రంపచోడవరం గవర్నమెంట్ హైస్కూల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీట్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రెండేళ్ల సమిష్టి కృషి ఫలితంగా ఈ ఒక్క ఏడాదే సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ బడుల్లో చేరారని ఆనందం వ్యక్తం చేశారు. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్’ బోర్డులు కనిపిస్తుండటం విద్యావ్యవస్థలో వచ్చిన గుణాత్మక మార్పునకు నిదర్శనమని పేర్కొన్నారు.
నగరం నుంచి మారుమూల గిరిజన ప్రాంతాల వరకు విద్యను సమానంగా అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నాటికి గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మిస్తామని, శిథిలావస్థలో ఉన్న భవనాలకు మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు నడిచిన త్యాగాల నేల రంపచోడవరం నుంచి మెగా PTM' జరుపుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. గురువులు, తల్లిదండ్రులు సమాజంలో కనిపించే దేవుళ్లని, వారి ఆశీస్సులతోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ సాధన సాధ్యమవుతుందని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
పాఠశాలలు, కళాశాలల్లో రాజకీయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశామని, పుస్తకాలపై గానీ, విద్యా పథకాలపై గానీ ముఖ్యమంత్రి లేదా తన ఫోటోలు ముద్రించే సంస్కృతికి స్వస్తి చెప్పామని మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేట్ సంస్థల ప్రకటనలకు భిన్నంగా, చరిత్రలో తొలిసారిగా పదో తరగతి, ఇంటర్మీడియట్ రికార్డు ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఫోటోలతోనే అధికారిక ప్రకటనలు ఇచ్చామని తెలిపారు. విద్యార్థుల ఫలితాలే విద్యాశాఖ మంత్రిగా నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అని పేర్కొన్న లోకేష్, మెగా డీఎస్సీ ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, వన్ క్లాస్-వన్ టీచర్ విధానం , డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు ద్వారా నిబద్ధతతో పనిచేస్తున్నామని వివరించారు.
విద్యతో పాటు ప్రతి విద్యార్థికీ నైతిక విలువలు అత్యంత ముఖ్యమని లోకేష్ ఉద్ఘాటించారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సలహాలతో రూపొందించిన నైతిక విలువల పుస్తకాలను విద్యార్థులకు అందిస్తున్నామని చెప్పారు. మహిళలను, ఆడపిల్లలను కించపరిచే వ్యాఖ్యలను సమాజం ఏమాత్రం సహించకూడదని, వారి గౌరవాన్ని కాపాడటంలో రాజీ పడేదే లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కుటుంబాల్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం ద్వారా ఏటా రూ. 15,000 సహాయాన్ని అందిస్తున్నామని, గత ప్రభుత్వంలోలా ఒకరికే ఇచ్చి మరొకరి చదువును ఆపే కుట్రలకు తమ ప్రభుత్వం తావు ఇవ్వదని స్పష్టం చేశారు.
పాఠశాల స్థాయిలోనే సాంకేతికతను మిళితం చేస్తూ క్లిక్కర్ మోడల్ , విద్యా పురోగతిని పర్యవేక్షించేందుకు లీప్ యాప్, శనివారం నో బ్యాగ్ డే వంటి వినూత్న విధానాలను అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. విద్యార్థులకు ఆస్తులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు కానీ, గొప్ప చదువును, ధైర్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని వివరించారు. ఆస్తి ఒక తరాన్ని మాత్రమే నిలబెడితే.. నాణ్యమైన విద్య తరతరాలను నిలబెడుతుందని, రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
Before You Go
Amaravathi - Vijayawada Steel Bridge | విజయవాడ - అమరావతికి ఈజీ రూట్ సిద్ధం.. స్టీల్ బ్రిడ్జ్లు రెడీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















