MLC Anantha Babu: హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య ముందస్తు బెయిల్ పిటిషన్!
Driver Subramanyam Murder Case | డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ పాత్ర ఉందని సిట్ తేల్చడంతో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

MLC Anantha Babu | అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ వచ్చే వరకు సిట్ (SIT) అధికారులకు అందుబాటులో ఉండకూడదని ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లక్ష్మీదుర్గ పరారీలో ఉండటంతో, ఆమె ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు.
ఈ కేసు విచారణలో భాగంగా పాత విషయాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. గతంలో ఘర్షణ సమయంలో అనంతబాబు తోయడం వలనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ప్రాణాలు కోల్పోయాడని అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించడం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన సిట్ అధికారులు.. నాటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబుతో పాటు డీఎస్పీ మురళీకృష్ణారెడ్డిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విచారణ ద్వారా హత్యకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర..
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ (SIT) దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్తో కేసు కీలక మలుపు తిరిగింది. దళిత యువకుడైన సుబ్రహ్మణ్యం హత్యలో ఎమ్మెల్సీ అనంత బాబుతో పాటు ఆయన భార్య అనంత లక్ష్మి దుర్గ పాత్ర ఉందని సిట్ నిర్ధారించింది. ఆమె ఈ హత్యకు ప్రేరేపించడమే కాకుండా, నేరానికి సంబంధించిన అన్ని దశల్లోనూ తన భర్తకు సహకరించినట్లు దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. దీంతో ఈ కేసులో ఆమెను కూడా నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు.
తన భార్యపై ఛార్జిషీట్ విషయం తెలియగానే, ఎమ్మెల్సీ అనంత బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. శాసనమండలిలో ఉన్న ఆయన, కనీసం తన వ్యక్తిగత సిబ్బందిని లేదా గన్మెన్లను కూడా తీసుకోకుండా హుటాహుటిన అక్కడి నుండి వెళ్ళిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తన భార్య అరెస్టు కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లక్ష్మీదుర్గ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
వైసీపీ హయాంలో హత్య..
2022 మే 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అప్పట్లో అనంతబాబు స్వయంగా మృతదేహాన్ని తన కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించగా, తమ కొడుకును ఎమ్మెల్సీనే హత్య చేశాడని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలో గతంలో అరెస్ట్ అయిన అనంత బాబు ప్రస్తుతం బెయిల్పై ఉండగా, ఆయన భార్య పేరును ఛార్జ్ షీటులో చేర్చిన తరువాత భార్యాభర్తలు అజ్ఞాతంలోకి వెళ్లగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో ఏపీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితుడికి మేలు చేసేలా, అతనికి డిఫాల్ట్ బెయిల్ వచ్చే వరకు ఆగి ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై ధర్మాసనం ప్రశ్నించింది. కేసు దర్యాప్తు మీ వల్ల కాకపోతే సీబీఐకి అప్పగిస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
























