Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
Chandrababu Naidu: సైనస్ సమస్యతో చేయించుకున్న పవన్ కళ్యాణ్ను పరామర్శించేందుకు చంద్రబాబు స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు.

Chandrababu Naidu meets Pawan Kalyan in Hyderabad: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల పవన్ కళ్యాణ్కు ముక్కుకు సైనస్ సమస్యకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి పరామర్శకు వెళ్లారు. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ , ఆయన సతీమణి అనా కొణిదెల సాదరంగా ఆహ్వానం పలికారు.
సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. సర్జరీ తర్వాత వైద్యులు సూచించిన విశ్రాంతి, రికవరీ ప్రక్రియ గురించి ఆరా తీశారు. పవన్ త్వరగా కోలుకుని తిరిగి పూర్తిస్థాయిలో ప్రజాసేవలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన శస్త్రచికిత్స వివరాలను, ప్రస్తుతం తీసుకుంటున్న జాగ్రత్తలను ముఖ్యమంత్రికి వివరించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పరామర్శించేందుకు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ గారి నివాసానికి… pic.twitter.com/wKs4ooU7Hf
— LAKSHMIVENUGOPAL 🌞 (@venupro) May 2, 2026
కేవలం పరామర్శకే పరిమితం కాకుండా, ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనులపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు, కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలు, రాబోయే అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై ప్రాథమికంగా అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభుత్వం చేపట్టబోయే కీలక నిర్ణయాల విషయంలో ఇరువురు అగ్రనేతల మధ్య ఉన్న సమన్వయం ఈ భేటీతో మరోసారి స్పష్టమైంది.
ముఖ్యమంత్రి పర్యటనతో పవన్ కళ్యాణ్ నివాసం వద్ద సందడి నెలకొంది. ఎన్నికల విజయం తర్వాత ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడిందనే సంకేతాలు ఈ పరామర్శ ద్వారా వ్యక్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే ఆయన అమరావతికి తిరిగి వచ్చి విధుల్లో చేరుతారని జనసేన వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















