Nara Lokesh Delhi Tour: ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించండి, కేంద్ర మంత్రి జైశంకర్ను కోరిన నారా లోకేష్
Andhra Pradesh News | ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి జైశంకర్ను లోకేష్ కోరారు.

Data center In Vasakhapatnam | న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ యువతను అంతర్జాతీయ స్థాయిలో తయారుచేసేందుకు అవసరమైన శిక్షణా, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం మద్దతు ఇవ్వాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ను కోరారు. విశాఖపట్నంలో ఎఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణను విస్తరించాలని, వీటి ద్వారా రాష్ట్రం భవిష్యత్తులో టెక్నాలజీ హబ్గా మారే అవకాశముందని మంత్రి వివరించారు.
వలస కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు, స్కిల్ అభివృద్ధిలో సహకారం కావాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లే కార్మికుల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం ప్రవాస భారతీయ బీమా యోజన వంటి పథకాలను విస్తరించాలని కోరారు. ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్రంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, నిధుల మంజూరుపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాన్క్లేవ్లలో భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కిల్ కాన్క్లేవ్ కార్యక్రమాల్లో కేంద్రం భాగస్వామ్యాన్ని కల్పించినందుకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు కేంద్రం నిరంతర సహకారం అందించాలని కోరారు. తాజా సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర బృందం వివిధ రంగాల్లో అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిగిన చర్చల వివరాలను జైశంకర్కు వివరించిన లోకేష్, కేంద్రం పూర్తి మద్దతు కావాలని తెలిపారు.
న్యూఢిల్లీలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ గారితో సమావేశమయ్యాను. ఇటీవల ఏపీ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి వివరించాను. ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ… pic.twitter.com/FJm8jXEH1N
— Lokesh Nara (@naralokesh) August 18, 2025
ప్రవాసాంధ్రుల సంఖ్య, ఆదాయ స్థాయిపై వివరాలు
ప్రపంచవ్యాప్తంగా 35 లక్షలమంది ప్రవాసాంధ్రులు ఉన్నారు:
అమెరికాలో: 10 లక్షల మంది
గల్ఫ్ దేశాల్లో: 8 లక్షల మంది
ఐరోపాలో: 4 లక్షల మంది
అక్కడి ప్రజల తలసరి ఆదాయం $70,000 కాగా, ప్రవాసాంధ్రుల ఆదాయం $1,26,000గా ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలపై దృష్టి పెడుతూనే యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, కొరియా, తైవాన్ వంటి దేశాలతో మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్ షిప్ అరేంజ్మెంట్స్ (MMPA) ఏర్పాటు చేయడంలో కేంద్రం చేపట్టిన చర్యలను లోకేష్ ప్రశంసించారు.
భారత్ను ప్రపంచ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో కలిసి స్కిల్ డెవలప్మెంట్, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో పాటు జాయింట్ ట్రైనింగ్ & అసెస్మెంట్, ట్విన్నింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ కోసం పనిచేస్తున్నామని తెలిపారు. త్వరలో నైపుణ్య పోర్టల్ ప్రారంభించనున్నామని, ఇది ఉద్యోగార్థులు, పారిశ్రామిక సంస్థల మధ్య వేదికగా పనిచేస్తుందని వివరించారు.
భవిష్యత్ లో డాటా షేరింగ్ అవసరం
విదేశీ ఉద్యోగ అవకాశాలను పెంచడానికి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం రప్పించేందుకు కేంద్రం నుండి డాటా షేరింగ్ సహకారం అందించాలని నారా లోకేష్ కేంద్ర మంత్రిని కోరారు.






















